25 వేలకు కొని.. 1.55 లక్షలకు అమ్ముతున్నారు | Sakshi
Sakshi News home page

25 వేలకు కొని.. 1.55 లక్షలకు అమ్ముతున్నారు

Published Wed, May 20 2015 2:57 PM

25 వేలకు కొని.. 1.55 లక్షలకు అమ్ముతున్నారు

ముంబై: ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రులకు వస్తున్న హృద్రోగులను నిలువు దోపీడి చేస్తున్నారు. హృద్రోగులకు అమర్చే స్టెంట్లను లాభసాటి వ్యాపారంగా మార్చేశారు. పశ్చిమ దేశాల నుంచి భారత్కు దిగుమతి చేసుకునే ఒకో స్టెంట్ విలువ అక్షరాల 25 వేల రూపాయలు. కానీ రోగికి అమ్మే విలువ ఏకంగా 1.55 లక్షల వరకు ఉంటోంది. అంటే దిగుమతి రేటు కంటే దాదాపు 700 శాతం ఎక్కువ. ముంబై సహా మహారాష్ట్రలోని పలు నగరాల్లో ఈ తంతు సాగుతోంది.

స్టెంట్ల దిగమతి దారులు దాని ధరపై దాదాపు 120 శాతం లాభానికి డిస్ట్రిబ్యూటర్లకు అమ్ముతున్నారు. డిస్ట్రిబ్యూటర్లు తాము కొనుగోలు చేసిన మొత్తం కంటే దాదాపు 120-125 శాతం అధిక ధరకు ఆస్పత్రులకు విక్రయిస్తున్నారు. ఇక ఆస్పత్రి యాజమాన్యాలు కనీసం 25 శాతం అధిక ధరను రోగుల నుంచి వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో దిగుమతిదారు నుంచి స్టెంట్ రోగికి వెళ్లే క్రమంలో క్రమేణా రేటు పెంచుతూ దోచుకుంటున్నారు. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రులకు వచ్చే హృద్రోగులు  తమకు భారమైనా గత్యంతరం లేని పరిస్థితుల్లో లక్షలు ఖర్చు చేసి స్టెంట్లు కొనుగోలు చేస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement