బధోహి: ఉత్తరప్రదేశ్ బధోహిలో దారుణం చోటు చేసుకుంది. ఏం కష్టం వచ్చిందో ఏమోగానీ ఓ తల్లి కఠిన నిర్ణయం తీసుకుంది. తనతో పాటు ముక్కుపచ్చలారని ముగ్గురు కూతుళ్లకు నిప్పంటించి తానూ ఆత్మహత్యకు పాల్పడింది. తాను చనిపోతే తన బిడ్డలు అనాథలవుతారనుకుందో ..మరేవైనా కారణాలున్నాయో తెలియదు గానీ ముప్ఫై ఏళ్ల పూనం పాండే తనతోపాటు గుడియా, మిన్ని, రుషిను కూడా అగ్నికి ఆహుతి చేసింది.
ఖమియాపూర్ గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు పూర్వాపరాలపై ఆరా తీస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదని.. దర్యాప్తు చేస్తున్నామని జిల్లా ఎస్పీ అనిల్ కుమార్ తెలిపారు.