ఆర్థిక గండాన్ని అధిగమించిన భారత్ | Sakshi
Sakshi News home page

ఆర్థిక గండాన్ని అధిగమించిన భారత్

Published Wed, Jul 13 2016 1:51 AM

ఆర్థిక గండాన్ని అధిగమించిన భారత్ - Sakshi

మన అవసరాలను, అవకాశాలను సమన్వయం చేసుకుంటూ వెళ్లినంత కాలం అంతర్జాతీయంగా ఎన్ని ఆర్థిక ఒడిదుడుకులు వచ్చినా మనపై పెద్దగా ప్రభావం చూపలేవు. ఎదుగుతున్న భారత్ సమర్థతను గుర్తించి సుపరిపాలనను అందించడమే ప్రస్తుత కర్తవ్యం. ప్రధాని మోదీ చేస్తున్నది కూడా అదే.
 
 బ్రెగ్జిట్.. ఆర్థిక వ్యవస్థల్ని కుదిపేసిన ఈ అంతర్జాతీయ పరిణామం తాలూకు భయాలు, అనుమానాలు మనదేశాన్నీ ప్రభావితం చేశాయి. కానీ, మనదేశ మార్కెట్లు, ఆర్థిక రంగం అందరూ ఊహించినట్లుగా భారీ పతనాన్ని చవిచూడలేదు. ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు సైతం మన దేశ పనితీరును ఈ సందర్భంగా అభినందించటం గమనార్హం. మరి ఆర్థిక విశ్లేషకుల అంచనాలన్నీ ఎందుకు తప్పయ్యాయి?
 ఆరు దశాబ్దాలు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ కానీ, నెహ్రూ కుటుంబం కానీ దేశాన్ని అభివృద్ధి చేయ లేకపోయింది. ప్రాచీన కాలం నుంచి మనకు అంత ర్లీనంగా ఉన్న శక్తి, సామర్థ్యాలను మనం సరిగ్గా వాడు కోలేదు. మన సంప్రదాయాలను ఆధారంగా చేసుకుని మన నైపుణ్యాలకు మెరుగులు దిద్ది ప్రపంచ శక్తిగా ఎదిగేందుకు ఉన్న అవకాశాలను ఏనాడూ పట్టించు కోలేదు. కానీ, రెండేళ్లలో ప్రధాని మోదీ ఈ దిశగా చర్యలు చేపట్టిన ఫలితమే మన దేశానికి అంతర్జాతీయ ఆర్థిక పతనాల నుంచి లభిస్తున్న రక్షణ.
 మన దేశంలో సగం మందికి జీవనోపాధి వ్యవసాయ రంగమే కల్పిస్తోంది.
 
 కానీ, వ్యవసాయంలో వృద్ధి మాత్రం ఆశించినంత లేదు. సాగు లాభసాటిగా మారితే, రైతులకు చేతినిండా డబ్బు అందితే గ్రామాలు పచ్చగా ఉంటే దేశం సస్యశ్యామలం అవుతుంది. అందుకే నరేంద్ర మోదీ రైతుల ఆదాయాన్ని పెంచేం దుకు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు. ప్రతి పొలానికీ నీరు ఇచ్చేందుకు ‘క్రిషి సించాయి యోజన’ ద్వారా జలా శయాల నిర్మాణం, ‘హర్ ఖేత్ కో పానీ’ నినాదంతో కాల్వల నిర్మాణం, నదుల అనుసంధానం చేపడుతు న్నారు. సంప్రదాయ పద్ధతుల్లో సేంద్రియ వ్యవసాయా నికి నిధులిస్తున్నారు.
 
 మనదేశ ఆశాకిరణాలు యువతీయువకులే. ఆ ఆశాకిరణాల భవిష్యత్తు ఏంటి? మన దేశంలో బీఏ, బీకాంలకు ఇంకా విలువ ఉందా? పోనీ బీటెక్, ఎంటెక్ చేస్తే జాబ్ గ్యారంటీయా? మరి మన యువత దేశానికి ఎలాంటి భవిష్యత్తునిస్తారు? 20 ఏళ్లు కష్టపడి చదివినా ఉద్యోగం రాకపోవచ్చు. కానీ, 20 వారాలు నైపుణ్యాన్ని మెరుగుపర్చుకుంటే జీవనోపాధికి ఢోకా ఉండదు. కంప్యూటర్ కోర్సు, షార్ట్‌హ్యాండు నుండి వెల్డింగ్, ప్లంబింగ్ వరకు ఎలాంటి స్కిల్ అయినా కొన్ని నెలల్లోనే మెరుగులు దిద్దుకోవచ్చు. అందుకే మోదీ స్కిల్ డెవలప్ మెంట్‌కు ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేశారు. రాబోయే ఏడేళ్లలో 40 కోట్ల మందికి నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. దేశంలోని 30 కోట్లమంది విద్యార్థులను భవిష్యత్ తారలుగా తీర్చిదిద్దేలా నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెటాలని మోదీ భావిస్తున్నారు.
 
 మనదేశ జనాభా 126 కోట్లు. నగరాలు, పట్టణాలు 4 వేలు. మన దేశంలో పట్టణాలు, నగరాలు అవ్యవ స్థలకు ప్రతిరూపాలుగా ఉన్నాయి. వాటిని చక్కదిద్దేం దుకు మోదీ నడుం బిగించారు. ఐదేళ్లలో వంద స్మార్ట్ సిటీల నిర్మాణాన్ని ప్రారంభించటం, అమృత్, హెరిటేజ్ పథకాల ద్వారా 4 వేల పట్టణాల్లో మౌలిక వసతుల కల్పన చేపట్టారు. దీని ద్వారా పట్టణాలకు రూ. లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయి.
 
 స్వాతంత్య్రం సిద్ధించి ఆరు దశాబ్దాలు గడుస్తున్నా ఇంకా మన దేశంలో కనీస మౌలిక సదుపాయాలైన... నివాసం, విద్యుత్, రోడ్లు ప్రతి ఒక్కరికీ అందుబాటులో లేవు. మారిన జీవన విధానాల కారణంగా ఇంటర్నెట్, మొబైళ్లు, రవాణా సదుపాయాలు కూడా అందరికీ అందుబాటులోకి తేవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అందుకే మోదీ ప్రభుత్వం అందరికీ ఇళ్లు, అన్ని గృహాలకూ నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరా, ప్రతి గ్రామానికీ రోడ్డు పథకాలను చేపట్టింది. డిజిటల్ ఇండియా పథకం ద్వారా ప్రతి గ్రామానికీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తోంది. దేశంలో మరింత మెరుగైన జాతీయ రహదారుల్ని నిర్మిస్తోంది. రైల్వేలు ఇప్పుడు సరైన దిశలో పరుగులు పెడుతున్నాయి. రాష్ట్రాలతో కలిసి సంయుక్తంగా ప్రాజెక్టుల్ని నిర్మించే సరికొత్త ఆలోచ నకు శ్రీకారం చుట్టింది.
 
 పారిశ్రామిక రంగానికి కావాల్సినవి.. నిరంతర విద్యుత్, నాణ్యమైన కార్మికులు, సులభమైన నిబంధ నలు, అందుబాటులో ముడి వనరులు. మోదీ హయా ంలో మన దేశం విద్యుత్ మిగులు సాధించనుంది. కార్మిక సంస్కరణలు చేపట్టి అటు పరిశ్రమలకు, ఇటు కార్మికులకు మేలు చేస్తోంది. ఇక బొగ్గు, ఇనుము, గ్యాస్ వంటి వనరుల కేటాయింపుల్లో గత ప్రభుత్వాల అవినీతిని కడుగుతూ పారదర్శకంగా కేటాయింపులు చేస్తోంది. భారత్‌లో సునాయాసంగా వ్యాపారం చేసు కునే వాతావరణాన్ని ప్రభుత్వం సృష్టిస్తోంది. కాబట్టే, మేకిన్ ఇండియా పథకంలో భాగంగా మన దేశానికి చైనాను మించి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తున్నాయి.
 
 మన తలసరి ఆదాయం తక్కువ. ఖర్చు పెట్టగల స్తోమత తక్కువ. మన అవసరాలు ఎక్కువ. అవకాశాలు తక్కువ. వీటన్నింటినీ సమన్వయం చేసుకుంటూ వెళ్లినంత కాలం అంతర్జాతీయంగా ఎన్ని ఆర్థిక ఒడిదు డుకులు వచ్చినా మనపై పెద్దగా ప్రభావం చూపలేవు. దేశం ఎదగాలంటే శక్తి సామర్థ్యాలను గుర్తించి.. వాటికి మెరుగులు దిద్ది, వ్యవస్థలోని లోపాలను సరిదిద్ది, సమ ర్థవంతమైన పాలన అందిస్తూ ముందుకెళ్లాలి. మోదీ చేస్తోంది కూడా అదే. ఒక్క మాటలో చెప్పాలంటే గత రెండేళ్లలో నరేంద్ర మోదీ ఇటు దేశీయంగానూ, అటు అంతర్జాతీయంగానూ భారతదేశ ప్రతిష్టను ఇనుమ డింపజేశారు. పెట్టుబడిదారుల్లోను, పరిశ్రమల్లోనూ విశ్వాసం పెంచారు.
 వ్యాసకర్త బీజేపీ సమన్వయకర్త
 - పురిఘళ్ల రఘురామ్
 ఈమెయిల్ : raghuram.bjp@gmail.com

Advertisement
Advertisement