‘చుక్కలు’ చూపిస్తున్నాయి! | Sakshi
Sakshi News home page

‘చుక్కలు’ చూపిస్తున్నాయి!

Published Sun, Sep 9 2018 2:39 AM

Smartphones and laptops affecting the eyes - Sakshi

రోజూ లక్షల్లో మనదేశంలో స్మార్ట్‌ ఫోన్‌లు అమ్ముడుపోతున్నాయి. అయితే అదే సమయంలో కంట్లో వేసే చుక్కల మందులు కూడా భారీ సంఖ్యలోనే అమ్ముడుపోతున్నాయి. గడిచిన నాలుగేళ్లతో పోలిస్తే ఈ మందుల అమ్మకాలు 54 శాతం పెరిగాయి. ఇదేంటి సెల్‌ఫోన్లకు, చుక్కల మందుకు ఉన్న సంబంధం ఏంటనుకుంటున్నారా?.. స్మార్ట్‌ ఫోన్లే మన కళ్లలో నీళ్లను ఆవిరి చేసేస్తున్నాయి.. ఐ డ్రాప్స్‌ కంపెనీల లాభాలు పెంచుతున్నాయి.  

స్మార్ట్‌ ప్రపంచంలో సమస్త సమాచారం చేతికందే దూరంలోనే ఉంటుంది. కాలు కదపకుండా మనకు కావాల్సిన సమాచారం, ఇతర అవసరాలను తీర్చుకునే వెసులుబాటు కలిగింది. మన అవసరాలు తీర్చడంతోపాటు అవే గ్యాడ్జెట్స్‌ మన ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతున్నాయి. అతిగా స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, టాబ్‌లు వాడటం వల్ల మన కళ్లలో ఉండే నీరు ఇంకిపోయి కళ్లు పొడిబారిపోతున్నాయి. ఈ సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య ఇటీవల భారీగా పెరిగినట్లుగా అధ్యయనాలు వెల్లడిస్తున్నా యి. 70% మంది కళ్లు పొడిబారిన సమస్యతో బాధపడుతుండగా వారిలో సగం మంది 20 నుంచి 30 మధ్య వయస్సు వారు ఉన్నారు. ఈ సమస్య కారణంగా కంటికి అవసరమైన నీళ్లు ఉత్పత్తి కావడం లే దని ఎయిమ్స్‌ గతేడాది చేపట్టిన సర్వేలో తేలింది.  

పదిమందిలో ఏడుగురికి ఇదే సమస్య  
కంటి సంబంధిత సమస్యలతో ఆస్పత్రికి వచ్చే ప్రతి పదిమందిలో ఏడుగురు ‘డిజిటల్‌ విజన్‌ సిండ్రోమ్‌’తో బాధ పడుతున్నట్లుగా వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగా గడిచిన నాలుగేళ్లలో 54 శాతం కంటి చుక్కల మందుల వ్యాపారం పెరిగింది.  

కంటికి చేటును తెస్తున్న ‘స్మార్ట్‌ ’డివైజెస్‌ 
మనదేశంలో ఒక వ్యక్తి సగటున రెండు గంటల 39 నిమిషాలపాటు మొబైల్‌ ఫోన్‌ను వాడుతున్నట్లుగా ఈ ఏడాది చేపట్టిన ఓ సర్వేలో వెల్లడైంది. ఆఫీసులో ఉద్యోగి రోజుకు ఆరున్నర గంటలపాటు కంప్యూటర్‌ లేదా ల్యాప్‌టాప్‌ను వాడుతున్నట్లుగా మరో సంస్థ వెల్లడించింది. ప్రింట్‌ అయిన పేజీని చదవడానికి, కంప్యూటర్‌ లేదా డిజిటల్‌ స్క్రీన్‌ను చూడటానికి చాలా తేడా ఉంటుందని అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ ఆప్తమాలజీ పేర్కొంది. కంప్యూటర్‌ స్క్రీన్‌పై వెలుతురులో అక్షరాలను చదవడంలో ఇబ్బందులు ఉంటాయి. గ్లేరింగ్, రిఫ్లెక్షన్, స్క్రీన్‌ను పైకీ కిందకి కదిలించడం వల్ల కంటి సమస్యలు పెరుగుతాయని వెల్లడించింది. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్, కంప్యూటర్ల వాడకంతోపాటు ఎక్కువ సేపు ఏసీ గదుల్లో ఉండటం, వాతావరణ కాలుష్యం, ముఖ సౌందర్య సామగ్రి కళ్లు పొడిబారిపోవడానికి మరో కారణమని ఎయిమ్స్‌లోని ఆప్తమాలజీ విభాగానికి చెందిన ఓ ప్రొఫెసర్‌ తెలిపారు.

ఏటా పెరుగుతున్న ఐ డ్రాప్స్‌ బిజినెస్‌ 
కళ్లు పొడిబారిన సమస్యకు సాధారణంగా రిఫ్రెష్‌ టియర్స్‌ వాడుతుంటారు. 2014 జూలై నుంచి 2018 జూలై మధ్య ఈ రిఫ్రెష్‌ టియర్స్‌ అమ్మకాలు 73 శాతం పెరిగాయి. ఓ కంపెనీ అమ్మకాలు 4,71,000 యూనిట్ల నుంచి 8,15,700 యూనిట్ల వరకు అమ్ముడయ్యాయి. మరో బ్రాండ్‌కు చెందిన అమ్మకాలు ఏకంగా 800 శాతం పెరిగాయి. 2014లో ఆ బ్రాండ్‌ 82,600 యూనిట్లు అమ్మగా, 2018లో 7,45,000 యూనిట్లు అమ్ముడైనట్లు లెక్కలు చెబుతున్నాయి. గడిచిన నాలుగేళ్లలో కంటి చుక్కల మందుల విభాగంలో 284 కొత్త ఉత్పత్తులను మందుల కంపెనీలు ప్రారంభించాయి. అందులో 45 ఉత్పత్తులు అంటే 15 శాతం కేవలం కళ్లు పొడిబారిన సమస్యకు సంబంధించినవే కావడం గమనార్హం. మిగిలినవి ఐ ఇన్‌ఫెక్షన్, కంటి చూపు మందగించిన సమస్యలకు వాడే డ్రాప్స్‌ ఉన్నాయి. 

Advertisement
Advertisement