షారుఖ్‌ షూటింగ్‌కు 'అసహన' సెగ! | Sakshi
Sakshi News home page

షారుఖ్‌ షూటింగ్‌కు 'అసహన' సెగ!

Published Wed, Feb 3 2016 6:19 PM

షారుఖ్‌ షూటింగ్‌కు 'అసహన' సెగ! - Sakshi

భుజ్‌ (గుజరాత్‌): దేశంలో మత అసహనంపై బాలీవుడ్ సూపర్‌ష్టార్‌ షారుఖ్‌ ఖాన్‌ చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ.. ఆయన తాజా సినిమా షూటింగ్‌ను అడ్డుకోవడానికి విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) ప్రయత్నించింది. గుజరాత్‌లోని భుజ్‌ ప్రాంతంలో జరుగుతున్న షారుఖ్‌ సినిమా 'రాయిస్‌' షూటింగ్‌ వద్ద వీహెచ్‌పీ కార్యకర్తలు బుధవారం ఆందోళన నిర్వహించారు.

గత ఏడాది నవంబర్‌లో ఓ టీవీ కార్యక్రమంలో మాట్లాడుతూ దేశంలో తీవ్ర మత అసహనం ఉందని షారుఖ్ వ్యాఖ్యలు చేశాడు. 'మత అసహనం కలిగి ఉండటం, లౌకికంగా వ్యవహరించకపోవడం దేశంలో తీవ్రమైన నేరమే' అని ఆయన పేర్కొన్నాడు. షారుఖ్ వ్యాఖ్యలపై దుమారం రేగడంతో ఆయన వెనుకకు తగ్గారు. భారత్ అసహన దేశమని తాను ఎన్నడూ అనలేదని, తన వ్యాఖ్యలను వక్రీకరించారని పేర్కొన్నాడు.

ఈ నేపథ్యంలో షారుఖ్‌ సినిమా షూటింగ్‌కు భుజ్‌ పట్టణంలో అనుమతి ఇవ్వవద్దంటూ గతకొన్ని రోజులుగా వీహెచ్‌పీ కార్యకర్తలు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌కు వ్యతిరేకంగా బుధవారం జిల్లా కలెక్టర్‌కు మెమోరాండం సమర్పించిన ఆందోళనకారులు.. అక్కడి నుంచి షూటింగ్ జరుగుతున్న ప్రదేశానికి బయలుదేరారు. వారిని దారి మధ్యలోనే పోలీసులు అడ్డుకొని చెల్లాచెదురు చేశారని స్థానిక ఎస్సై ఎంబీ పర్మార్ తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement