పాలెం స్వర్ణోత్సవ సౌభాగ్యం | Sakshi
Sakshi News home page

పాలెం స్వర్ణోత్సవ సౌభాగ్యం

Published Sat, Dec 28 2013 12:41 AM

పాలెం స్వర్ణోత్సవ సౌభాగ్యం

అదొక మహా విప్లవం. అద్భుత గ్రామస్వరాజ్యం. యాభై ఏళ్ల క్రితమే ఒక మారుమూల కుగ్రామం దేశంలోనే సమగ్రాభివృద్ధిని సాధించిన ఐదు గ్రామాల్లో ఒకటిగా వెలుగొందింది. అది... పేదరికం, కరువు కాటకాలు, వలసలు, ఆకలిదప్పులు తప్ప అభివృద్ధి ఎరుగని పాలమూరు జిల్లాలోని ‘పాలెం’. ఆ  అద్భుతానికి సృష్టికర్త పాలెం సుబ్బయ్యగా మన్ననలందుకున్న తోటపల్లి సుబ్రహ్మణ్య శర్మ. ఆ ఊరు సామాజిక, ఆర్ధిక, రాజకీయ, విద్యా, వైజ్ఞానిక, సాహిత్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక రంగాలన్నింటిలో సమగ్ర వికాసం సాధించేలా చేసిన కృషీవలుడు. భూస్వామ్య సంస్కృతి రాజ్యమేలుతోన్న తరుణంలో పాలెం ప్రగతి కోసమే పుట్టాడేమోనన్నట్లుగా సుబ్బయ్య ఊళ్లో బడి, గుడి, కళాశాల, ఆసుపత్రి నిర్మింపజేశారు. విద్యార్ధులకు వసతి గృహాలు, ఉపాధ్యాయులకు, వైద్య సిబ్బందికి నివాస ఏర్పాట్లు చేశారు, ఆయన స్థాపించిన  బడిలో, కళాశాలల్లో చదువుకుని ఎందరో శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, వైద్యనిపుణులు, పరిపాలనా దక్షులు, అధ్యాపకులు, పరిశోధకులు, రచయితలు, కవులు, కళాకారులుగా దేశవిదేశాల్లో పేరు ప్రతిష్టలు సంపాదించారు.

 ఒకప్పటి ప్రధాని ఇందిరాగాంధీ మొదలుకొని నీలం సంజీవరెడ్డి, దామోదరం సంజీవయ్య, పీవీ, జలగం, కాసు బ్రహ్మానందరెడ్డి, మర్రి చెన్నారెడ్డి వంటి వాళ్లెందరో ఆ ఊరిని సందర్శించి  కీర్తించారు. యాభైఏళ్ల క్రితం ఇలాంటి అభివృద్ధి  ఊహింపశక్యం కానిది. పాలమూరు జిల్లా నాగర్‌కర్నూలుకు సమీపంలోని బిజినేపల్లి మండలం పాలెం గ్రామం ఈ నెల 29న స్వర్ణోత్సవ వేడుకలు చేసుకుంటోంది.

 విద్య, వైద్య గ్రామాభ్యుదయం

 1958 నాటికే సామాజిక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన సుబ్బయ్య వితరణతో ఊళ్లో ఆసుపత్రిని కట్టించారు. ఆ రోజుల్లో రాష్ట్రంలో  మరెక్కడా  ఇలాంటి ఒక మారుమూల పల్లెటూర్లో ఆసుపత్రి లేదు. ఆ తదుపరి వెటర్నరీని ఆసుత్రిని సైతం పూర్తి చేశారు. ఊరిలోని పురాతన  వెంకటేశ్వరాలయాన్ని నిర్మించి పాలెంకు  రెండవ తిరుపతి పేరు తెచ్చారు. పెద్దగా చదువుకోని సుబ్బయ్య ఆ  ఊరి పిల్లల ఉన్నత విద్యాభ్యాసం కోసం పరితపించారు. ‘ఐడియల్ ఎడ్యుకేషన్ సొసైటీ’ని స్థాపించి హైస్కూలు చదవులు అందుబాటులోకి తెచ్చారు. వేంకటేశ్వరాలయం ఆదాయాన్ని పిల్లల చదువు కోసమే వెచ్చించేలా చేశారు. 1963లో శ్రీవేంకటేశ్వర ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల కూడా ప్రారంభమైంది.   పాలెం పిల్లలే కాదు, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్ సహా అనేక ప్రాంతాలకు అది విద్యాకేంద్రమైంది. కాలేజీ భవనాలు, ప్రయోగశాలల నిర్మాణానికి, నిర్వహణకు, అధ్యాపకులు, సిబ్బంది జీతభత్యాల తదితర ఖర్చుల కోసం 16 ఎకరాల సొంత భూమిని అమ్మేశారు. ఆ కళాశాలలోని మొదటి పీయూసీ బ్యాచ్ 80 శాతం ఉత్తీర్ణతను సాధించింది.  దీంతో నల్లగొండ, కర్నూలు, కడప, అనంతపురం, తదితర   జిల్లాల విద్యార్ధులు కూడా పాలెం బాట పట్టారు. 1964లో సుబ్బయ్య శ్రీ వేంకటేశ్వర ఓరియంటల్, శ్రీ వేంకటేశ్వర డిగ్రీ కళాశాలలను ఒకేసారి ప్రారంభించారు. మరో 25 ఎకరాల భూమిని అమ్మేశారు. ఆ పిదప నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వ సహాయ సహకారాలతో ఆ విద్యాసంస్థలను మరింత అభివృద్ధి చేశారు.

 సమగ్రాభివృద్ధి పథం

 గ్రామ సమగ్రాభివృద్ధి కోసం అహరహం శ్రమించిన సుబ్బయ్య 1960లలోనే పాలెంకు తాగు నీటి నల్లాల సౌకర్యాన్ని కల్పించారు. ఆనాడు అలాంటి సదుపాయం నగరాలు, జిల్లా, తాలూకా కేంద్రాలకే పరిమితం. 1971-72 సంవత్సరంలో హరిజనుల కోసం ఆయన కట్టించిన 60 పక్కా ఇళ్లకు నాటి ముఖ్యమంత్రి పీవీ నర్సింహారావు ప్రారంభోత్సవం చేశారు. పాలెం అభివృద్ధిని కళ్లారా చూసి పీవీ ముగ్ధుడయ్యారు. సుబ్బయ్యను ఎమ్మెల్సీ పదవి చేపట్టాలని కోరగా ఆయన సున్నితంగా తిరస్కరించారు. 1967లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ  పాలెంలో ఏర్పాటైంది. రైతులకు చౌకగా రుణపరపతి సౌకర్యాలు విస్తరించాయి. సుబ్బయ్య కృషి ఫలితంగా 1969లో పాలెంలో వ్యవసాయ పరిశోధనా క్షేత్రం ఏర్పాటైంది. అక్కడి శాస్త్రవేత్తల పరిశోధనల కోసం ఆయన తన 20  ఎకరాల భూమిని  ఇచ్చేశారు. రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా పాలెంలో పౌల్ట్రీ, పాడి పరిశ్రమలు కూడా అప్పట్లోనే ఏర్పడ్డాయి. మహిళల కోసం కుటీర, చిన్న తరహా పరిశ్రమలు సైతం రూపుదిద్దుకున్నాయి. జిల్లాలోనే  మొట్టమొదటి షుగర్ ఫ్యాక్టరీ పాలెంలోనే ఏర్పాటైంది. ఊరు ఎదిగిన కొద్దీ ఆయన ఆస్తి హారతి కర్పూరంలా కరిగిపోయింది. ప్రజల సేవ కోసమే పుట్టానని భావించిన సుబ్బయ్య బతికినంత కాలం ప్రజా సేవలోనే గడిపారు. ఏ రాజకీయ పదవులు, సామాజిక హోదాలు ఆశించక సామాన్యునిగానే బతుకుతూ అనితర సాధ్యమైన సేవలను అందించారు. గ్రామాభివృద్ధి కోసం సర్వస్వం  ధారపోసిన సుబ్బయ్య చివరకు అనేక కష్టాలను అనుభవించారు. ఏమైతేనేం ఆయన స్వప్నం పాలెం సర్వోతోముఖాభివద్ధిని తన జీవిత కాలంలోనే సాకారం చేసుకోగలిగారు.

  పగిడిపాల ఆంజనేయులు  (డిసెంబర్ 29న పాలెం స్వర్ణోత్సవాలు)  
 

Advertisement

తప్పక చదవండి

Advertisement