Sakshi News home page

ముస్లిం అనే కారణంతో జాబ్ నిరాకరించిన కంపెనీ

Published Fri, May 22 2015 3:52 AM

ముస్లిం అనే కారణంతో జాబ్ నిరాకరించిన కంపెనీ

ముంబై: ముస్లిం అన్న కారణంగా ముంబైలోని ప్రైవేట్ కంపెనీ ఒకటి ఎంబీఏ చదివిన ఓ వ్యక్తికి  ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించింది. దీనిపై జాతీయ మైనారిటీ కమిషన్‌తోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. మతపర వివక్షను సహించేది లేదని కేంద్ర మైనారిటీ వ్యవహారాల సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ స్పష్టం చేశారు. ముంబైలోని హరే కృష్ణ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగం కోసం ఈనెల 19న జేషన్ అలీఖాన్(ఎంబీఏ గ్రాడ్యుయేట్) దరఖాస్తు చేసుకున్నారు.

ఆ కంపెనీ వెబ్‌సైట్ నుంచి 15 నిమిషాలకే వచ్చిన సమాధానం చూసి ఖాన్ షాక్ తిన్నారు. ‘మేం ముస్లిమేతరులనే ఉద్యోగాల్లోకి తీసుకుంటాం. ముస్లింలను తీసుకోం. దరఖాస్తు చేసుకున్నందుకు థ్యాంక్స్’ అని కంపెనీ నుంచి సమాధానం వచ్చింది. దీన్ని ఖాన్ ఫేస్‌బుక్‌లో షేర్ చేయడంతో తీవ్ర చర్చ జరిగింది. ఓవైపు ‘మేకిన్ ఇండియా’ పేరుతో ప్రధాని విదేశాలన్నీ చుట్టివస్తుంటే.. ఇక్కడ మాత్రం కొన్ని కంపెనీలు మతం పేరుతో దరఖాస్తులను తిరస్కరిస్తున్నాయంటూ ఖాన్ మండిపడ్డారు. విమర్శలు రావడంతో కంపెనీ పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ ఖాన్‌కు మరో మెయిల్ పంపింది.

‘మానవ వనరుల విభాగం(హెచ్‌ఆర్)లో ట్రెయినీ చేసిన తప్పిదం వల్ల ఇది జరిగింది. నిర్ణయాధికారం లేకున్నా ఆ ట్రెయినీ ఈ మెయిల్ పంపారు. ఇక్కడి మా కంపెనీలో మొత్తం 61 మంది ఉద్యోగులున్నారు. వారిలో హెచ్‌ఆర్‌లో ఒకరు ముస్లిం కూడా ఉన్నారు’’ అని వివరించింది. ఈ ఉదంతంపై మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ దర్యాప్తునకు ఆదేశించారు. కంపెనీపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement
Advertisement