ప్రపంచంలోనే ఎత్తయిన ఆలయం! | Sakshi
Sakshi News home page

ప్రపంచంలోనే ఎత్తయిన ఆలయం!

Published Tue, Nov 22 2016 4:37 PM

tallest hindu temple is being built in Mathura

ప్రపంచంలో ఇప్పటివరకు అత్యంత ఎత్తయిన ఆధ్యాత్మిక ప్రదేశం అంటే... ఇప్పటివరకు వాటికన్ నగరంలోని సెయింట్ పీటర్స్ బాసిలికా అని చెప్పేవారు. కానీ ఇప్పుడు దానికంటే కూడా ఎత్తయిన ఓ సరికొత్త ఆలయం ఉత్తరప్రదేశ్‌లోని మథురలో గల బృందావనంలో సిద్ధమవుతోంది. బృందావన్ చంద్రోదయ మందిర్ అనే ఈ ఆలయం పూర్తయితే దాన్ని చూడ్డానికి రెండు కళ్లు చాలవని చెబుతున్నారు. ఇస్కాన్ (ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణా కాన్షస్‌నెస్) కట్టిస్తున్న ఈ ఆలయంలో ఒక థీమ్ పార్కు కూడా ఉంటుంది. భూకంపం వచ్చినా చెక్కు చెదరకుండా దీని నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఇన్‌జెనియస్ స్టూడియో, స్ట్రక్చరల్ కన్సల్టెంటు త్రాన్టన్ తోమశెట్టి ఈ ఆలయానికి డిజైన్ సమకూర్చారు. మొత్తం 700 అడుగుల ఎత్తు ఉండే ఈ భవనంలో 70 అంతస్తులు ఉంటాయి. 

ఇందులో చిన్నపిల్లలు ఆడుకోడానికి వీలుగా పార్కు రెయిడ్‌లు, యానిమెట్రానిక్స్, లైట్ అండ్ సౌండ్ షో, వ్రజ మండల్ పరిక్రమ షోలు, లేజర్ షోలు కూడా ఉంటాయని ఆలయ ప్రాజెక్టు డైరెక్టర్ నరసింహదాస్ చెప్పారు. మొత్తం 70 అంతస్తులు ఎక్కడానికి వీలుగా ఒక కాప్స్యూల్ లిఫ్టు ఉంటుంది. అంత ఎత్తు నుంచి నగరాన్ని చూడటం కూడా సందర్శకులకు మంచి అనుభూతిగా ఉంటుంది. ఇక సౌండ్ అండ్ లైట్ షో అయితే పిల్లలు, పెద్దలందరికీ కూడా చాలా అపురూపంగా ఉంటుందని అంటున్నారు. 
 
కృష్ణుడు బృందావనంలో కొలువు దీరినట్లు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఇక్కడ కూడా చుట్టూ బృందావనం లాగే వాతావారణం ఉంటుంది. ఈ ఆలయం చుట్టూ దాదాపు 30 ఎకరాల కృత్రిమ అడవి ఉంది. ప్రస్తుతం ఆలయానికి 180 అడుగుల లోతున పునాదులు వేస్తున్నారు. మొత్తం 511 కాలమ్‌లు వేస్తున్నామని, ఈ పనులు వచ్చే సంవత్సరం మార్చి నాటికి పూర్తవుతాయని నారాయణ దాస్ చెప్పారు. పునాదికే అన్నాళ్లు పట్టిందంటే.. ఇక మొత్తం ఆలయం పూర్తయ్యేసరికి ఇంకా చాలా కాలం పట్టేలాగే ఉంది. 

 

Advertisement
Advertisement