నూతన టాలెంట్‌ను ప్రోత్సహిస్తా | Sakshi
Sakshi News home page

నూతన టాలెంట్‌ను ప్రోత్సహిస్తా

Published Thu, Aug 28 2014 11:07 PM

నూతన టాలెంట్‌ను ప్రోత్సహిస్తా

 ముంబై : ప్రతిభావంతులైన కొత్త డెరైక్టర్లు, నటులు, రచయితలను ప్రోత్సహించేందుకు ముందుంటానని నిర్మాతగా మారిన ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తెలిపారు. ఆమె మాధురీ భండార్కర్  దర్శకత్వంలో ‘మేడంజీ’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఆమె ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ నిర్మాతగా మంచి సినిమాలు నిర్మించాలని నిర్ణయించుకున్నానన్నారు. తాను నిర్మాతగా మారాలని అనుకున్నాగాని తాను నటించే సినిమాకే నిర్మాతగా మారుతానని అనుకోలేదని చెప్పారు.

మోడల్‌గా, సింగర్‌గా, నటిగా రాణించిన  ప్రియాంక ఇప్పుడు నిర్మాతగా కూడా రాణిస్తాననే ధీమాను వ్యక్తం చేసింది. ‘నిర్మాతగా ప్రతిభావంతులైన కొత్తవారిని ప్రోత్సహించాలనుకుంటున్నా.. నటన, దర్శకత్వం, రచ న..ఇలా ఏ విభాగమైనా సరే.. ప్రతిభ ఉంటే కొత్తవారికి అవకాశం ఇవ్వడానికి వెనుకాడన’ని చెప్పింది. పరిశ్రమలో కొత్తవారిని ప్రోత్సహించడం చాలా అవసరమని అభిప్రాయపడింది.

 ‘మార్పును మనం ఆహ్వానించాల్సిందే.. భవిష్యత్తు గురించి ఎప్పుడూ ఆలోచించను.. ఎప్పుడేం చేయాలనిపిస్తే అదే చేస్తాను.. భవిష్యత్తులో నిర్మాతగా స్థిరపడతానో లేక సంగీత దర్శకురాలిగా మారతానో.. ఇప్పుడైతే నటిగా కొనసాగాలనే అనుకుంటున్నా..’ అని ప్రియాంక చెప్పింది. ఇక ‘మేడంజీ’ గురించి మాట్లాడుతూ... ఇది ఒక ఐటమ్ గర్ల్‌కు సంబంధించిన కథ.. ఆమె రాజకీయ నాయకురాలిగా ఎలా మారింది.. జీవితంలో ఆమె ఎదుర్కొన్న సవాళ్లను ఇందులో చూపిస్తున్నాం..’ అని చెప్పింది.

 నిర్మాతగా తనకు సహకరించేందుకు చాలా మంచి టీం ఉందని, వారి సహకారంతో భవిష్యత్తులో మంచి సినిమాలు తీస్తాననే నమ్మకాన్ని వెలుబుచ్చింది. అయితే ‘బాక్సాఫీస్ కలెక్షన్స్’ అనే దానిపై తనకు ఇంకా అవగాహన లేదని, తాను నటించిన సినిమా ఏదైనా విడుదలైనప్పుడు ఎవరో ఒకరు తనకు ఫోన్ చేసి బాక్సాఫీస్ కలెక్షన్స్ గురించి అడుగుతుంటారని, దానికి సమాధానం చెప్పడానికి తాను చాలా ఇబ్బంది పడుతుంటానని చెప్పింది. అయితే మున్ముందు అన్ని విభాగాల మీద పట్టు సంపాదిస్తానని ముక్తాయించింది.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement