1994 తీర్పుపై పునఃసమీక్షకు నో | Sakshi
Sakshi News home page

1994 తీర్పుపై పునఃసమీక్షకు నో

Published Fri, Sep 28 2018 5:03 AM

Supreme Court verdict on Ayodhya case - Sakshi

న్యూఢిల్లీ: అయోధ్య రామమందిరం కేసు విషయంలో సుప్రీంకోర్టు చారిత్రక తీర్పునిచ్చింది. 1994 నాటి ఇస్మాయిల్‌ ఫారుఖీ కేసును విస్తృత ధర్మాసనానికి ఇచ్చేందుకు నిరాకరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం 2:1 మెజారిటీతో గురువారం ఈ తీర్పు చెప్పింది. ఇస్లాం ప్రకారం ప్రార్థనలు చేసేందుకు మసీదు తప్పనిసరి కాదు అని 1994 నాటి తీర్పుపై పునఃవిచారణ జరగదని స్పష్టం చేసింది. ధర్మాసనంలోని సీజేఐ, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌లు ఇందుకు మద్దతుగా తీర్పునివ్వగా మరో న్యాయమూర్తి అబ్దుల్‌ నజీర్‌ విభేదించారు. పునఃసమీక్ష జరగాల్సిందేనన్నారు. సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో.. అత్యంత సున్నితమైన అయోధ్య కేసు విచారణ వేగవంతం అవడానికి మార్గం సుగమమైంది. అక్టోబర్‌ 29 నుంచి ఈ కేసులో రోజువారీ విచారణ జరగనుంది. తీర్పుతో బీజేపీ, ఆరెస్సెస్‌ హర్షం వ్యక్తం చేశాయి. అయోధ్య కేసులోనూ త్వరలో తీర్పు వెలువడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాయి. అటు కాంగ్రెస్‌ పార్టీ ఆచితూచి స్పందించింది. కోర్టు తీర్పును ఆమోదించాల్సిందేనని పేర్కొంది.  
ఇది భూసేకరణ వివాదమే
1994లో ఇస్మాయిల్‌ ఫారూఖీ కేసులో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ ఎం సిద్దిఖీ సుప్రీంను ఆశ్రయించారు. భూ వివాదంలో హైకోర్టు తీర్పును సుప్రీం నిర్ణయం ప్రభావితం చేసిందన్నారు. ఇస్లాం సంప్రదాయం ప్రకారం ప్రార్థనల కోసం మసీదు ముఖ్యమైన ప్రదేశమేమీ కాదనడంపై పునఃసమీక్ష చేయాలని కోరారు. అయోధ్య కేసులోని ప్రధాన కక్షిదారుల్లో ఒకరైన సిద్దిఖీ చనిపోయినా ఆయన వారసులు ఈ కేసును సుప్రీంకోర్టుకు నివేదించారు. దీన్ని 2:1తో ధర్మాసనం తిరస్కరించింది. ‘ఇస్మాయిల్‌ ఫారుఖీ కేసులో లెవనెత్తిన అంశాలన్నీ భూ సేకరణకు సంబంధించినవేనని పునరుద్ఘాటిస్తున్నాం.

అయోధ్య కేసులో విచారణకు సంబంధించి ఇస్మాయిల్‌ ఫారుఖీ కేసులో పరిగణనలోకి తీసుకున్న అంశాల ప్రభావమేమీ ఉండదు’ అని జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ తమ (సీజేఐతో కలుపుకుని) నిర్ణయాన్ని వెలువరించారు. అయోధ్యలో నెలకొన్న సివిల్‌ భూ వివాదాన్ని కొత్తగా ఏర్పాటుచేయబోయే ముగ్గురు సభ్యుల బెంచ్‌ అక్టోబర్‌ 29 నుంచి విచారిస్తుందన్నారు. అక్టోబర్‌ 2న ప్రస్తుత సీజేఐ మిశ్రా రిటైర్‌కానున్నారు. 2010లో అలహాబాద్‌ హైకోర్టు వివాదాస్పద రామజన్మభూమి–బాబ్రీ మసీదు స్థలాన్ని మూడు భాగాలుగా విడగొడుతూ తీర్పు నివ్వడాన్ని సవాల్‌ చేయడంపైనా కోర్టు వ్యాఖ్యానించింది. మొత్తం 2.77 ఎకరాల స్థలాన్ని మూడు సమాన భాగాలుగా విభజించి.. సున్నీ వక్ఫ్‌ బోర్డు, నిర్మొహి అఖాడా, రామ్‌ లల్లాలకు పంచాలని ఆదేశించింది. ప్రభుత్వం అన్ని మతాలను సమదృష్టితో చూడాలని సూచించింది. కాగా దేశానికి మేలు చేసేందుకు అయోధ్య విషయాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అభిప్రాయపడ్డారు.  

స్వాగతించిన ఆరెస్సెస్‌
విస్తృత ధర్మాసనానికి అయోధ్య కేసును బదిలీ చేయబోమంటూ సుప్రీం ఇచ్చిన తీర్పును రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) స్వాగతించింది. ఈ వివాదంతో వీలైనంత త్వరగా తీర్పు వచ్చే అవకాశాలున్నాయని విశ్వాసం వ్యక్తం చేసింది. ‘అక్టోబర్‌ 29 నుంచి ముగ్గురు సభ్యుల ధర్మాసనం శ్రీరామజన్మభూమి కేసును విచారిస్తామని గురువారం సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని మేం స్వాగతిస్తున్నాం. వీలైనంత త్వరగా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందనే విశ్వాసం వచ్చింది’ అని ఓ ప్రకటనలో ఆరెస్సెస్‌ పేర్కొంది. కాంగ్రెస్‌ పార్టీ ఈ వివాదాన్ని మరింతకాలం కొనసాగించాలని చూస్తోందని.. అందుకే త్వరగా నిర్ణయం వెలువడకుండా (2019 ఎన్నికల తర్వాత ఈ వివాదంపై తీర్పు వెలువరించాలన్న కాంగ్రెస్‌ నేత కపిల్‌ సిబల్‌ పిటిషన్‌ను ప్రస్తావిస్తూ)  కుట్ర పన్నిందని ఆరెస్సెస్‌ నేత ఇంద్రేష్‌ కుమార్‌ ఆరోపించారు. పాకిస్తాన్‌ ఏజెంట్‌గా కాంగ్రెస్‌ పార్టీ వ్యవహరిస్తోందన్నారు. ఇకపై వీరి ప్రయత్నాలేవీ సఫలం కాబోవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.  

తీర్పుకు కట్టుబడే: కాంగ్రెస్‌  
గురువారం నాటి కోర్టు తీర్పుకు అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని కాంగ్రెస్‌ పార్టీ వ్యాఖ్యానించింది. ఈ తీర్పుతో అయోధ్య అసలు వివాదంపై విచారణను వేగవంతం చేసేందుకు మార్గం సుగమమైందని పేర్కొంది. ఇన్నాళ్లూ రామమందిరం పేరుతో బీజేపీ దేశ ప్రజలను మోసం చేస్తూ వస్తోందని.. కాంగ్రెస్‌ నేత ప్రియాంక చతుర్వేది విమర్శించారు. రామమందిర వివాదాన్ని పరిష్కరించడంలో బీజేపీ పాత్ర లేశమాత్రమైనా లేదన్నారు. రామమందిరంపై సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుకు కట్టుబడి ఉంటామని కాంగ్రెస్‌ పార్టీ మొదట్నుంచీ చెబుతోందని.. ఆచరణలోనూ కట్టుబడి ఉంటామని ఆమె పేర్కొన్నారు.
 

అసలు విచారణ ఇకపైనే..
రామజన్మభూమి – బాబ్రీ మసీదు వివాదంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని.. అది తమకు అనుకూలంగానే ఉందని ఈ కేసులో కక్షిదారులుగా ఉన్న ముస్లింలు పేర్కొన్నారు. ‘ఇస్లాంలో మసీదు అంతర్గత భాగం కాదనే విషయాన్ని 1994లోనే సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీంతో మాకు సంబంధం లేదు. ఇప్పుడు కేసు పూర్తిగా రామజన్మభూమి–బాబ్రీ మసీదు మధ్య స్థల వివాదంపైనే ఉందని సుప్రీం స్పష్టం చేసింది. ఇది సంతోషదాయకం’ అని మౌలానా మహ్‌ఫుజూర్‌ రహమాన్‌ తరపున నామినీగా ఉన్న ఖాలిక్‌ అహ్మద్‌ ఖాన్‌ పేర్కొన్నారు. ‘ఇకపై అయోధ్య–బాబ్రీ కేసు విచారణ మత విశ్వాసాలపై కాకుండా భూ యాజమాన్య హక్కుదారు, యోగ్యత ఆధారంగానే కొనసాగుతుందని సుప్రీంకోర్టు పేర్కొనడం హర్షదాయకం. రెవెన్యూ రికార్డుల ఆధారంగా బాబ్రీ స్థల వివాదంలో మా వాదనలు వినిపిస్తాం. ఏ మందిరాన్నీ ధ్వంసం చేయకుండానే బాబ్రీ మసీదును నిర్మించారనేది మా విశ్వాసం’ అని సున్నీ వక్ఫ్‌ బోర్డు తరపున కక్షిదారుగా ఉన్న ఇక్బాల్‌ అన్సారీ తెలిపారు. మిగిలిన కక్షిదారులు కూడా కోర్టు నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు.

అయోధ్య–బాబ్రీ వివాదమేంటి?
భారత్‌లో ఐదు దశాబ్దాలుగా హిందు–ముస్లింల మధ్య ఘర్షణకు అయోధ్య–బాబ్రీ మసీదు వివాదం కారణమవుతోంది. తమ ఆరాధ్య దైవమైన శ్రీరాముడు జన్మించిన పవిత్రస్థలంలో మందిర నిర్మాణం జరగాలని హిందువులు డిమాండ్‌ చేస్తున్నారు. 2.77 ఎకరాల స్థలంలో భవ్యంగా మందిర నిర్మాణం జరగాలని కోరుతున్నారు. అయితే బాబర్‌ మసీదు నిర్మించిన ఈ స్థలం తమకే చెల్లుతుందని రామమందిర నిర్మాణం జరపడానికి వీల్లేదని ముస్లింలు వాదిస్తున్నారు. రామజన్మభూమిలో ఆయన విగ్రహాలు పెట్టి.. అక్కడ పూజలకు అనుమతించాలంటూ 1950లో గోపాల్‌ సిమ్లా, పరమహంస రామచంద్రదాస్‌లు ఫైజాబాద్‌ కోర్టును ఆశ్రయించారు. దీనికితోడు 1992, డిసెంబర్‌ 6న కరసేవకులు బాబ్రీ మసీదులోని కొంత భాగాన్ని ధ్వంసం చేయడంతో దేశవ్యాప్తంగా ఇరువర్గాల మధ్య వివాదం మరింత ముదిరింది. ఆ తర్వాత పురాతత్వ శాస్త్రవేత్తలు చేపట్టిన తవ్వకాల్లోనూ మసీదు కింద రామమందిరానికి సంబంధించిన ఆనవాళ్లు బయటపడ్డాయి. దీంతో రామమందిర నిర్మాణానికి హిందూ సంఘాలు, వద్దే వద్దంటూ ముస్లింలు పోటాపోటీగా కోర్టులో పిటిషన్లు వేశారు. దీనిపై అక్టోబర్‌ 29 నుంచి సుప్రీంకోర్టు రోజూవారి విచారణ చేపట్టనుంది.  

‘మసీదు’పై పునఃసమీక్ష: జస్టిస్‌ నజీర్‌
‘అన్ని దేవాలయాలు, మసీదులు, చర్చిలు ఆయా వర్గాలకు చాలా ముఖ్యమైనవి’ అని జస్టిస్‌ ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌ తన తీర్పులో పేర్కొన్నారు. ఇస్లాం సంప్రదాయం ప్రకారం మసీదు అంత ముఖ్యమైన ప్రదేశం కాదని, ముస్లింలు ఎక్కడైనా నమాజ్‌ చేసుకోవచ్చన్న 1994నాటి ఇస్మాయిల్‌ ఫారుఖీ కేసుపై పునఃసమీక్ష జరగాలని తన 42 పేజీల తీర్పులో ఆయన చెప్పారు. సమగ్రమైన విచారణ జరపకుండా నాడు తీర్పుచెప్పారన్నారు. రాజ్యాంగ ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని ‘మసీదు’ వ్యాఖ్యలపై విస్తృత ధర్మాసనంతో పునఃసమీక్ష జరపాలన్నారు. తన తీర్పులో 4 ప్రశ్నలు సంధించారు. ‘1954 షిరూర్‌ మఠ్‌ కేసులో మత విశ్వాసాలను పరీక్షించకుండానే తీర్పు వెలువరించారా? ఆవశ్యకమైన మత విశ్వాసాన్ని నిర్ధారించేందుకు పరీక్షలు జరగాలా? ఆర్టికల్‌ 25కింద ఒక మతానికి సంబంధించిన విశ్వాసాలనే కాపాడాలా? అన్ని మతాలకూ వర్తిస్తుందా? ఆర్టికల్‌ 15, 25, 26 ప్రకారం అన్ని విశ్వాసాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందా?’ అని  ప్రశ్నించారు. బహుభార్యత్వం, నిఖాహలాలా, మహిళా జననాంగాల విచ్ఛిత్తి కేసుల్లో తీర్పులను గుర్తుచేశారు.

అయోధ్య స్థల వివాద క్రమమిదీ..
► 1528: బాబర్‌ సైన్యాధ్యక్షుడు మిర్‌ బాకీ బాబ్రీ మసీదును నిర్మించాడు.

► 1885: ఈ స్థలంలో రాముడికి చిన్న పైకప్పు కట్టుకునేందుకు అనుమతివ్వాలని మహంత్‌ రఘువీర్‌ దాస్‌ ఫైజాబాద్‌ కోర్టును ఆశ్రయించారు. కోర్టు దీన్ని తిరస్కరించింది.

► 1949: వివాదాస్పద స్థలంలో రామ్‌ లల్లా విగ్రహాల స్థాపన

► 1959: విగ్రహాలకు పూజ చేసేందుకు అనుమతించాలంటూ నిర్మోహి అఖాడా పిటిషన్‌

► 1981: ఈ స్థలాన్ని తమకు అప్పగించాలంటూ యూపీ సున్నీ వక్ఫ్‌ బోర్డు కేసు

 

► 1986, ఫిబ్రవరి 1: హిందూ భక్తులకు ప్రవేశాన్ని అనుమతిస్తూ స్థానిక కోర్టు తీర్పు

► 1992, డిసెంబర్‌ 6: బాబ్రీ మసీదు నిర్మాణం పాక్షికంగా ధ్వంసం

► 1994, అక్టోబర్‌ 24: ఇస్మాయిల్‌ ఫారుఖీ కేసు విచారణ సందర్భంగా ఇస్లాంలో మసీదు అంతర్భాగం కాదన్న సుప్రీంకోర్టు

►  2003, మార్చి 13: వివాదాస్పద స్థలంలో ఎలాంటి మతపరమైన కార్యక్రమాలు జరపొద్దని  సుప్రీం ఆదేశం, అలహాబాద్‌ హైకోర్టుకు కేసు బదిలీ.

► 2010, సెప్టెంబర్‌ 30: నిర్మోహీ అఖాడా, రామ్‌ లల్లా, సున్నీ వక్ఫ్‌ బోర్డులకు వివాదాస్పద భూమిని పంచుతూ హైకోర్టు ఆదేశం.

► 2016, ఫిబ్రవరి 26: రామమందిర నిర్మాణానికి అనుమతించాలంటూ సుబ్రమణ్య స్వామి పిటిషన్‌

► 2017, మార్చి 21: కక్షిదారులంతా కోర్టు బయట చర్చల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలని నాటి సీజేఐ జస్టిస్‌ జేఎస్‌ ఖేహార్‌ సూచన

► నవంబర్‌ 20: అయోధ్యలో మందిరం, లక్నోలో భారీ మసీదు నిర్మాణానికి అంగీకరిస్తున్నట్లు సుప్రీంకోర్టుకు వెల్లడించిన షియా వక్ఫ్‌ బోర్డు.

► 2018, సెప్టెంబర్‌ 27: ఐదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి కేసును బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు విముఖత. అక్టోబర్‌ 29 నుంచి రోజువారీ విచారణ చేపట్టనున్నట్లు వెల్లడి.  



సుప్రీంకోర్టు తీర్పు అనంతరం అయోధ్యలో ప్రధాన కక్షిదారులు ఇక్బాల్‌ అన్సారీ, నిర్మోహి అఖాడా మహంత్‌ ధరమ్‌ దాస్‌


జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement