ఆ ఘటనతో నా భార్య వణికిపోతోంది..! | Sakshi
Sakshi News home page

ఆ ఘటనతో నా భార్య వణికిపోతోంది..!

Published Fri, Sep 8 2017 10:06 AM

ఆ ఘటనతో నా భార్య వణికిపోతోంది..! - Sakshi

నడిరోడ్డుపై కార్పొరేట్ ఉద్యోగినికి వేధింపులు
సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు

సాక్షి గుర్గావ్ : తన భార్య ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే వణికిపోతోందని ఓ కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న మహిళ భర్త ఆవేదన వ్యక్తం చేశారు. గుర్గావ్ లోని స్థానిక మహిళా పోలీస్ స్టేషన్ కు బుధవారం భార్యతో పాటుగా వెళ్లి ఆమె ఎదుర్కొన్న వేధింపుల ఘటనపై ఫిర్యాదు చేశారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. ఇక్కడి 92 సెక్టార్ లో నివాసం ఉండే ఓ మహిళ స్థానిక కార్పొరేట్ కంపెనీలో ఎగ్జిక్యూటీవ్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రోజులాగానే తన కారులో ఆఫీసుకు బయలుదేరారు. కొద్ది దూరం వెళ్లాక తన కారు వెనుక మరో కారు పది నిమిషాల పాటు రావడాన్ని ఆమె గమనించారు.

తొలుత వారు అడ్రస్ కోసం అడగాలని చూశారని భావించగా.. తన అంచనా తప్పని తేలిందని బాధితురాలు వాపోయారు. ఇద్దరు వ్యక్తులు 10 కిలోమీటర్ల దూరానికి పైగా తన కారును వెంబడించి అడ్డుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితులు తమ కారు డోర్ తెరచి అసభ్యంగా ప్రవర్తిస్తుండగా.. భయాందోళనకు గురైన తాను భర్తకు ఫోన్ చేసి విషయాన్ని చెప్పగా ఆయన సూచన మేరకు పోలీసులకు కాల్ చేసినట్లు వివరించారు. పోలీసులకు కాల్ చేసినట్లు గుర్తించిన నిందితులు అక్కడినుంచి వెంటనే వెళ్లిపోయారు.

ఆఫీసుకు వెళ్లకుండా ఇంటికి వచ్చిన తన భార్య భయంతో వణికిపోతోందని, తనకు ఏం చేయాలో అర్థం కావడం లేదని ఉద్యోగిని భర్త చెప్పారు. భార్యతో పాటుగా 51 సెక్టార్లో ఉన్న మహిళా పోలీస్ స్టేషన్కు వెళ్లి వేధింపుల ఘనపై స్టేషన్ అధికారిణి కైలాశ్ దేవికి ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఐపీసీ 354 డీ, 354 ఏ (వేధింపులు) సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీల ఫుటేజీ సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. గత ఆగస్ట్ 6న సెక్టార్ 17లోని తన ఆఫీసుకు 22 ఏళ్ల ఐటీ ఉద్యోగిని స్కూటర్ పై వెళ్తుండగా కొందరు కారులో వచ్చి ఆమెను వేధించిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement