విజయ్ మాల్యా ఎలా పారిపోయారు? | Sakshi
Sakshi News home page

విజయ్ మాల్యా ఎలా పారిపోయారు?

Published Thu, Mar 10 2016 3:24 PM

విజయ్ మాల్యా ఎలా పారిపోయారు?

న్యూఢిల్లీ: పర్యావరణ పరిరక్షణ కోసం, ఆదివాసీల అటవీ హక్కుల కోసం పోరాడుతున్న గ్రీన్ పీస్ కార్యకర్త ప్రియా పిళ్లైని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దారుణంగా అవమానించింది. మధ్యప్రదేశ్‌లోని మహాన్ కోల్ బ్లాక్‌కు వ్యతిరేకంగా అటవి సంపద సంరక్షణ కోసం పోరాడుతూ, అందులో భాగంగా లండన్ బయల్దేరిన పిళ్లైని 2015, జనవరి 11న అధికారులు ఢిల్లీ విమానాశ్రయంలో నిలిపేశారు. లండన్‌లో ఆమె ప్రచారం కారణంగా దేశం పరువు పోతుందని భావించిన మోదీ ప్రభుత్వం ఆమెను ‘నో ఫారిన్ ట్రావెల్’ కేటగిరీలో కూడా చేర్చారు. సుప్రీం కోర్టు జోక్యంతో ఆమెను ఆ జాబితా నుంచి తొలగించారు.

దేశ ప్రయోజనాల కోసం, ఆదివాసీల సంక్షేమం కోసం త్రికరణ శుద్ధిగా కృషి చేస్తున్న ప్రియా పిళ్లైని విమానాశ్రయంలో అడ్డుకున్న మోదీ ప్రభుత్వం, వేల కోట్ల రూపాయలను బ్యాంకులకు ఎగనామం పెట్టి పారిపోతున్న లింకర్ కింగ్ విజయ్ మాల్యాను మాత్రం సాదరంగా లండన్ వెళ్లేందుకు అవకాశం ఇచ్చింది. ఇది ద్వంద్వ ప్రమాణాలు అనుసరించడం కాదా ? విజయ్ మాల్యా అక్షరాల ఏడు వేల కోట్ల రూపాయలను బ్యాంకులకు బకాయిపడ్డ విషయం తెల్సిందే. ఆయన ఎక్కువగా రుణాలు తీసుకున్నది వివిధ ప్రభుత్వ బ్యాకుల నుంచే. అదంతా పేద ప్రజలు, టాక్స్ పేయర్స్ దాచుకున్న సొమ్మే అనడంలో అతిశయోక్తి లేదు.

విజయ్ మాల్యాపై సిబీఐ ‘లుకౌట్’ నోటీసు ఉన్నా అధికారుల కళ్లుగప్పి ఆయన విదేశానికి ఎలా చెక్కేస్తారు. దేశ, ప్రజల ప్రయోజనాలు పట్టని కేంద్ర ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేకుండానే మాల్యా తప్పించుకుపోయాడంటారా? ‘సమ్‌థింగ్ రాంగ్ విత్ ది మోదీ గవర్నమెంట్’. విజయ్ మాల్యా పారిపోయాక కూడా ఆయన్ని పట్టుకునేందుకు ప్రభుత్వం ఎందుకు ప్రయత్నించడం లేదు? పైగా ఆయన ఏ దేశం వెళ్లారో కూడా తెలియదని కేంద్రం బుకాయిస్తోంది. తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదుగదా! ఇలా దేశాన్ని విడిచి విదేశాలకు పారిపోయే వారు సాధారణంగా ఇంగ్లండ్ వెళతారన్నది అందరికి తెల్సిన విషయమే. అక్కడి చట్టాల ప్రకారం ఇలాంటి వారికి అక్కడ సులభంగా శరణు దొరుకుతుంది. అక్కడ కొత్త జీవితం ప్రారంభించవచ్చు.

Advertisement
Advertisement