వెనక్కు తగ్గిన శివసేన | Sakshi
Sakshi News home page

వెనక్కు తగ్గిన శివసేన

Published Mon, Aug 4 2014 11:32 PM

Shiv Sena backs rape-accused cop, model calls it a threat

ముంబై: మగాళ్లపై అత్యాచార ఆరోపణలు చేయడం ఫ్యాషన్‌గా మారిందంటూ సామ్నా సంపాదయకీయంలో రాసిన వివాదాస్పద రాతలపై శివసేన వెనక్కు తగ్గినట్లు కనిపిస్తోంది. ‘ఐపీఎస్ అధికారి సునీల్ పరాస్కర్ వివాదం నేపథ్యంలో సామ్నా రాసిన సంపాదకీయాన్ని తప్పుగా అర్థం చేసుకొని శివసేన పార్టీని అప్రతిష్టపాలు చేసే కుట్ర జరుగుతోంది. అత్యాచారమనేది తీవ్రమైన నేరమే. ఈ విషయంలో శివసేనకు మరో అభిప్రాయం లేదు.

 అయితే ఎటువంటి ఆధారాలు లేకుండా అత్యాచార ఆరోపణలు చేయడం కూడా తీవ్రమైన నేరమే’నని తాజా సంపాదకీయంలో శివసేన స్పష్టం చేసింది. అత్యాచార బాధితురాలు కేసు నమోదు చేయాలని సంపాదకీయంలో స్పష్టంగా చెప్పామని పేర్కొంది. ఒకవేళ ఫిర్యాదు చేసినా ఐదారు నెలల్లో వైద్యపరమైన సాక్ష్యాలు విలువలేనివిగా మారిపోతాయని, కేసు అనేక మలుపులు తిరుగుతుందనే అభిప్రాయాన్ని మాత్రమే తాను వ్యక్తం చేశామని శివసేన పేర్కొంది.

మరాఠీలో రాసిన సంపాదకీయాన్ని అనువాదం చేసే సమయంలో అనేక వక్రీకరణలో చోటుచేసుకున్నాయని, అంతా శివసేనవైపే వేలెత్తి చూపుతున్నారే తప్ప మరోవైపు చూడడంలేదని పేర్కొంది. టీవీ చానళ్లు, కొన్ని పత్రికలు జర్నలిజంపై అత్యాచారం చేశాయని విమర్శించింది. ప్రెస్ కౌన్సిల్ ఈ విషయంపై దృషి సారించాలని శివసేన డిమాండ్ చేసింది. సామ్నా సంపాదకీయం విషయంలో ఎటువంటి వివాదానికి తావులేదని, సునీల్ పరస్కార్ కేసు కోర్టు పరిధిలో ఉందని సూచించింది.

 ఇదిలాఉండగా ‘ఏదో జరిగిపోయిందన్నట్లుగా చూపడానికి ఉన్నతవర్గాలకు చెందినవారిపై అత్యాచారం, అత్యాచారయత్నం కేసులు పెట్టడం వంటి ఘటనలు ఎక్కువవుతున్నాయి. ఇదో ఫ్యాషన్‌గా మారిపోయింది. డీఐజీ సునీల్ కుమార్ ఎన్నో సంవత్సరాలు పోలీసుశాఖలో పనిచేశారు. ఓ మోడల్ ఆయనపై ఆరోపణలు చేయగానే రాత్రికి రాత్రే ఆయన విలన్ అయిపోయారు. వ్యక్తులపై ప్రతీకారం తీర్చుకోవడానికి చట్టాలు ఆయుధాలుగా మారుతున్నాయ’టూ సామ్నా సంపాదకీయంలో రాయడం రాష్ట్రవ్యాప్తంగా పెద్దదుమారమే రేపుతోంది.

Advertisement
Advertisement