విలువల రాపిడితోనే ఈ వజ్రకాంతి | Sakshi
Sakshi News home page

విలువల రాపిడితోనే ఈ వజ్రకాంతి

Published Fri, Aug 14 2015 12:12 AM

విలువల రాపిడితోనే ఈ వజ్రకాంతి - Sakshi

సమకాలీనం:
అపరిమిత జనాభా, అరకొర వనరులున్న దేశం అయినందున బయటి అవకాశాల్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం దశాబ్దాల కిందటే ఏర్పడింది. ఇది గ్రహించిన ఈ దేశ యువత, శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం వాకిళ్లు తెరచిన విశ్వవీధుల్లోకి పరుగులు తీసింది. బాగా చదువుకోవడం, నైపుణ్యంతో రాణించడం ద్వారా ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్లి విజయవంతం కావచ్చని ధ్రువపడ్డ నమూనాని అందిపుచ్చుకుంది. వారి ఉత్సాహానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం తోడయింది.


ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీల పగ్గాలు ఒకటొకటిగా భారతీయ మేధోనా యకుల చేతుల్లోకి రావడం ఇప్పుడు అంతటా ఓ ముచ్చటయింది. ముఖ్యంగా మొన్న సత్య నాదెళ్ల (మైక్రోసాఫ్ట్), నిన్న సుందర్ పిచయ్ (గూగుల్) సీఈవోలయ్యాక ఈ చర్చ పెరిగింది. డజన్ వరకు ప్రథమశ్రేణి వివిధ గ్లోబల్ సంస్థలకు భారతీయులు ఈ రోజున సీఈఓలుగా ఉన్నారు. ఇక కింద, వివిధ స్థాయిల్లోకి ఎదిగి-ఒదిగిన వారిది పెద్ద లెక్కే ఉంది. ఇదేలా సాధ్యమైంది...? అన్నపుడు, సాక్షి జర్నలిజం విద్యార్థులు తమకు తోచిన కారణాలు చెబుతూ వచ్చారు.


కొందరు ఇది కష్టపడే తత్వం వల్ల అని, నిబద్ధత కారణంగా అని, అంకితభావమని, ఎదగాలనే తపన ఉండడమని, భిన్నంగా-వినూత్నంగా ఆలోచించడం వల్లేనని, మధ్య తర గతి నేపథ్యం కావడంతో అని... ఇలా డజన్‌కు పైగా వేర్వేరు కారణాలు చెప్పారు. ఎక్కడో ఓ మూల నుంచి సన్నని స్వరం 'తల్లిదండ్రుల వల్ల' అన్న మాట వినిపించింది. నిజమే! భారత సమాజంలో తమ పిల్లల ఎదు గుదలకు తల్లిదండ్రులు చేసే కృషి, జరిపే త్యాగాలు అసమానమైనవి. అందరూ తమ పిల్లల్ని వివిధ కంపెనీలకు సీఈవోల్ని చేయలేక పోవచ్చు. కానీ, తామున్న పరిస్థితి కన్నా మెరుగైన స్థితిలో పిల్లలుండాలనే తపన లేని తల్లిదండ్రులు మన దేశంలో ఉండరేమో! కేవలం ఆలోచనా పరమైన తపన మాత్రమే కాక అందుకోసం అత్యధికులు చిత్తశుద్ధితో కృషి చేస్తారు. ఆరుగాలం శ్రమిస్తారు.


ఈ క్రమంలో... తమకున్నా, లేకున్నా పిల్లల్ని వృద్ధిలోకి తేవాలనే బలమైన భావన వారిని ముందుకు నడుపుతుంది. చిన్న చిన్న సౌఖ్యాలు, ముచ్చట్లు, అవసరాలు.... అన్నీ వదులుకొని కూడా పిల్లల్ని పెంచే తల్లిదండ్రులకీ దేశంలో కొదవలేదు. 'అంతా పిల్లల కోసం కరిగేస్తే... మరి, రేపేంటి?' అన్న చిన్న సందేహం, ఆలోచనక్కూడా తావివ్వకుండా, సర్వస్వం వారి చదువుల కోసం, ఉన్నతి కోసం హారతి కర్పూరంలా కరిగించే తల్లిదండ్రులెందరో! ఇది అంతో ఇంతో ఉన్న వాళ్ల పరిస్థితి. ఇక ఏమీ లేని నిరుపేదలు, దిన కూలీలు, పెద్దగా రాబడిలేని అల్పాదాయ వర్గాల వారు కూడా తమ స్తోమతకు మించి డబ్బును పిల్లల కోసం వెచ్చిస్తారు. ఖర్చు అనివార్యమైనపుడు కూడా వెనుకాడరు. కష్ట మైతే తమ అవసరాల విషయంలో రాజీపడతారు, లేకపోయినా సరేనని సరిపెట్టుకుంటారు. ప్రపంచంలో మరే దేశంలోనూ ఇంతటి తల్లిదండ్రుల త్యాగాలు ఉండవేమో అనిపిస్తుంది. ఒక వైపు విలువల సమాజం, మరో వైపు తల్లిదండ్రుల ప్రోత్సాహం భారత యువతరాన్ని ఎదుగుదల వైపు పరుగులు తీయిస్తోంది.


ఇది ఇవాళ్టిది కాదు...
పిల్లలే తమ సర్వస్వం అనే తల్లిదండ్రుల భావన ఇవాళ్టిది కాదు. భార తీయ జీవన విధానంలోనే ఉంది. మహాభారతంలో మంచి పేరున్న పాండురాజు, కుంతి మాత్రమే కాదు, స్వార్థపరులని కాసింత చెడ్డపేరున్న ధృతరాష్ట్ర-గాంధారీలు కూడా తమ పిల్లల ఉన్నతి కోసం తపించిన వారే! వీర శివాజీని మరాఠా యోధునిగా తీర్చిదిద్దిన జిజియాబాయి, గాంధీజీని జాతిపితగా మలచిన పుత్లీబాయి... ఇలా ఎందరెందరో! పితృవాక్య పాలన అని శ్రీరాముడు అడవులకెళితే తట్టుకోలేక చనిపోయిన తండ్రి దశరథుని పుత్రప్రేమ కంటే, జనవాక్యపాలన అని తనను రాముడే అడవు లకంపినా.... కుశ, లవుల్ని కని-పెంచి, విద్యాబుద్ధులతో తీర్చిదిద్దిన సీత పుత్ర వాత్సల్యమే గొప్పది. అది మన వారసత్వ సంపదయింది.


పిల్లల చదువుల కోసం, ఇవాళ్టికీ వేలాది మంది తల్లులు స్వచ్ఛంద సాంసారిక వియోగాన్ని భరిస్తున్న సీతలు. ఉపాధి, జరుగుబాటు కోసం భర్తలెక్కడో ఊళ్లల్లో వ్యవసాయమో, పట్టణాల్లో వ్యాపారమో చేస్తుంటే... నగరాలు, మహా నగరాల్లో అద్దె ఇళ్లల్లో ఉంటూ పిల్లల్ని చదివిస్తుంటారు తల్లులు. అహర్నిశలు వారి బాగోగుల ఆలోచనలే! అక్కడ తండ్రులదీ అదే బలవం తపు ఒంటరి బతుకు. కష్టపడుతూ పిల్లల చదువుల కోసం డబ్బులు పం పిస్తూ ఉంటారు. అది హైదరాబాద్‌లో విద్యానగర్, అమీర్‌పేట, కూకట్ పల్లి కావచ్చు; గుంటూరు, విజయవాడలలో వేరేవేవో బస్తీలు కావచ్చు, ఇంకే ఇతర జిల్లా కేంద్రాలో, ముఖ్య పట్టణాలో కూడా కావచ్చు, విషయ మొకటే! అంటే, పిల్లల చదువుకోసమే... సొంత ఇంటిని-ఊరునీ వీడి, అష్టకష్టాలు పడీ, ఆస్తులు అమ్ముకునీ, తీర్చలేని ప్రయివేటు అప్పులు చేసీ, బ్యాంకుల్లో విద్యారుణాలు పొందీ పీకల్లోతుగా రుణగ్రస్తులవుతుం టారు. వాటిని తీర్చేక్రమంలో... సరళ జీవితాల్ని సంక్లిష్టం చేసుకునే కుటుంబాలెన్నో!


భారత యువతకు సలామ్!
అపరిమిత జనాభా, అరకొర వనరులున్న దేశం అయినందున బయటి అవకాశాల్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం దశాబ్దాల కిందటే ఏర్ప డింది. ఇది గ్రహించిన ఈ దేశ యువత, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వాకిళ్లు తెరచిన విశ్వవీధుల్లోకి పరుగులు తీసింది. బాగా చదువుకోవడం, నైపు ణ్యంతో రాణించడం ద్వారా ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్లి విజయ వంతం కావచ్చని ధ్రువపడ్డ నమూనాని అందిపుచ్చుకుంది. వారి ఉత్సా హానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం తోడయింది. ఇంకేం! ప్రపంచం, ముఖ్యంగా ఐటీ ప్రపంచం మనవాళ్ల పాదాక్రాంతమైంది. అజీం ప్రేమ్‌జీ, నారాయణమూర్తి, శివనాడార్, రామలింగరాజు, నందన్ నీలేకనీ వంటి తొలితరం నేతలు వేసిన బీజాలు మంచి భూమికనేర్పాటు చేశాయి.


ఈ దేశానికి చెందిన ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఇతర ముఖ్య విద్యా సంస్థల కృషి తల్లిదండ్రుల త్యాగాలకు తోడయి ఆడా మగ తేడా లేకుండా యువత సాఫ్ట్‌వేర్ గుర్రమెక్కింది. ఐటీ ప్రపంచ పథాన ఇప్పుడు దౌడు జోరందు కుంది. బ్రెయిన్ డ్రెయిన్ అని మొదట్లో కొందరు ఆందోళన చెందినా, అది సరైన ఆలోచన కాదని తేలిపోయింది. పోటీ యుగంలో... వీలయినన్ని అవకాశాల్ని అందిపుచ్చుకోవడం, సమస్త ప్రపంచాన్ని దున్నేయడం. వీలైతే వెనక్కివచ్చి స్వదేశాన్నీ శక్తిమంతం చేయడంలో చేదోడు వాదోడు గానిలవడం, ఇదే ఇప్పుడు జరగాల్సింది. తొలితరం విదేశాలకి వెళ్లి విజ యవంతమైన కొంతమంది ఈ పని చేస్తున్నారు. ఇక్కడి పరిపాలన, రాజకీయ వాతావరణంలో కూడా మార్పు రావాలి. ప్రపంచానికి నేర్పిన విలు వల్ని మన వాళ్లే మరచిపోతున్నారు.


మన పార్లమెంటు ఉభయ సభల్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, 'విలువలతో కూడిన జీవన శైలి... భారతదేశం ప్రపంచానికిచ్చిన గొప్ప కానుక'ని కితా బిచ్చారు. ఆ విలువల జీవనశైలి, తల్లిదండ్రుల త్యాగాలు, సుదీర్ఘంగా సాగే కృతజ్ఞతా భావమే మన యువతరాన్ని విశ్వవేదికపై నాయకత్వ స్థానాల్లోకి తీసుకువస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్య సమా చార కమిషనర్‌గా పనిచేసి రిటైరయిన సి.డి.అర్హ డెబ్బై ఏళ్ల వయసులో ఇప్పుడు 'ఇండస్'అనే ఓ పెద్ద విద్యాపీఠం ఛైర్మన్‌గా సేవలందిస్తున్నారు. ఆయన కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నత చదువులతో విశ్వ నిపుణులుగా ఎదిగి అత్యున్నత హోదాల్లో ఉన్నారు. ఆరున్నర దశాబ్దాల కింద, అర్హ తండ్రి రెవెన్యూ ఉద్యోగిగా తనకొచ్చే నెల జీతం 75 రూపా యల్లో 55 రూపాయల నెలసరి ఫీజు కట్టి సెయింట్ జేవియర్ అనే గొప్ప పాఠశాలలో కొడుకును చదివించారు. మిగతా కుటుంబ పోషణకు నెలకు 20 రూపాయలే వెచ్చించారు. ఇలాంటి ఏ తల్లిదండ్రుల త్యాగాలూ వృథా పోకూడదు.


తీసుకున్న చోట... తిరిగి ఇచ్చేయాలి!
పిల్లలెంత ఎత్తు ఎదిగినా కన్నవారిని నిర్లక్ష్యం చేయకూడదు. కొంత డబ్బు వెచ్చించి ‘వృద్ధాశ్రమాల్లో వేశాం కదా! ఇంకేంటి’ అనేపాటి కృతజ్ఞత చాలదు. వారి త్యాగాల క్రమంలో మరుగున పడ్డ నెరవేరని కలల సాకారా నికి సహకరించాలి. మాతృదేశాన్నీ విస్మరించొద్దు. ఏపీజే అబ్దుల్‌కలాం తన స్వీయకథ 'వింగ్స్ ఆఫ్ ఫైర్'లో తన తల్లి సంస్కారాన్ని స్మరిస్తూ రాసుకున్న కథలు ఒక్క కలాం కథలు మాత్రమే కావు. కుటుంబం పేదరి కం అనుభవిస్తుంటుంది. తల్లి రాత్రివేళ రొట్టెలు కాల్చి చదువుకునే పిల్ల లకు పెడుతుంది. తండ్రికి మాడిపోయిన రొట్టె దొరుకుతుంది. చిన్న పిల్లాడైన కలాం ఈ సన్నివేశాన్నంతా చూస్తుంటాడు. కుటుంబ సంబంధాల మధ్య, సభ్యుల మధ్య కోపతాపాలూ, సహజ భావావేశాలను ప్రేమ ఎలా అధిగమిస్తుందో జాగ్రత్తగా గమనిస్తుంటాడు.


మాడిపోయిన రొట్టెను కంచంలో పెట్టుకున్న నాన్నను అడుగుతాడు. 'మాకందరికీ మం చి రొట్టెలు వేసి, చివర్లో నీకు మాడిపోయిన రొట్టెను పెట్టినందుకు నీకు అమ్మపై కోపంగా లేదా?'అని. అందుకా తండ్రి ప్రేమతో 'పొద్దుట్నుం చీ ఆమె పని చేస్తూనే ఉంది. పైగా మాడిపోయిందేదో నాకు పెట్టింది. కానీ ఆమె ఇంకా తినలేదు చూశావా?'అంటాడు. దాంతో మళ్లీ తల్లి దగ్గరకు వెళ్లి 'అమ్మా నువ్వు ఇంకా తినలేదు. మాకు మాత్రమే పెట్టావు. నువ్వూ తినమ్మా'అంటాడు కలాం. దానికా తల్లి చిర్నవ్వుతో. 'నాన్నా... నువ్వు 'చదువుకునే' పిల్లాడివి. నీకు చదువుకునేందుకు శక్తి కావాలి. నీకు చదువు కునేందుకు మేధస్సు పెరగాలి. అందుకే నీకీ రొట్టెలు. తిని బాగా చదు వుకో' అని స్పందిస్తుంది. అంతే... ఈ కష్టాలన్నీ ఎరిగిన కలాం బాగా చదువుకున్నాడు.


ఆ తర్వాత తన తల్లి గురించి మాట్లాడుతూ భావో ద్వేగంతో రాసుకున్న మాటలు అందరినీ కదిలిస్తాయి. 'ఆరోజున నాకు నువ్వు పెట్టిన రొట్టెలతో పెరిగిన మెదడు మేధస్సూ, తనువు తేజస్సూ ఇవ్వాళ్ల నాతోనే ఉన్నాయి. కానీ నాకోసం నువ్వు చేసిన త్యాగం నాకు గుర్తుంది. ఇవ్వాళ నీకు పాదాభివందనం చేద్దామంటే నువ్వు లేవు. అలాగే నేను కూడా లేని స్థితి ఒకటి వస్తుంది. నువ్వు ఈ లోకాన్ని వీడిపోయిన రోజున ఏ దివ్య శరీరాన్ని ధరించావో, నేనూ ఈ లోకాన్ని వీడిన రోజున అదే దివ్య శరీరాన్ని ధరిస్తా. నువ్వు చేరిన లోకాలకే నేనూ చేరుతా. నా రొట్టెల కృతజ్ఞత తీర్చేందుకు నువ్వే రూపంలో ఉన్నావో, అదే రూపంలో నేనూ నీ దగ్గరకు చేరి నీ పాదాలను... నువ్వు పెట్టిన రొట్టె తిన్న ఈ చేతులతో స్పర్శిస్తా' అని రాసుకున్నాడు. కలాం ఒక గొప్ప వ్యక్తిగా ఎదిగినందున్నే ఈ చరిత్రను మనం తెలుసుకోగలిగాం. కానీ ఇలాంటి దివ్యానుభవాలు చవిచూసే కుటుంబాలు మన సమాజంలో, మనకు తెలియకుండా.... ప్రతి ఐదింటిలో కనీసం మూడైనా ఉంటాయేమో! తీసుకున్న చోటే ఎంతోకొంత తిరిగి ఇచ్చేయాలి. ఇచ్చేయాలి. ఇచ్చేయాలి.

ఆర్. దిలీప్ రెడ్డి
సాక్షి, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్
ఈమెయిల్:
dileepreddy@sakshi.com

Advertisement
Advertisement