బతుకమ్మ నిండు ‘చెరు’వైంది | Sakshi
Sakshi News home page

బతుకమ్మ నిండు ‘చెరు’వైంది

Published Wed, Oct 8 2014 11:44 PM

బతుకమ్మ నిండు ‘చెరు’వైంది - Sakshi

చెరువు జీవన సర్వస్వం అయినప్పుడు దానిని రక్షించిన వాళ్లు దేవుళ్లను మించిన దేవుళ్లవుతారు. వాళ్లే బతుకమ్మలు. పంట నీటికోసం ప్రాణత్యాగాలు చేసిన ఆడబిడ్డలు, చెరువు, పూలు ఈ మూడింటి కలయికే బతుకమ్మ పండుగ. నీళ్లు, చెరువులు, వాటి రక్షణ, వాటిని కాపాడుకోవాల్సిన సామాజిక బాధ్యత, తద్వారా ఊరంతా సంతోషంగా కలసి బతికే సందర్భమే బతుకమ్మ. చెరువు కోసం ప్రాణత్యాగాలు చేసిన వారికి పూలనివాళి అర్పించే ఈ బతుకు పండుగ తెలంగాణ జన జీవన గోసకు, ఆరాటానికి, కష్టం తర్వాత వచ్చే సంతోషానికి నిలువెత్తు నిదర్శనం.
 
చెరువు తెలంగాణ సామాజిక పోరాట గీతిక. తెలంగాణ బతుకు వెంట ప్రవహించే పాట చెరువు తెలంగాణ జీవన రేఖ. చారిత్రక, సాంస్కృతిక వికాసానికి ప్రతీక. రాజకీయ, ఆర్థిక, సామాజిక అధికారానికి, ఆధిపత్యానికి పునాది. మొత్తంగా చెరువు లేని ఊరు చెదిరిన గూడుతో సమానం. చెరువు ఉన్న ఊరు సకలం కలిగిన లోగిలి లాంటిది. అం దుకే తెలంగాణలో జరిగే చాలా ఉత్సవాలకు, ఉన్నతులకు చెరువు ఒక వేదిక. ప్రతి ఏడాది తెలంగాణలో అత్యంత వైభవంగా జరిగే బతుకమ్మ పుట్టుక కూడా చెరువేనంటే ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. బతుకమ్మ పండుగపై ఎన్నో కథలు, గాథలు ప్రచారంలో ఉన్నాయి. వీటన్నింటినీ పరిశీలించిన తర్వాత చెరువుతో ముడిపడి ఉన్న కథాగానమే నిజమైందనే నిర్ధారణకు రావాల్సి వస్తుంది.

బతుకమ్మ పండుగకు కారణంగా చెబుతున్న ధర్మాం గద రాజు కథ ఎక్కువగా ప్రచారంలో ఉన్నది. దక్షిణ భారతదేశంలో చోళ వంశపు రాజైన ధర్మాంగధునికి వంద మంది కుమారులు పుట్టి చనిపోయారు. ఆయన, ఆయన భార్య సత్యవతి తమ కడుపులో లక్ష్మీదేవి పుట్టాలని చేసిన ప్రార్థనలతో లక్ష్మీదేవి వాళ్లింటిలో జన్మించింది. ఆమె పుట్టిన వెంటనే చాలా మంది మునులు వచ్చి- ‘నువ్వు చిరకాలం బతుకమ్మ’ అని దీవించినట్టు కథ ప్రచారంలో ఉంది.

మరొక కథ. మహిషాసుర మర్దనం. మహిషాసురు డిని యుద్ధంలో హతమార్చి అలసిపోయిన గౌరి శక్తి ఆశ్వ యుజ పాడ్యమి రోజున నిద్రలోకి జారుకుంటుంది. అయితే భక్తులు తొమ్మిది రోజులు ప్రార్థనలు, పూజలు చేసిన అనంతరం దశమి రోజున నిద్రలేచినట్టు కథ సారాంశం. దక్షయజ్ఞంలో భస్మమైపోయిన పార్వతీదేవి పునరుజ్జీవం పొందినట్టు, ఆమెనే- బతుకమ్మ అని కొలుస్తూ, పండుగ చేసుకున్నట్టు ఇంకొక కథ.

అయితే ఈ దేవతలు పూలను ఇష్టపడతారని, అందుకే పూలను గోపురం లాగా పేర్చి, చివరన పసుపుతో గౌరమ్మను చేసి పెడతారనే సంప్రదాయం వచ్చినట్టు రకరకాల అభిప్రాయాలు వాడుకలో ఉన్నాయి.

కానీ పల్లె ప్రజలు తాము ఈ పండుగ చేసుకోవడానికి కారణమైన కథను గానం చేస్తూ, పండుగ జరుపుకుం టారు. ఈ కథాగానాన్ని, దాని సారాంశాన్ని పరిశీలిస్తే తెలంగాణలో బతుకమ్మ పుట్టడానికి చెరువే కారణమనే విషయం మనకు స్పష్టమవుతుంది.

అందులో కథానాయిక బతుకమ్మ చిన్నమ్మ. చిన్నమ్మ ఒక రాజు చిన్న కోడలు. ఆ రాజు ఉన్న ఊరికి ఒక చెరువు ఉంటుంది. అది ఎంతో విశాలమైనది. ఆ ఊరికి ఆధారం, జీవనాధారం అన్నీ ఆ చెరువే. అయితే బాగా వానలు పడి చెరువు నిండిపోతుంది. చెరువు కట్టకు గండిపడుతుంది. దానిని పూడ్చడానికి ఊరందరూ చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఆ కట్ట నిలబడాలంటే మైసమ్మ కోరిన కోర్కె ను తీర్చాలని అందరూ భావిస్తారు. తెలంగాణలో గ్రామ దేవతలు ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి రక్షణగా ఉంటారు. మైసమ్మ నిర్మాణాలన్నింటికీ రక్షణగా భావిస్తారు. అందు వల్ల ఏ నిర్మాణాలు జరిగినా మైసమ్మకు మొక్కడం ఆనవా యితీ. అందుకే కోట దగ్గర కోట మైసమ్మ, గడీల దగ్గర గడీ మైసమ్మ, చెరువు దగ్గర కట్టమైసమ్మ గుడి, తెలంగాణలో తప్పనిసరిగా దర్శనమిస్తుంది. అందుకే కట్ట తెగిపోతే మైసమ్మకు మొక్కాలనేది. అప్పుడైతేనే చెరువు కట్ట నిలబ డుతుందని ప్రజల నమ్మకం. బలమైన విశ్వాసం. అయితే ఆ రోజుల్లో గ్రామ పెద్దలు, రాజులు చెరువులకు అధిపతు లుగా ఉండేవాళ్లు. ఆ రోజు మైసమ్మను శాంతింపజేయ డానికి ప్రయత్నం మొదలుపెడతారు.

 కట్టను నిలపడానికి నా బర్రెల మందను ఇస్తానం టాడు రాజు. ఆ బర్రెల మంద నాక్కూడా ఉన్నదని మైసమ్మ సమాధానం. ఆవుల మంద, మేకల మంద, గొర్రెల మందలను కూడా ఇస్తానంటే అవన్నీ నా దగ్గర ఉన్నాయని మైసమ్మ జవాబిస్తుంది. అయితే ఆ రాజు వెంటనే, తల్లిదండ్రులను, అత్తమామలను, అన్నా వదిన లను, అక్కా బావలను, పెద్ద కొడుకు, పెద్ద కోడలిని అర్పి స్తానంటాడు. దానికి ఆ దేవత సంతృప్తి పడదు.

అయితే చిన్న కోడల్నిస్త ఉయ్యాలో - కట్ట నిలుపే మైసు ఉయ్యాలో అనగానే చెరువు స్పందిస్తుంది.
ముసి ముసి నవ్వుతూ ఉయ్యాలో -
మూడడుగులాపే ఉయ్యాలో
ఎగిసిపడి నవ్వుతూ ఉయ్యాలో -
ఏడడగులాపే ఉయ్యాలో
పక పకా నవ్వుతూ ఉయ్యాలో -
పదడుగులాపే ఉయ్యాలో

అట్లా కట్టమైసమ్మ కట్టను తెగకుండా ఆపుతుంది. అప్పుడు ఆ రాజు ఇంటికెళ్లి చిన్న కోడలుతో విషయమేమీ చెప్పకుండా తొట్టిలో ఉన్న ఆమె చిన్న కొడుకుని గురించి వివరాలడుగుతాడు. చిన్న పిల్లవాడికి స్నానం పోసినవా? బట్టలేసినవా? ఉగ్గు తినిపించినవా? జోలపాడినవా? అని అడిగి అవన్నీ అయిపోయాయని చెబితే, చెరువుకు పోయి నీళ్లు తేవాలి బిందె పట్టుకొని బయలు దేరాలని మామ కోడల్ని కోరతాడు. ఆమె మారు మాట్లాడకుండా మామ వెంట చిన్నమ్మ చెరువుకు వెళుతుంది. చెరువు లోపలికి వెళ్లి నీళ్లు ముంచుకొని తెమ్మని మామ చెప్పిన వెంటనే, ఒక్క చేత్తో బిందె పట్టి చెరువులోపలికి దిగుతుంది. అయితే మోకాలి దాకా నీళ్లొచ్చినా దేవత మహిమ వలన బిందె మునగలేదు. తొడల దాకా నీళ్లొచ్చినా బిందె మునగలేదు. నడుములు మునిగినా బిందె మునగలేదు. అప్పుడు ఆ మామ ‘అసుంట బోయి బిందెను ముంచు’ అంటే ముందుకు వెళుతుంది. అప్పుడు బిందెతో పాటు, ఆమె కూడా మునిగిపోతున్నట్టు ఆమెకు అప్పుడు తెలుస్తుంది. అప్పుడు ఆ చిన్నమ్మ...

ఆకాశాన బోయేటి ఉయ్యాలో
అతిరామ చిలుక ఉయ్యాలో
నా తల్లిదండ్రికి ఉయ్యాలో
బిడ్డ లేదని చెప్పు ఉయ్యాలో
నాతోటి వాళ్లకు ఉయ్యాలో
అక్క లేదని చెప్పు ఉయ్యాలో
అంటూ ముద్దబంతి వలె మునిగింది చిన్నమ్మ. మునిగిపోతూ ఇంకేమంటుంది?
బొడ్డెనమ్మనయి ఉయ్యాలో
నీ బిడ్డనైత ఉయ్యాలో
తంగేడు పూలల్ల ఉయ్యాలో
తల్లినైవస్త ఉయ్యాలో
కలువపూలల్ల ఉయ్యాలో
కలగలసి వస్త ఉయ్యాలో
అన్ని పూలతోటి ఉయ్యాలో

ఆడుకొనిపోతా ఉయ్యాలో అంటూ పూర్తిగా కనపడ కుండా పోతుంది. ఎక్కడైతే చిన్నమ్మ మునిగిందో అక్కడ పూలన్నీ నీళ్లల్లో తేలి కనిపిస్తాయి. తమ కోసం ప్రాణాన్ని త్యాగం చేసిన చిన్నమ్మను ఊరు ఊరంతా కలకాలం పూలల్లో పూవులాగా ‘బతుకమ్మ’ అని కొనియాడినట్టు ఈ పాట చెబుతుంది.

ఇంకొక కథలో చెరువు కట్ట తెగిపోతుంటే, ఎక్కడైతే గండి పడుతుందో ఆ గండిలో ఒక ఆడబిడ్డ కూచుండి తనను తాను అర్పించుకొని చెరువు కట్ట తెగిపోకుండా ఆపగలుగుతుంది. ఆ చెరువు సర్వస్వం అయినప్పుడు దానిని రక్షించిన వాళ్లు దేవుళ్లను మించిన దేవుళ్లవుతారు.

బతుకమ్మ పండుగలో మూడు ప్రధానమైన అంశాలు. ఒకటి ఆడబిడ్డలు, రెండు చెరువు, మూడు పూలు. ఈ మూడు విషయాలు ఈ కథలో ప్రధానమైన విషయాలు. దసరా సమయం నాటికి పప్పు ధాన్యాలు, కొన్ని రకాల వరి ధాన్యాలు ఇంటికొస్తాయి. అయితే ఆ పప్పు ధాన్యాలన్నీ కలిపి ముద్దలు చేస్తారు. మక్క కంకులతో మక్కపిండి చేస్తారు. వాటితో పాటు ఆ సమ యంలో వచ్చే పంటలన్నింటితో రకరకాల పిండితో సత్తు తయారు చేస్తారు. వీటినే సత్తు ముద్దలు, మలిద ముద్దలు అంటారు. వాటిని మొదటగా చెరువుకి ప్రసాదంగా అర్పి స్తారు. ఆ తరువాత అందరూ కలసి వాయినాలు ఇచ్చు కుంటారు. అంటే ఒకరు తయారు చేసిన పిండి వంటలు మరొ కరితో పంచుకుంటారు. పండుగ సాంప్రదాయాన్ని మొత్తం గమనిస్తే పంటలకు ప్రాణాధారమైన నీళ్లు, చెరు వులు, వాటి రక్షణ, వాటిని కాపాడుకోవాల్సిన సామాజిక బాధ్యత, తద్వారా ఊరంతా సంతోషంగా కలసి బతికే సందర్భమే బతుకమ్మ. చెరువులో పూలను వదలడం అనేది ఒక్కొక్కరు ఒక్కో రకంగా అర్థం చేసుకున్నా అన్నింటికీ మించి చెరువు కోసం ప్రాణత్యాగాలు చేసిన వారికి పూలనివాళి అర్పించడమనేది స్థూలంగా అర్థం అవుతుంది. అయితే ఇంకా బతుకమ్మ పండుగ నేపథ్యం గురించి విస్తృతమైన పరిశోధన జరగాలి. ఇప్పటివరకు ప్రచారంలో ఉన్న వాటికే పరిమితం కాకుండా అట్టడుగున ఉన్న చరిత్రను తవ్వి తీయాల్సిన అవసరం ఉంది. అప్పుడే చెరువు కథకి కూడా ఒక శాస్త్రీయత లభిస్తుంది.
 
(వ్యాసకర్త సామాజిక విశ్లేషకుడు) మల్లేపల్లి  లక్ష్మయ్య
 

Advertisement
Advertisement