దుండగుల బారి నుంచి చిన్నారిని కాపాడుకున్న తల్లి

23 Jul, 2020 08:16 IST|Sakshi

నాలుగేళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లేందుకు కిడ్నాపర్ల విఫలయత్నం

న్యూఢిల్లీ: నాలుగేళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన ఇద్దరు దుండగులతో ఓ తల్లి చిన్నపాటి యుద్ధమే చేసింది. శాయశక్తులా ప్రయత్నించి ఎట్టకేలకు కిడ్నాపర్ల బారి నుంచి తన బిడ్డను కాపాడుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. దేశ రాజధానిలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పాప కిడ్నాప్‌కు ప్రణాళిక రచించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. తూర్పు ఢిల్లీ నివాసి అయిన పాప తండ్రి వస్త్ర వ్యాపారిగా తనకంటూ గుర్తింపు దక్కించుకుని లాభాలు ఆర్జిస్తున్నాడు. ఈ క్రమంలో అతడిపై అక్కసు పెంచుకున్న సోదరుడు.. ఎలాగైనా డబ్బు గుంజాలని భావించాడు. ఇందుకోసం పాపను అపహరించేందుకు పథకం వేసి ఇద్దరు వ్యక్తులను పురమాయించాడు. (అమ్మ కోసం ఆస్ప‌త్రి గోడెక్కి కిటికీ ద‌గ్గ‌రే జపం)

ఈ క్రమంలో బైక్‌పై సదరు వ్యక్తి ఇంటికి వెళ్లిన దుండగులు అతడి భార్యను నీళ్లు కావాలని అడిగారు. ఆమె వెనక్కి తిరగగానే చిన్నారిని ఎత్తుకుని బయటకు వచ్చారు. బైక్‌పై పారిపోయేందుకు సిద్ధమవుతుండగా.. ఒక్క ఉదుటున బయటకు పరిగెత్తుకు వచ్చిన పాప తల్లి వారి చేతుల్లో నుంచి చిన్నారిని లాక్కొంది. దీంతో కిడ్నాపర్లు అక్కడి నుంచి ఉడాయించగా.. ఇరుగుపొరుగు వ్యక్తులు వారిని వెంబడించారు. ఈ నేపథ్యంలో పాప తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. పాప తండ్రి సోదరుడిని అరెస్టు చేశారు. రూ. 35 లక్షల కోసమే తాను దుండగులను పంపినట్లు అతడు వెల్లడించాడు. కాగా కిడ్నాప్‌కు యత్నించిన ఇద్దరు ఇంకా పరారీలోనే ఉండటం గమనార్హం. (వెనకాలే ఎలుగుబంటి.. ఆమె ఏం చేసిందంటే!)

మరిన్ని వార్తలు