సంతానం ఇస్తుందనుకుంటే... చంపేసింది!! | Sakshi
Sakshi News home page

సంతానం ఇస్తుందనుకుంటే... చంపేసింది!!

Published Sat, Apr 26 2014 3:42 PM

Tigress killed by tiger at Delhi zoo

సంతాన భాగ్యం కల్పిస్తుందని ఎక్కడినుంచో తీసుకొచ్చిన ఓ మగపులి.. ఢిల్లీ జూలోని ఓ ఆడపులిని చంపేసింది. మైసూరు జూ నుంచి ఢిల్లీ జూలో ఉన్న ఆడ పులుల కోసం తీసుకొచ్చిన మగపులి ఈ దారుణానికి పాల్పడింది. జిన్జిన్ అనే పదేళ్ల వయసున్న రాయల్ బెంగాల్ పులిని ఇది చంపేసింది. ఈ రెండింటినీ కలిపి అధికారులు ఒక ఎన్క్లోజర్లోకి పంపారు. తీరా అక్కడికెళ్లిన తర్వాత ఈ మగపులి సరసానికి బదులు పోరాటానికి దిగింది. జూ సిబ్బంది ఈ విషయాన్ని గమనించి, ఈ రెండింటి మధ్య పోరాటాన్ని ఆపేందుకు ప్రయత్నించారు గానీ ఫలితం లేకపోయింది. ఎలాగోలా జిన్జిన్ను దొరకపట్టుకుని చంపేసింది.

దీంతో ఇక ఢిల్లీ జూలో ఐదు పులులు మాత్రమే మిగిలాయని జిమ్ క్యూరేటర్ రియాజ్ ఖాన్ తెలిపారు. అడవుల్లో ఇలాంటి సంఘటనలు మామూలేనని, పులుల మధ్య పోరాటాలు జరుగుతాయని, కానీ జూలలో మాత్రం ఇలా జరగడం ఇదే మొదలని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఢిల్లీ జూలో రెండు ఆడ, మూడు మగ రాయల్ బెంగాల్ పులులున్నాయి. ఇవి కాక మరో ఆరు తెల్ల పులులు ఉన్నాయి. ఇటీవలే జూల మధ్య జంతువుల బదిలీ కార్యక్రమంలో భాగంగా ఓ ఆడ తెల్ల పులిని, మరికొన్ని జంతువులను తిరువనంతపురం జూకు పంపారు.

Advertisement
Advertisement