భర్తను పొడిచి భార్యను పొలాల్లోకి ఈడ్చుకెళ్లి.. | Sakshi
Sakshi News home page

భర్తను పొడిచి భార్యను పొలాల్లోకి ఈడ్చుకెళ్లి..

Published Wed, Sep 7 2016 5:10 PM

భర్తను పొడిచి భార్యను పొలాల్లోకి ఈడ్చుకెళ్లి..

లక్నో: ఉత్తరప్రదేశ్లో మరో బులంద్ షహర్ తరహా దాడి జరిగింది. గంగా నదిలో పుణ్యస్నానానికి వెళ్లొస్తున్న దంపతులపై ఓ గ్యాంగ్ దాడి చేసి భర్తను కత్తితో పొడిచి అతడి కళ్లముందే భార్యపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం దారుణంగా గొంతునులిమి చంపేశారు. అలీఘడ్ జిల్లాలోని కాస్గంజ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గత ఆదివారం గంగానదిలో పుణ్యస్నానం చేసిన దంపతులు సైకిల్పై తిరిగొస్తున్నారు.

అలా వచ్చే క్రమంలో మార్గం మధ్యలో ఉండగా ఓ గుర్తు తెలియని వ్యక్తుల గ్రూపు వారిపై దాడి చేసింది. భర్త సునీల్ కుమార్ వారి నుంచి భార్యను రక్షించుకునేందుకు ప్రయత్నించగా కత్తులతో పొడిచారు. అనంతరం భార్యను పొలాల్లోకి ఈడ్చుకెళ్లి సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. గొంతు నులిమి హత్య చేశారు. ప్రస్తుతం భర్త తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు భర్తను ప్రశ్నించగా కొన్ని విరుద్ధమైన సమాధానాలు చెప్తున్నట్లు తెలుస్తోంది. వాటి ప్రకారం బాధితురాలిని అత్తమామలు, భర్త కట్నం వేధింపులకు గురిచేసినట్లు పోలీసులు అంచనాకు వచ్చారు. అయితే, ఈ హత్య విషయం మాత్రం మిస్టరీగా ఉండిపోయింది. ప్రస్తుతానికి ఇంకా ఎవరిని అరెస్టు చేయలేదు.

Advertisement
Advertisement