ఎంపీ భార్య వింత ఫిర్యాదు! | Sakshi
Sakshi News home page

ఎంపీ భార్య వింత ఫిర్యాదు!

Published Sat, Aug 13 2016 9:13 AM

ఎంపీ భార్య వింత ఫిర్యాదు! - Sakshi

ఆగ్రా: తప్పిపోయిన మంత్రి ఆజాంఖాన్ పశువులను వెతికి పట్టుకున్న ఉత్తరప్రదేశ్ పోలీసులకు మరో బాధ్యత నెత్తిన పడింది. ఈసారి కుక్కను వెతకాల్సిన పరిస్థితి వచ్చింది. తమ పెంపుడు కుక్క తప్పింపోయిందని బీజేపీ ఆగ్రా ఎంపీ రామశంకర్ కథిరియా భార్య మృదుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి అనిల్ చౌదరి, పార్టీ కార్యకర్తలతో కలిసి శుక్రవారం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తమ కుక్కను గుర్తు తెలియని దుండగులు మూడు రోజుల క్రితం ఎత్తుకుపోయారని ఫిర్యాదులో పేర్కొన్నారు. హరి పర్వత్ పోలీస్ స్టేషన్ లో ఈ మేరకు ఫిర్యాదు నమోదు చేశారు.

తమ పెంపుడు కుక్క నలుపు రంగులో ఉంటుందని, లాబ్రడర్ జాతికి చెందినదని మృదుల తెలిపారు. అరుదైన, ఖరీదైన కుక్కని.. అంతకుమించి తమ కుటుంబంలో సభ్యురాలని పేర్కొన్నారు. మంత్రి ఆజాంఖాన్ పశువులను వెతికిపట్టుకున్న పోలీసులు తమ కుక్కను ఎందుకు వెతికి పెట్టకూడదని ఆమె ప్రశ్నించారు. ఆగ్రా యూనివర్సిటీలో హిందీ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ఆమె తనకు కేటాయించిన ఇంటిలో కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నారు.

Advertisement
Advertisement