వేధింపులు తట్టుకోలేక.. బస్సులోంచి దూకేసింది | Sakshi
Sakshi News home page

వేధింపులు తట్టుకోలేక.. బస్సులోంచి దూకేసింది

Published Mon, Aug 10 2015 1:01 PM

వేధింపులు తట్టుకోలేక.. బస్సులోంచి దూకేసింది - Sakshi

జంషెడ్పూర్:   ఒక ప్రైవేటు బస్సులో ఇద్దరు దుర్మార్గులు వేధింపులకు పాల్పడడంతో ఓ మైనర్ బాలిక బస్సులోంచి దూకేసిన ఘటన జార్ఖండ్ లో కలకలం రేపింది.  స్కూలునుంచి ఇంటికి తిరిగివస్తున్న  బాలిక పై  దుండగులు వేధింపులకు తెగబడ్డారు. ఆమె సహాయం కోసం అర్ధించినా ఫలితం లేకపోయింది.   దీంతో తనను తాను రక్షించుకునే క్రమంలో బస్సులోంచి అమాంతం దూకేసింది.  ప్రస్తుతం తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతోంది.
 

తొమ్మిదవ తరగతి చదువుతున్న అమ్మాయిపై ఇద్దరు దుర్మార్గులు శనివారం సాయంత్రం  జంషెడ్ పూర్ లో వేధింపులకు పాల్పడ్డారు.  తనకు సాయం చేయాల్సిందిగా  అరిచి గోలపెట్టినా  పట్టించుకోలేదు.    ఆ సమయంలో సుమారు ఇరవై మంది దాకా ప్రయాణికులున్నా ఎవరూ స్పందించలేదు.  దీంతో ఆ నీచులు  మరింత  రెచ్చిపోయారు.  ఇక గత్యంతరం లేని స్థితిలో ఆ బాలిక  కదులుతున్న బస్సులోంచే దూకేసింది.   దీంతో కాళ్లు విరిగిపోయాయి. తలకు, ఛాతీ భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ఆమె ఆరోగ్య పరిస్థితి  విషమంగా  ఉన్నట్టు తెలుస్తోంది.


అయితే ఆ ఇద్దరు నిందితులు బస్సు ,డ్రైవర్,  కండక్టర్ స్నేహితులను సీనియర్ పోలీసు అధికారి అనూప్ మాథ్యూ తెలిపారు.  బస్సు  డ్రైవరును, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని,   బస్సు  కండక్టర్ పరారీలో వున్నాడన్నారు.  కేసు నమోదు చేశామని దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు.

Advertisement
Advertisement