కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత నిర్ణాయక మండలి అయిన సీడబ్ల్యుసీ సమావేశానికి పార్టీ అధినేత్రి సోనియా గాంధీ గైర్హాజరయ్యారు. ఆమెకు అనారోగ్యంగా ఉండటంతో ఈ సమావేశానికి రాలేదని తెలుస్తోంది. వాస్తవానికి ఈ సమావేశానికి ఆమే అధ్యక్షత వహించాల్సి ఉందని, కానీ ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల ఆమె రాలేదని పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా తెలిపారు. ఆమెకు గొంతులో ఇన్ఫెక్షన్ వచ్చిందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంటున్నాయి.
ఈ కారణంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి సోనియాగాంధీ బదులు రాహుల్ గాంధీ అధ్యక్షత వహించారు. త్వరలో ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాలలో జరిగే ఎన్నికలకు సంబంధించిన పార్టీ వ్యూహాలను రూపొందించడంతో పాటు.. పార్టీ సంస్థాగత ఎన్నికలపై చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటుచేసినట్లు తెలిసింది. సమావేశంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తదితర సీనియర్ నేతలు పాల్గొన్నారు.