పోలీసులతో జతకట్టిన అతిచిన్న మహిళ! | Sakshi
Sakshi News home page

లాక్‌డౌన్‌: ‘కరోనాపై పోరాడేందుకు సహకరించండి’

Published Tue, Apr 14 2020 12:06 PM

World Shortest Woman Jyoti Amge Joins With Police Over Awareness On Covid 19 - Sakshi

ముంబై: కరోనా వైరస్‌పై అవగాహన కల్పించేందుకు ప్రపంచ అతిచిన్న మహిళ జ్యోతి అమ్గే మంగళవారం నాగపూర్‌ పోలీసులకు మద్దతుగా నిలిచారు. లాక్‌డౌన్‌లో ఇంట్లోనే ఉండాలని ఆమె ప్రజలను విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో కరోనా వైరస్‌ను అరికట్టేందుకు భౌతిక దూరం ఒక్కటే మార్గమని, ఇందుకోసం లాక్‌డౌన్‌ అ‍మలును ప్రజలు తప్పనిసరిగా పాటించి మహమ్మారిపై పోరాడేందుకు ప్రభుత్వానికి సహకరించాలని ప్రజలను కోరారు. ఈ క్రమంలో ఆమె పోలీసులతో కలిసి నాగపూర్‌ సమీపంలోని ఇతర ప్రాంతాలలో అవగాహన చర్యలు చేపట్టారు. ‘ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు లాక్‌డౌన్‌కు ఇంట్లోని ఉండి సహకరించాలని. అదే విధంగా కరోనా వైరస్‌పై పోరాడేందుకు సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి, పోలీసులకు మద్దతుగా నిలవాలి’ అంటూ సందేశాన్నిచ్చారు. (శభాష్‌ పోలీస్‌)

ఈ సందర్భంగా జ్యోతి ‘పీటీఐ’తో మాట్లాడుతూ.. ఈ ప్రాణాంతక వైరస్‌ గురించి ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగస్వామి కావాలని నాగపూర్‌ పోలీసులు తనని కోరినట్లు చెప్పారు. వారి పిలుపు మేరకు ప్రజలంతా ఇంట్లోనే ఉండేలా కరోనా వైరస్‌పై అప్రమత్తం చేయడానికి పోలీసులకు మద్దతుగా వచ్చానని ఆమె తెలిపారు. కాగా 26 ఏళ్ల వయసున్న జ్యోతి కేవలం 62.8 సెంటీమీటర్ల పొడవుతో ప్రపంచంలోనే అతిచిన్న మహిళగా గిన్నిస్‌ బుక్‌కు ఎక్కిన సంగతి తెలిసిందే. ఇక ముంబైకి చెందిన 242 మందితో సహా మొత్తం 352 మందికి సోమవారం కోవిడ్‌-19 పరీక్షలు నిర్వహించగా వారికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 2334కు చేరుకోగా.. మరణాల సంఖ్య 160కి పెరిగిందని అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement