Sakshi News home page

ఉద్యోగాల కోతే బాబు విజన్

Published Thu, Jun 26 2014 2:01 AM

ఉద్యోగాల కోతే బాబు విజన్

 ‘ఇంటికో ఉద్యోగం’...
 ‘నిరుద్యోగులకు నెలకు 2వేల భృతి’...
 ‘జాబు కావాలంటే బాబు రావాలి’...

 
 మొదటి మంత్రివర్గ సమావేశంలోనే 35 వేల ఉద్యోగాలు పీకేసే నిర్ణయాన్ని చంద్రబాబు తీసుకున్నారు. 20 వేల మంది ఆదర్శరైతులు, 15 వేల మంది ఉపాధి హామీ క్షేత్రస్థాయి సహాయకులను ఇంటికి సాగనంపుతూ జీవో కూడా ఇచ్చేశారు. వెయ్యి రూపాయల గౌరవవేతనంతో పనిచేస్తున్న దిగువసామాజికవర్గాలకు చెందినవారిని ఒక్క కలం పోటుతో అలా తొలగించేయడం బాబుకే చెల్లింది. ఆర్థిక సంస్కరణలలో భాగంగా ఏటా 1.9 శాతం మేర ఉద్యోగులను తొలగిస్తానంటూ ప్రపంచ బ్యాంకుతో గతంలో చంద్రబాబు ఏకంగా ఓ ఒప్పందమే కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ పథకం (ఏపీఈఆర్‌పీ) ప్రారంభించారు. ఉద్యోగుల తొలగింపు, ప్రభుత్వ రంగ సంస్థల మూసివేత ఈ పథకం ప్రధాన ఉద్దేశం.
 
 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేసిన నినాదాలు ఇవి. యువతను ప్రలోభపెట్టడానికి చంద్రబాబు చేయని ప్రచారం లేదు. ఇవ్వని వాగ్దానం లేదు. అయితే ఫలితాలు వచ్చి నెల గడవక ముందే బాబుగారి అసలు స్వరూపం బట్టబయల య్యింది. కొత్తగా ఉద్యోగాలివ్వడం మాట అటుంచి ఉన్న ఉద్యోగాలకే ఆయన ఎసరు పెట్టారు. వివిధ సంస్థలలోని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను తీసే స్తున్నారు. ఉద్యోగాలు తీసేయడం, పనిచేసే సంస్థలను మూసేయడంలో బాబుగారు బహునేర్పరి. ఆయనగారి గత చరిత్రంతా ఈ తీసివేతలు... మూసివేతలే... గతంలో అధికారంలో ఉండగా అనేక ప్రభుత్వ రంగ సంస్థలను మూసేసిన చంద్రబాబు వాటిలోని వేలాదిమంది ఉద్యోగుల ఉపాధికి దెబ్బకొట్టారు. అంతేకాదు ప్రపంచ బ్యాంకుతో ఓ ఒప్పందం కుదుర్చుకుని ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ పథకం ప్రారంభించారు. దశలవారీగా ప్రభుత్వరంగ సంస్థలను మూసేయడం, ప్రభుత్వ ఉద్యోగులను తొలగించడం ఆ పథకం ఉద్దేశం. అందుకోసం జీవో నంబర్ 58ని కూడా ఆయన జారీ చేశారు. ఆయన విజన్ ఉద్యోగుల తొలగింపే. 2020 నాటికి లక్ష మంది ఉద్యోగులను తొలగిస్తానని ప్రపంచబ్యాంకుకు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి మన బాబుగారు.
 
 ఇప్పుడు అధికారం కోసం చంద్రబాబు అనేక వాగ్దానాలు చేశారు. అందులో అత్యంత కీలకమైనది ‘ఇంటికో ఉద్యోగం’. రాష్ట్రంలో 3.5 కోట్ల ఇళ్లున్నాయి. ఇంటికో ఉద్యోగమంటే మాటలా.. అన్ని ఉద్యోగాలు ఇస్తున్నారా...? బాధ్యతగలిగిన నాయకులు ఏదైనా మాట్లాడుతున్నారంటే చిత్తశుద్ధి ఉండనక్కరలేదా? సాధ్యాసాధ్యాలను చూడనక్కరలేదా? బాబుగారు అన్నీ చూసుకునే ప్రజల కోసం ఆ హామీలిచ్చారని తెలుగుదేశం నాయకులు చెబుతున్నారు. అయితే మరి ఇప్పుడు నెల గడచిపోయినా బాబుగారు తన హామీలపై నోరు ఎందుకు మెదపడం లేదు? ఏ హామీపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో ఎందుకు చెప్పడం లేదు? వ్యవసాయ రుణాల మాఫీపై ఓ కమిటీ వేసి చేతులు దులుపుకున్న చందానే మిగిలిన హామీలనూ అటకెక్కించేస్తారా? నిరుద్యోగులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న సందేహాలివి.
 
  గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగానూ చంద్రబాబు మాటలు సమస్యను పక్కదోవ పట్టించేలానే ఉన్నాయి. ఉద్యోగాలంటే ప్రభుత్వ ఉద్యోగాలే కానక్కరలేదని, ప్రైవేటు ఉద్యోగాలు కూడానని ఆయన అంటున్నారు. ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ తదితరాలన్నింటినీ కలిపినా కూడా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వోద్యోగాలు 13 లక్షలు. భారీ, మధ్య, చిన్నతరహా పరిశ్రమలు, ఐటీ, సేవారంగం తదితరాల్లోని మొత్తం ప్రైవేట్ ఉద్యోగుల సంఖ్య 35 లక్షలు దాటదు. అంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాల సంఖ్య 50 లక్షల లోపే. అలాంటిది మరో 3 కోట్ల ఉద్యోగాలను ఎలా సృష్టిస్తారు? దానికేమైనా ప్రణాళిక బాబు వద్ద సిద్ధంగా ఉందా? అందుకోసం ఆయన ఏం చేయబోతున్నారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదా?
 
 ఉద్యోగాలపై స్పష్టత ఏది?
 గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో ‘ఇంటికో ఉద్యోగం’ హామీపై ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. దానిపై స్పష్టత ఏదని ప్రశ్నించారు. జాబు కావాలంటే బాబురావాలంటూ ఎన్నికలకుముందు టీవీల్లో పదేపదే ప్రకటనలు గుప్పించిన చంద్రబాబు ఇప్పుడు ఆ విషయాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదని అడిగారు. అసలు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నారా లేదా.. అందుకోసం ఎలాంటి చర్యలు చేపడుతున్నారు... అని ప్రశ్నించారు. వీటికి అధికారపక్షం నుంచి అసలు సమాధానమే లేదు. అత్యంత కీలకమైన ఈ అంశంపై శాసన సభలో జరిగిన చర్చ ఎందుకనో మీడియాలో ఎక్కడా పెద్దగా కనిపించలేదు. కోటి ఆశలతో ఎదురుచూస్తున్న నిరుద్యోగులు కొత్త ప్రభుత్వం తీరు చూసి నిట్టూరుస్తున్నారు.
 
 అసలు ఉద్యోగం వస్తుందా...? వచ్చే వరకూ నిరుద్యోగ భృతి ఇస్తారా..? ఇవి జవాబు దొరకని మిలియన్ డాలర్ల ప్రశ్నలే. ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు హామీలను చూసి యువత ఎంతో కొంత ఆశపడబట్టే ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నారు. పదవినధిష్టించిన తర్వాత మరి ఆ యువతకు ఆయనిచ్చే భరోసా ఏమిటి? ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతిపై ఇప్పటికీ ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదు? 3.5 కోట్ల మందికి ఉద్యోగాలెప్పుడు ఇస్తారు... ఈ లోగా ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇవ్వనున్నారు..? వంటి విషయాలపై చంద్రబాబుకు ఎలాంటి క్లారిటీ లేదు. కొత్త ప్రభుత్వ ప్రాథమ్యాలను వెల్లడించే గవర్నర్ ప్రసంగంలోనూ నిరుద్యోగులకు సంబంధించి ఎలాంటి ప్రణాళికా లేదు. నిరుద్యోగ సమస్యకు బాబు ప్రభుత్వం ఎలాంటి ప్రాధాన్యతా ఇవ్వడం లేదని దీన్ని బట్టి అర్థమౌతుంది.
 
 ఇవ్వడం అటుంచి.. ఉన్నవి హుష్‌కాకి..
 వర్తమానానికి వస్తే... ఇంటికో ఉద్యోగం మాట దేవుడెరుగు... ఉన్న ఉద్యోగాలు పీకేసే పని బాబుగారు మొదలుపెట్టారు. మొదటి మంత్రివర్గ సమావేశంలోనే 35 వేల ఉద్యోగాలు పీకేసే నిర్ణయాన్ని చంద్రబాబు తీసుకున్నారు. 20 వేల మంది ఆదర్శరైతులు, 15 వేల మంది ఉపాధి హామీ క్షేత్రస్థాయి సహాయకులను ఇంటికి సాగనంపుతూ జీవో కూడా ఇచ్చేశారు. పదేళ్ల నుంచి వెయ్యి రూపాయల గౌరవవేతనంతో పనిచేస్తున్న దిగువ సామాజికవర్గాలకు చెందినవారిని ఒక్క కలం పోటుతో అలా తొలగించేయడం చంద్రబాబుకే చెల్లింది. వీరే కాదు గృహ నిర్మాణ సంస్థలో పనిచేస్తున్న 3,600 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కూడా బాబు ఉద్వాసన పలికారు. 15 వేల రూపాయలలోపు గౌరవవేతనంతో పనిచేస్తున్న ఈ ఉద్యోగుల కుటుంబాలన్నీ ఇప్పుడు వీధిన పడ్డాయి.
 
 ఇంకా వైద్య ఆరోగ్య శాఖలో 4 వేల మంది, జలయజ్ఞం భూసేకరణలో 7 వేల మంది ఉద్యోగులను త్వరలోనే ఇంటికి  పంపించనున్నారు. కొత్త ప్రభుత్వం వస్తే తమ ఉద్యోగాలు పర్మనెంట్ అవుతాయని భావించామని, ఇలా తమ పొట్టకొడతారని ఊహించలేదని ఆ ఉద్యోగులు వాపోతున్నారు. ఒక్క గృహనిర్మాణ సంస్థే కాదు.... అన్ని సంస్థలలోని తాత్కాలిక, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను కొత్త ప్రభుత్వం తొలగిస్తోంది. బాబు రాకతో జాబు పోక అన్నట్లయిందని ఉద్యోగులు బాధపడుతున్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజకీయ పదవుల్లోని వారు రాజీనామాలు చేయడం మామూలే. కానీ పొట్టచేతబట్టుకుని ఉద్యోగాలు చేసుకుంటున్న చిరు వేతన జీవులను రాజకీయ కోణంలో చూడడం, వారి ఉపాధిని దెబ్బకొట్టడం సబబేనా? గత ప్రభుత్వంలో ఉద్యోగాలలో చేరిన వారిని ఇపుడు తొలగించేయడం ఏ తరహా రాజకీయం?
 
 తొలగింపులు, మూసివేతలే బాబుగారి ట్రాక్ రికార్డు
 ఉద్యోగులను తొలగించడం, ప్రభుత్వరంగ సంస్థలను మూసివేయడంలో బాబుగారిది అందెవేసిన చేయి. గతంలో ఆయన పాలనలో అమలైన ప్రపంచబ్యాంకు ఆర్థిక సంస్కరణలకు బలైంది ఉద్యోగులే. ఆయన తొమ్మిదేళ్ల పాలనంతా ఉద్యోగుల ఉసురుపోసుకుంటూనే సాగింది. ఉన్న ఉద్యోగాలను తొలగించడమే పనిగా పెట్టుకునే చంద్రబాబు కొత్త ఉద్యోగాలిస్తానంటే నమ్మొ చ్చా...? ఆర్థిక సంస్కరణలలో భాగంగా ఏటా 1.9శాతం మేర ఉద్యోగులను తొలగిస్తానంటూ ప్రపంచబ్యాంకుతో చంద్రబాబు ఏకంగా ఓ ఒప్పందమే కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ పథకం (ఏపీఈఆర్‌పీ) ప్రారంభించారు. ఉద్యోగుల తొలగింపు, ప్రభుత్వ రంగ సంస్థల మూసివేత ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ఆ తర్వాత ఉద్యోగుల కుదింపునకు సంబంధించి ఉత్తర్వులు (జీవో 58) కూడా చంద్రబాబు జారీ చేశారు. దాని ప్రకారం 1998లో 747, 1999లో 1,683, 2000లో 3,439, 2001లో 1,382 మందిని తొలగించారని గణాంకాలు చెబుతున్నాయి. అలా లక్షమంది ఉద్యోగులను తొలగిస్తానని ప్రపంచబ్యాంకు ముందు చంద్రబాబు తన విజన్ 2020 ని ఆవిష్కరించారు.
 
 బాబు అనేక ప్రభుత్వరంగ సంస్థల ఆస్తులను కారుచౌకగా అమ్మేశారు. పలు సంస్థలను మూసేశారు. రాష్ట్రంలో 127 ప్రభుత్వ, సహకార రంగ సంస్థలు ఉన్నాయి. వాటిలో చంద్రబాబు 14 మూసేశారు. 11 సంస్థలను అమ్మేశారు. మరో పదిసంస్థలను అమ్మడానికి రంగం సిద్ధం చేశారు. ఈ సంస్థలలోని 21 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికారు. ఏపీఈఆర్‌పీ కింద తొలిదశలో నంద్యాల, రాజమండ్రి, నెల్లూరు, ఆదిలాబాద్ స్పిన్నింగ్ మిల్లులతో పాటు నిజాం షుగర్స్, ఆల్విన్ వాచ్ కంపెనీలను మూసేశారు. రిపబ్లిక్ ఫోర్జ్ కంపెనీ, మధునగర్ షుగర్ మిల్లు, లచ్చయ్యపేట షుగర్ మిల్లు, మెంబోజిపల్లి డిస్టిలరీ, చాగల్లు డిస్టిలరీ ఆస్తులను కారుచౌకగా అమ్మేశారు. రెండో దశలో ఆర్టీసీ, సింగరేణి కాలరీస్‌తో పాటు బెవరేజ్, టెక్స్‌టైల్స్, కోళ్లు -మాంసం అభివృద్ధి కార్పొరేషన్లు, చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ, వికలాంగుల సంస్థల్లోని ఉద్యోగులనూ తొలగించాలనుకున్నారు. 2004 ఎన్నికల్లో బాబు ఓటమితో వారంతా ఊపిరి పీల్చుకున్నారు.
 
 ఎకనమిక్ సర్వే చెబుతున్న నిజాలు...
 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సోషియో ఎకనమిక్స్ సర్వే 2012-2013 ప్రకారం...
 -    2000 మార్చి నాటికి ఆంధ్రప్రదేశ్‌లో రెండు రంగాల్లో.. అంటే పబ్లిక్ , ప్రైవేట్ రంగాలు రెండింటిలో కలిపి ఉద్యోగుల సంఖ్య 20,71,642. 2004 మార్చి నాటికి మొత్తంగా ఉద్యోగులు లేదా ఉద్యోగాల సంఖ్య 20,11,645. అంటే కేవలం నాలుగేళ్లలోనే చంద్రబాబు హయాంలో తగ్గిన ఉద్యోగాలు దాదాపు 60,000.
 -    వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన చివరి సంవత్సరం 2009 మార్చి నాటికి ఈ సంఖ్య 20,82,800. అంటే వైఎస్ పాలనలో 71,155 ఉద్యోగాలు పెరిగాయి.
 - ప్రైవేటు రంగాన్ని తీసుకున్నా 2000 మార్చి నాటికి 5,68,362 ఉద్యోగాలు ఉం టే అది 2004 మార్చి నాటికి 5,67,666. అంటే బాబు పాలన చివరి నాలుగేళ్లు తీసుకున్నా ప్రైవేటు ఉద్యోగాలు పెరగకపోగా 696 తగ్గాయి.
   2009 మార్చి నాటికి ప్రైవేటు ఉద్యోగాలు 7,24,916. అంటే 1,59,250 ఉద్యోగాలు పెరిగాయి.
 
 బాబు జమానాలో తగ్గిన ఉద్యోగాలు
 చంద్రబాబు అమ్మేసిన ప్రభుత్వరంగ, సహకార సంస్థలివే..
 *    ఆల్విన్ సనత్‌నగర్ భూములు
*     రిపబ్లిక్ ఫోర్జ్ కంపెనీ
*     నిజాం షుగర్స్ (నాలుగు యూనిట్లు)
*     మధునగర్ షుగర్ మిల్లు
*     లచ్చయ్యపేట షుగర్ మిల్లు
*     మొంబోజిపల్లి డిస్టిలరీ
*     చాగల్లు డిస్టిలరీ
 *    హనుమాన్ జంక్షన్ షుగర్స్
 *    నంద్యాల షుగర్స్
 *    పాలకొల్లు షుగర్స్
 *    గురజాల షుగర్స్
*     ఇంకొల్లు నూలు మిల్లు
*     ఆదిలాబాద్ నూలు మిల్లు
*     నెల్లూరు నూలు మిల్లు
*     యడ్లపాడు నూలు మిల్లు
 
 మభ్యపెట్టడం వెన్నతోపెట్టిన విద్య
 ఏరుదాటేందుకు ఎన్నో చెబుతాం అవన్నీ గుర్తుపెట్టుకుంటే ఎట్టా అని వెనకటికెవడో అన్నాట్ట. బాబుగారిది అచ్చు ఇలాంటి పాలసీనే. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ హామీనీ ఆయన అంతగా గుర్తుపెట్టుకోరు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో అమలు చేయాల్సి వచ్చినా వాటికి ఎలాగోలా తూట్లు పొడిచేస్తారు. అదీ ఆయన ట్రాక్ రికార్డు. మద్యనిషేధం ఎత్తివేత, కిలో 2 రూపాయల బియ్యం ధర రూ.5.25కు పెంపు వంటివి ఇందుకు నిదర్శనం. ఇప్పుడు కూడా రైతు రుణాల మాఫీ గురించి అన్నివైపులా ఒత్తిడి పెరగడంతో ఓ కమిటీ వేసేశారు. నిజానికి రుణమాఫీ ఆచరణ సాధ్యమేనా అని ఎన్నికల సంఘం చంద్రబాబును వివరణ అడిగితేనే నిక్కినీలిగీ చివరికి ఏదో సమాధానమిచ్చారు. అందులో చెప్పిన విధంగానే రుణమాఫీని అమలుచేసేయొచ్చు కదా?
 
 మరలా అధ్య యనానికి ఓ కమిటీ ఎందుకు? అంటే అసలు ఏమీ అధ్యయనం చేయకుండానే వెనకా ముందూ చూసుకోకుండానే హామీ ఇచ్చేశారు? మేనిఫెస్టోలో పెడుతున్నామంటే దాని సాధ్యాసాధ్యాలను ముందుగా బేరీజు వేసుకోనక్కరలేదా? ఇప్పుడు కొత్తగా కమిటీ ఏమిటి? ఇది కాలయాపన కోసం కాదా? ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో పాత రుణాలు కడితే గానీ కొత్తగా రుణాలిచ్చేది లేదని బ్యాంకర్లు చెబుతున్నారు. పైగా పాతరుణాలు కట్టాలని నోటీ సులు కూడా ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులను గందరగోళంలో ముంచి కమిటీలతో కాలయాపన చేయడం సబబేనా? ఇంటికో ఉద్యోగం విషయంలోనూ బాబు ఇలాంటి గందరగోళాన్నే సృష్టించాలని చూస్తున్నారు. ఉద్యోగమంటే ప్రభుత్వ ఉద్యో గమే కానక్కరలేదు ప్రైవేటు ఉద్యోగమైనా ఉద్యోగమేనని ఆయన అంటున్నారు. అలాగే ఉద్యోగమంటే ఉద్యోగమే మేమే ఇవ్వనక్కరలేదు.. ఎవరిచ్చినామేమిచ్చినట్టేనంటూ రాష్ట్రంలో ఎక్కడ ఏ కొట్టులో ఎవరికి ఏ గుమస్తా ఉద్యోగమొచ్చినా ఆయన ఖాతాలోనే వేసుకుంటారేమో..!
 - పోతుకూరు శ్రీనివాసరావు

Advertisement
Advertisement