ఆంధ్రపథం | Sakshi
Sakshi News home page

ఆంధ్రపథం

Published Sat, Mar 8 2014 1:47 AM

ఆంధ్రపథం - Sakshi

పదం నుంచి పథంలోకి - 2 భరుకఛ్ఛం- నేటి గుజరాత్‌లోని ప్రఖ్యాత రేవు పట్టణం బరోచ్ - క్రీ పూ.500
 అతడు మారువేషంలో ఉన్నాడు. మగధ (పాటలీపుత్రం- పాట్న) నుంచి భరుకచ్ఛం వరకూ ఎలాగోలా పారిపోయి వచ్చాడు. దక్షిణాపథం చేరాలంటే భరుకచ్ఛం వరకూ రాక తప్పదు. ఇక్కడి నుంచి సముద్ర మార్గాన పారశీకానికి (అరేబియా గల్ఫ్ రాజ్యాలు) పారిపోవచ్చు. లేదంటే వర్తక బిడారులతో కలవగలిగితే వారితో పాటు దక్షిణాపథం చేరుకోవచ్చు. ఇక అప్పుడు తన ప్రాణాలకు ప్రమాదం ఉండదు.
 నిజానికి అతడు మగధ విడిచి మూడు మాసాలయింది. తన అన్న అధికారానికి అతడెప్పుడూ వ్యతిరేకి కాడు. అన్న చక్రవర్తి. కాని ఆ చక్రవర్తి పీఠం పై తాను కన్నువేసినట్టుగా ఎవరో ఆయనకు నూరిపోశారు. సామ్రాజ్యధికార కాంక్ష రక్తసంబంధాలకు అతీతమైనది. అడ్డువచ్చినవాడు సొంత తమ్ముడైనా అది సహించదు. తన ప్రాణానికి ప్రమాదం పొంచి ఉన్నట్టు అర్థమైంది. ఏం చేయాలి?
 పది వేల గుర్రాలను ఒకేసారి కొనుగోలు చేయగల సామర్థ్యం, సంపదా ఒక్క మగధ సామ్రాజ్య చక్రవర్తికే ఉంది. తరచూ గుర్రాలను కొనడం చక్రవర్తి విలాసం. అందుకే ఆ గుర్రాల కొనుగోలు చేసే నెపంతో, రాజగృహం నుండి తప్పించుకొని కాశి (వారణాసి) , వైశాలీ (మధ్యప్రదేశ్ లోని బెస్‌నగర్), ఉజ్జయినిల మీదుగా భరుకచ్ఛం చేరుకున్నాడు. అప్పటికే అంతఃపురం నుంచి పావురం వార్త తెచ్చింది. భటులు తనను వెతుకు తున్నారని. బంధించనున్నారని. సమయం లేదు. త్వరగా ఆంధ్రపథం చేరాలి.


 ఆంధ్రపథం!
 భయంకరమైన వింధ్యాటవి, ఆపై దండకారణ్యం. ఒక్కడిగా ప్రయాణించడం అసాధ్యం. దూరంగా బిడారు కనిపించింది. భరుకఛ్ఛంలో  వర్తకం ముగించుకుని తిరిగి వెళ్తున్న వాహకులు!  దక్షిణాపథం (మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌లతో కూడిన దక్షిణ భారతదేశం) నుంచి ముడి ఇనుము, సువర్ణం, చందనం, దంతం, సుగంధద్రవ్యాలు భరుకచ్ఛం తెచ్చి ఇక్కడ నుండి పారశీకానికి (ఇరాన్, ఇరాక్) ఆపై భూమార్గం ద్వారా యవనసీమలకీ (గ్రీకుదేశాలు) ఎగుమతి చేయడం ఈ వర్తకుల పని. అందువల్ల అటు నుంచి ఇటుకు రాకపోకలు సాగిస్తుంటారు. అశ్మక గణరాజ్యంలోని (నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాలు)  మణిగ్రామం ఉక్కు ఆయుధాలకి ప్రసిద్ధి.  ఆ నగరంలో అనేక లోహ కర్మాగారాలు - సూది నుండి చంద్రహాసఖడ్గం వరకూ ఏదైనా తయారుచేయగల వేలకొలదిగా కమ్మరులు ఉన్నారు. అక్కడకు సరుకు కొనే పని మీద వెళుతున్నారు. మారువేషధారి వారితో కలిశాడు. ప్రయాణం మొదలైంది. నెల రోజుల పాటు కొనసాగుతూనే ఉంది.
           
 ఆంధ్రపథంలోని ఆ పట్టణానికి ఐదు యెజనాల (40.కి.మి.) దూరంలో అపస్తంభుని బుష్యాశ్రమం, వేద వాఙ్మయాన్ని సూత్రబద్ధం చేసిన మహర్షి. కాశీ నుంచి వచ్చిన బ్రాహ్మణ విద్యార్ధినని మారువేషధారి చెప్పిన కట్టుకథని చిరునవ్వుతో విని ఆదరపూర్వకంగా ఆహ్వానించాడు. గౌతమీ నది ఒడ్డున ఉన్న రమణీయమైన కుటీరాన్ని విడిదిగా కేటాయించాడు. కమ్మని శాలి బియ్యపు అరిశెలు, ఆవునెయ్యిలో వేసిన పెసరపప్పు, లేతగా కాల్చిన కణుజు మాంసం, చింతపులుసుతో ఉడికించిన పొలస చేప, సుగంధద్రవ్యాలతో మిశ్రీతమైన ఇక్షువారుణి. చుక్కలు పొదిగిన ఆకాశం కింద మాధవీలతలూ, మల్ల్లెపొదలపై నుంచి వీచే చల్లని గాలి అతడి మార్గాయాసానికి కొంత సేద కూర్చాయి.
 మరునాటి ఉషోదయాన పవిత్ర గోదావరి జలాలతో స్నానమాచరించి బ్రహ్మచారులతో కళకళమంటున్న ఆశ్రమ ప్రాంగణం చేరాడు.
 ‘ఏం రాకుమారా!  ఇప్పటికైనా తమ నిజ పరిచయ భాగ్యం మాకు కలిగిస్తారా?’ ముఖలక్షణాలు చూసి మనిషి పుట్టు పూర్వోత్తరాలు చెప్పగల మహా సాముద్రీకుడైనా ఆచార్యుని ప్రశ్నకి నిర్ఘాంతపోయాడు.
 ‘రుషివర్యా. మన్నించండి. నా పేరు నంది.  బింబిసార చక్రవర్తి  అసంఖ్యాకమైన పుత్రులలో ఒకణ్ణి. నా అన్న అజాత శత్రువు తన రాజ్యాన్ని నిష్కంటకం చేసుకునే యజ్ఙంలో నన్ను సమిధ చేయబూనాడు. రాజ్యకాంక్ష నాకెన్నడూ లేదు. ఈ పలాయనం ప్రాణరక్షణార్థమే. తమ సేవాభాగ్యమూ, విద్యావిధానమూ దొరికిన చాలు. ధన్యుడిని’ అని ఆ మహాత్ముని ఎదుట సాష్టాంగపడ్డాడు.
 ‘లే నాయనా. ఈ సమయంలో ఆంధ్రపథానికి నీ రాక దైవనిర్ణయం. బహుళమూ, అవైదికమూ అయిన ఈ ఆంధ్రగణరాజ్యాలని ధర్మపథంలో నడిపించే కర్తవ్యం నీదే. శ్రౌత, ధర్మ సూత్రాలని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన నా శిష్యుల సహాయంతో, ఈ దక్షిణదేశాన్ని ఆర్యావర్తానికి (ఉత్తర భారతదేశం) అనుసంధానం చేసే మహద్కార్యం  నీ మీదే ఉంది. ప్రయాణ బడలిక తీర్చుకో. వచ్చే పౌర్ణమికే కార్యారంభం. కార్యప్రణాళిక నీకు ఈలోగా విశదీకరిస్తాను’’ అని అశ్వత్థవృక్షం నీడలో శిష్యసమూహం మధ్యనున్న తన పీఠంవైపు నడిచాడు.
           
 ‘ఇంకెంతో దూరం లేదు, ఆ మలుపు తిరిగితే రాతిగుట్ట, మన భాషలో అశ్మకగిరి’ అన్నాడు మహర్షి ఆపస్తంభుడు.
 గమ్యం దగ్గరవుతున్న కొద్దీ నంది గుండెల్లో ఏదో బెదురు,
  కానీ మహర్షి ఆపస్తంభుడు సామాన్యుడు కాదు.
 అతడి సంకల్పం వ్యర్థం కాజాలదు. ఆంధ్రనాగవంశాన్ని ఆర్యవ్యవస్థలో విలీనం చేయటమే అతడి ఉద్దేశ్యం. ఏదో ఒక గణరాజ్యానికి చంద్రవంశ ప్రతిష్ట కలుగజేస్తే మిగిలిన జాతులు కూడా వైదిక ధర్మమార్గాన్ని అనుసరించగలరని ఆయన నమ్మిక.
 అశ్మకానికి ముఖ్యపట్టణం పోతన కోట (నిజామాబాద్ జిల్లాలోని బోధన్). అదీగాక ఆంధ్రపథంలో అనేక లోహకర్మరుల మణిగ్రామాలు, వెయ్యికి పైగా జనావాసాలు ఉన్నాయి. గౌతమీ నదీతీర స్థ ప్రదేశంలో వర్షపాతం అధికం. పైగా ఆ మహానదిలో కలిసి అనేక చిన్న సెలయేళ్ల వలన సేద్యపు నీటి సౌకర్యం విస్తృతంగా ఉంది. అడవులను నరికి కొత్త భూములు సాగుకు తెచ్చేందుకు కావలసిన సాధన సంపత్తి, పశు సంపద ఉన్నాయి. గంగా తీరంలోని వ్యవసాయ పద్ధతులను ఇక్కడ ప్రవేశపెడితే చాలు సంపన్నతలో ఈ ప్రదేశం ఆర్యావర్తానికి ఏ విషయంలోనూ తీసిపోదు. కానీ ఈ ఆదిమ జనజాతులను ఆధునిక మార్గానికి నడిపించడానికి ఒక ఉదాహరణ కావాలి.
 మలుపు తిరిగినంతనే విశాలమైన పచ్చిక బయలు.
  దూరంగా కోలాహలం వినిపించింది. శవయాత్ర. యాత్రకు ముందు ఒక యువతి.
 ‘ఆమె పేరు పోతనాగి. ఈ ఆంధ్ర తెగకి దొరసాని.  అదిగో ఆ  పదిమంది బలశాలులైన యోధులు రాతి పలకపై పడుకోబెట్టి తెస్తున్న ఆ  శవం పోరులో మరణించిన ఆమె సరిజోడుది. ఇప్పుడు జరగనున్నది అతడి ఖననం’ అన్నాడు ఆపస్తంభుడు.
 నంది ఆశ్చర్యంగా చూస్తున్నాడు.
           
  శవయాత్ర దక్షిణ దిశలోని వీరుల గుట్టవైపు సాగింది. అది మరణించిన వీరులను ఖననంచేసే మరుభూమి. అరచేతి మందంతో నిలువెత్తు రాతిపలకల మధ్య ఆ వీరుడి దేహాన్ని వస్తుసామగ్రి, ఆహారంతో పాటు సమాధిలో ఉంచడంతో ఊరేగింపు ముగిసింది. ఒక్కసారిగా నిశ్శబ్దం అలముకొంది.
 తోడు వచ్చిన జనం చుట్టూ చూస్తూ ఉండగా, నంది ఆశ్చర్యంలో మునుగుతుండగా పోతనాగి సమాధిలోకి ప్రవేశించింది. ఇప్పుడు శవాన్ని మోసుకొచ్చిన పదిమంది యోధులు, శవంతో పాటు పోతనాగి మీదుగా ఇనుప పారలతో మట్టిని తోడి సమాధిని కప్పసాగారు. శవపేటిక మట్టిలో కప్పబడిపోయింది. పోతనాగి నడుము వరకూ అదే మట్టిలో కూరుకొనిపోయింది. అంతలో గణాచారి చేతిలో శంఖం ‘భోం’ అని మోగసాగింది. డప్పుడు, కొమ్ముబూరాలు, శంఖాలు, కంచు గంటలమోత ఆకాశాన్నంటింది.
 ‘‘అమ్మా రా! మమ్మేలుకో’’ అనే కేకలు మిన్ను ముట్టాయి.
 నడుము లోతు మన్నులో కూడా సునాయాసంగా నడుస్తూ పోతనాగి బయటకి వచ్చింది.
 మరణించిన ఆమె జోడు ప్రేతమై ఆమె వెంట రాకుండా, జనమంతా తలో చెయ్యి వేసి పది అడుగుల నిడివిగల రాతిపలకతో సమాధిని మూసి వేసారు. భుజం భుజం కలిపి చిందేసి జనంతో పండగ మొదలయింది.
 ఇప్పుడా గణజాతి దొరసానికి జోడు లేడు.
 నేనంటే నేనని ఆ జనంలోని యువకులూ, వీరులు ముందుకొచ్చారు. తమతమ నగ్నదేహాలని ప్రదర్శిస్తూ, బల పరాక్రమాలని పొగుడుకుంటూ ఆమెను జతగూడమని ఆహ్వానిస్తూ ఆమె ముందు చిందులు తొక్కసాగారు.
 ఆమె ఎవరిని కూడితే అతడే ఆ దండుకి దొర!
 ఆపస్తంభుడు నందిని చూసి కనుసైగ చేశాడు.
 తెల్లని దోవతి, ఉత్తరీయం, బంగారు పూసలు, ఇంద్రనీలాలు పొదిగిన వెండి పడగతో పున్నమి చంద్రుడు ముందుగా ఉదయించాడా అన్నట్లు వెలుగుతున్న నంది లేచి నిలుచున్నాడు.
 ఆ ఉత్తరాది రాచబిడ్డని చూసేందుకు విరగబడుతోన్న జనం మధ్యలో వయ్యారంగా నడిచి వచ్చి అతని చేయందుకుంది పోతనాగి.             
 ఆంధ్రులు ఎవరు?
 ‘ఏ తాండ్రాః పుండ్రాః శబరాః’ అంటూ ఐతరేయ బ్రాహ్మణం ఆంధ్రులని దక్షిణదేశానికి చెందిన ఆదిమ తెగగా ప్రస్తావించింది.
 క్రీ.పూ. 6వ శతాబ్దానికి చెందిన పాణిని తన ‘అష్టాధ్యాయి’ అనే సంస్కృత వ్యాకరణ గ్రంథంలో దక్షిణదేశంలోని అశ్మక రాజ్యాన్ని గురించి చెప్పాడు. బుద్ధుడు నిర్వాణం చెందిన సంవత్సరం క్రీ.పూ. 484 అనుకుంటే, అతడి జీవితకాలంలోనే ‘బావరి’ అనే బ్రాహ్మణ ఆచార్యుడు గోదావరి ఒడ్డున అశ్మక దేశం సరిహద్దులోని ఆశ్రమంలో నివసించినట్లు బౌద్ధగ్రంథం సుత్తనిపాతం చెబుతుంది. భీమసేనుడనే విదర్భరాజు జాతకకథ ఈ ప్రదేశాన్ని ఆంధ్రపథం అంటుంది.
 రామాయణ, మహాభారత రచనా కాలానికి దక్షిణదేశంలోని ఆంధ్రప్రజల గురించి ఉత్తర భారత దేశంలో గణనీయమైన పరిచయం కలిగింది. ఆ తరువాతి గ్రంథం ‘సెరివజ్ఞజాతకం’ అంటే చైనా వర్తకానికి సంబంధించిన కథ, ‘తెలవాహ’ నదీతీరంలోని ఆంధ్రనగరిని ప్రస్తావించింది. కొందరు శాస్త్రజ్ఞులు అది ఛత్తీస్‌గఢ్‌లోని తేర్ నదిగా భావిస్తారు.
 బూల్గర్, కాణే మొదలైన చరిత్రకారులు, ఆపస్తంభుడు క్రీ.పూ. 500లో ఆంధ్రప్రాంతంలోని గోదావరి ప్రాంతంలో వేదవాఙ్మయంలోని శ్రౌత, ధర్మశాస్త్రాలను క్రోడీకరించాడని అన్నారు. అంటే క్రీ.పూ. 6, 5వ శతాబ్దుల సంధికాలంలో ఉత్తరభారతానికి చెందిన బ్రాహ్మణ సంస్కృతి ఆంధ్రదేశం ప్రవే శించిందని చెప్పవచ్చు. కానీ ఈ గ్రంథాలేవీ ఆనాటి ఆంధ్రదేశంలో సాంఘిక పరిస్థితుల గురించి అంతగా చెప్పవు.
 అయితే ఆనాటి ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితులనీ, నమ్మకాలనీ అవగాహన చేసుకోవటానికి అప్పటి పురాతత్వ అవశేషాలు కొంత సహకరిస్తాయి. ఆనాటి ఆంధ్రదేశంలోని సంస్కృతిని ‘బృహచ్ఛిలా సంస్కృతి’ అంటారు. అది ఇనుప యుగానికి చెందినది. దక్షిణదేశంలో అనేక చోట్ల కనిపించే రాక్షసిగుళ్ళు అనే పెద్ద పెద్ద శిలలతో నిర్మించిన సమాధుల వల్ల  ఈ పేరు వచ్చింది. వీరు వరి పండించారు. ఇనుము, బంగారం వంటి ఖనిజాలు తవ్వితీసారు. ఇనుము, కంచు, ఉక్కు పనిముట్లు తయారుచేసారు. తెలంగాణలోని నిర్మల్ ప్రాంతం తరువాతి కాలాలలో కూడా ఉక్కు పరిశ్రమకి ఎంతో ప్రసిద్ధి చెందింది.
 ఆంధ్రదేశంలో బ్రాహ్మణ సంస్కృతి ప్రవేశించటానికి, తరువాత బౌద్ధ జైన మతాల విస్తరణకి దోహదం చేసిన రాజకీయ పరిస్థితులపై అనేక అభిప్రాయాలు ఉన్నాయి. అయితే దక్షిణాది చరిత్రలో ప్రసిద్ధి చెందిన రాజవంశాల మూలపురుషులు గాథలు దాదాపుగా ఒకే కథని చెబుతాయి. అవి ఉత్తరాదికి చెందిన సూర్య, చంద్రవంశ రాజకుమారులు, దక్షిణదేశానికి చెందిన నాగవంశపు రాణులని వివాహం చేసుకొని తద్వారా ఆయా వంశాలు స్థాపించారనే.
 ఏది యేమైనా మౌర్యుల కాలంనాటికి వింధ్య పర్వతాలకి దక్షిణాన ముప్పైకి పైగా ఆంధ్రనగరాలు ఉన్నాయని అనేక ఆధారాలు ఉన్నాయి. బృహచ్ఛిలా సంస్కృతులే చారిత్రక యుగంలో పట్టణాలుగా ఆవిర్భవించిన ఆధారాలు ఉన్నాయి. ఈ బృహచ్ఛిలా సంస్కృతులలో కూడా ఎంతో వైవిధ్యం కనిపిస్తుంది. మహాభారతం కూడా ‘ఆంధ్రాశ్చబహవః’ అంటే ‘ఆంధ్రులు పెక్కులు’ అనే చెబుతోంది. అయితే నన్నయ యుగానికి (10వ శతాబ్దానికి) తెలుగు భాష ప్రాచుర్యంలోకి వచ్చి ఈ భిన్న సంస్కృతులని ఒకటి చేసింది. ఈ తెలుగు వారినందరినీ ప్రప్రథమంగా రాజకీయంగా ఏకం చేసిన ఘనత కాకతీయులదే.
 
 భరుకఛ్ఛం- నేటి గుజరాత్‌లోని ప్రఖ్యాత రేవు పట్టణం బరోచ్ - క్రీ పూ.500
 అతడు మారువేషంలో ఉన్నాడు. మగధ (పాటలీపుత్రం- పాట్న) నుంచి భరుకచ్ఛం వరకూ ఎలాగోలా పారిపోయి వచ్చాడు. దక్షిణాపథం చేరాలంటే భరుకచ్ఛం వరకూ రాక తప్పదు. ఇక్కడి నుంచి సముద్ర మార్గాన పారశీకానికి (అరేబియా గల్ఫ్ రాజ్యాలు) పారిపోవచ్చు. లేదంటే వర్తక బిడారులతో కలవగలిగితే వారితో పాటు దక్షిణాపథం చేరుకోవచ్చు. ఇక అప్పుడు తన ప్రాణాలకు ప్రమాదం ఉండదు.
 నిజానికి అతడు మగధ విడిచి మూడు మాసాలయింది. తన అన్న అధికారానికి అతడెప్పుడూ వ్యతిరేకి కాడు. అన్న చక్రవర్తి. కాని ఆ చక్రవర్తి పీఠం పై తాను కన్నువేసినట్టుగా ఎవరో ఆయనకు నూరిపోశారు. సామ్రాజ్యధికార కాంక్ష రక్తసంబంధాలకు అతీతమైనది. అడ్డువచ్చినవాడు సొంత తమ్ముడైనా అది సహించదు. తన ప్రాణానికి ప్రమాదం పొంచి ఉన్నట్టు అర్థమైంది. ఏం చేయాలి?
 పది వేల గుర్రాలను ఒకేసారి కొనుగోలు చేయగల సామర్థ్యం, సంపదా ఒక్క మగధ సామ్రాజ్య చక్రవర్తికే ఉంది. తరచూ గుర్రాలను కొనడం చక్రవర్తి విలాసం. అందుకే ఆ గుర్రాల కొనుగోలు చేసే నెపంతో, రాజగృహం నుండి తప్పించుకొని కాశి (వారణాసి) , వైశాలీ (మధ్యప్రదేశ్ లోని బెస్‌నగర్), ఉజ్జయినిల మీదుగా భరుకచ్ఛం చేరుకున్నాడు. అప్పటికే అంతఃపురం నుంచి పావురం వార్త తెచ్చింది. భటులు తనను వెతుకు తున్నారని. బంధించనున్నారని. సమయం లేదు. త్వరగా ఆంధ్రపథం చేరాలి.

 ఆంధ్రపథం!
 భయంకరమైన వింధ్యాటవి, ఆపై దండకారణ్యం. ఒక్కడిగా ప్రయాణించడం అసాధ్యం. దూరంగా బిడారు కనిపించింది. భరుకఛ్ఛంలో  వర్తకం ముగించుకుని తిరిగి వెళ్తున్న వాహకులు!  దక్షిణాపథం (మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌లతో కూడిన దక్షిణ భారతదేశం) నుంచి ముడి ఇనుము, సువర్ణం, చందనం, దంతం, సుగంధద్రవ్యాలు భరుకచ్ఛం తెచ్చి ఇక్కడ నుండి పారశీకానికి (ఇరాన్, ఇరాక్) ఆపై భూమార్గం ద్వారా యవనసీమలకీ (గ్రీకుదేశాలు) ఎగుమతి చేయడం ఈ వర్తకుల పని. అందువల్ల అటు నుంచి ఇటుకు రాకపోకలు సాగిస్తుంటారు. అశ్మక గణరాజ్యంలోని (నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాలు)  మణిగ్రామం ఉక్కు ఆయుధాలకి ప్రసిద్ధి.  ఆ నగరంలో అనేక లోహ కర్మాగారాలు - సూది నుండి చంద్రహాసఖడ్గం వరకూ ఏదైనా తయారుచేయగల వేలకొలదిగా కమ్మరులు ఉన్నారు. అక్కడకు సరుకు కొనే పని మీద వెళుతున్నారు. మారువేషధారి వారితో కలిశాడు. ప్రయాణం మొదలైంది. నెల రోజుల పాటు కొనసాగుతూనే ఉంది.
           
 ఆంధ్రపథంలోని ఆ పట్టణానికి ఐదు యెజనాల (40.కి.మి.) దూరంలో అపస్తంభుని బుష్యాశ్రమం, వేద వాఙ్మయాన్ని సూత్రబద్ధం చేసిన మహర్షి. కాశీ నుంచి వచ్చిన బ్రాహ్మణ విద్యార్ధినని మారువేషధారి చెప్పిన కట్టుకథని చిరునవ్వుతో విని ఆదరపూర్వకంగా ఆహ్వానించాడు. గౌతమీ నది ఒడ్డున ఉన్న రమణీయమైన కుటీరాన్ని విడిదిగా కేటాయించాడు. కమ్మని శాలి బియ్యపు అరిశెలు, ఆవునెయ్యిలో వేసిన పెసరపప్పు, లేతగా కాల్చిన కణుజు మాంసం, చింతపులుసుతో ఉడికించిన పొలస చేప, సుగంధద్రవ్యాలతో మిశ్రీతమైన ఇక్షువారుణి. చుక్కలు పొదిగిన ఆకాశం కింద మాధవీలతలూ, మల్ల్లెపొదలపై నుంచి వీచే చల్లని గాలి అతడి మార్గాయాసానికి కొంత సేద కూర్చాయి.  మరునాటి ఉషోదయాన పవిత్ర గోదావరి జలాలతో స్నానమాచరించి బ్రహ్మచారులతో కళకళమంటున్న ఆశ్రమ ప్రాంగణం చేరాడు.
 ‘ఏం రాకుమారా!  ఇప్పటికైనా తమ నిజ పరిచయ భాగ్యం మాకు కలిగిస్తారా?’ ముఖలక్షణాలు చూసి మనిషి పుట్టు పూర్వోత్తరాలు చెప్పగల మహా సాముద్రీకుడైనా ఆచార్యుని ప్రశ్నకి నిర్ఘాంతపోయాడు.
 ‘రుషివర్యా. మన్నించండి. నా పేరు నంది.  బింబిసార చక్రవర్తి  అసంఖ్యాకమైన పుత్రులలో ఒకణ్ణి. నా అన్న అజాత శత్రువు తన రాజ్యాన్ని నిష్కంటకం చేసుకునే యజ్ఙంలో నన్ను సమిధ చేయబూనాడు. రాజ్యకాంక్ష నాకెన్నడూ లేదు. ఈ పలాయనం ప్రాణరక్షణార్థమే. తమ సేవాభాగ్యమూ, విద్యావిధానమూ దొరికిన చాలు. ధన్యుడిని’ అని ఆ మహాత్ముని ఎదుట సాష్టాంగపడ్డాడు.
 ‘లే నాయనా. ఈ సమయంలో ఆంధ్రపథానికి నీ రాక దైవనిర్ణయం. బహుళమూ, అవైదికమూ అయిన ఈ ఆంధ్రగణరాజ్యాలని ధర్మపథంలో నడిపించే కర్తవ్యం నీదే. శ్రౌత, ధర్మ సూత్రాలని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన నా శిష్యుల సహాయంతో, ఈ దక్షిణదేశాన్ని ఆర్యావర్తానికి (ఉత్తర భారతదేశం) అనుసంధానం చేసే మహద్కార్యం  నీ మీదే ఉంది. ప్రయాణ బడలిక తీర్చుకో. వచ్చే పౌర్ణమికే కార్యారంభం. కార్యప్రణాళిక నీకు ఈలోగా విశదీకరిస్తాను’’ అని అశ్వత్థవృక్షం నీడలో శిష్యసమూహం మధ్యనున్న తన పీఠంవైపు నడిచాడు.
           
 ‘ఇంకెంతో దూరం లేదు, ఆ మలుపు తిరిగితే రాతిగుట్ట, మన భాషలో అశ్మకగిరి’ అన్నాడు మహర్షి ఆపస్తంభుడు.
 గమ్యం దగ్గరవుతున్న కొద్దీ నంది గుండెల్లో ఏదో బెదురు,
  కానీ మహర్షి ఆపస్తంభుడు సామాన్యుడు కాదు.
 అతడి సంకల్పం వ్యర్థం కాజాలదు. ఆంధ్రనాగవంశాన్ని ఆర్యవ్యవస్థలో విలీనం చేయటమే అతడి ఉద్దేశ్యం. ఏదో ఒక గణరాజ్యానికి చంద్రవంశ ప్రతిష్ట కలుగజేస్తే మిగిలిన జాతులు కూడా వైదిక ధర్మమార్గాన్ని అనుసరించగలరని ఆయన నమ్మిక.
 అశ్మకానికి ముఖ్యపట్టణం పోతన కోట (నిజామాబాద్ జిల్లాలోని బోధన్). అదీగాక ఆంధ్రపథంలో అనేక లోహకర్మరుల మణిగ్రామాలు, వెయ్యికి పైగా జనావాసాలు ఉన్నాయి. గౌతమీ నదీతీర స్థ ప్రదేశంలో వర్షపాతం అధికం. పైగా ఆ మహానదిలో కలిసి అనేక చిన్న సెలయేళ్ల వలన సేద్యపు నీటి సౌకర్యం విస్తృతంగా ఉంది. అడవులను నరికి కొత్త భూములు సాగుకు తెచ్చేందుకు కావలసిన సాధన సంపత్తి, పశు సంపద ఉన్నాయి. గంగా తీరంలోని వ్యవసాయ పద్ధతులను ఇక్కడ ప్రవేశపెడితే చాలు సంపన్నతలో ఈ ప్రదేశం ఆర్యావర్తానికి ఏ విషయంలోనూ తీసిపోదు. కానీ ఈ ఆదిమ జనజాతులను ఆధునిక మార్గానికి నడిపించడానికి ఒక ఉదాహరణ కావాలి.
 మలుపు తిరిగినంతనే విశాలమైన పచ్చిక బయలు.
  దూరంగా కోలాహలం వినిపించింది. శవయాత్ర. యాత్రకు ముందు ఒక యువతి.
 ‘ఆమె పేరు పోతనాగి. ఈ ఆంధ్ర తెగకి దొరసాని.  అదిగో ఆ  పదిమంది బలశాలులైన యోధులు రాతి పలకపై పడుకోబెట్టి తెస్తున్న ఆ  శవం పోరులో మరణించిన ఆమె సరిజోడుది. ఇప్పుడు జరగనున్నది అతడి ఖననం’ అన్నాడు ఆపస్తంభుడు.
 నంది ఆశ్చర్యంగా చూస్తున్నాడు.
           
  శవయాత్ర దక్షిణ దిశలోని వీరుల గుట్టవైపు సాగింది. అది మరణించిన వీరులను ఖననంచేసే మరుభూమి. అరచేతి మందంతో నిలువెత్తు రాతిపలకల మధ్య ఆ వీరుడి దేహాన్ని వస్తుసామగ్రి, ఆహారంతో పాటు సమాధిలో ఉంచడంతో ఊరేగింపు ముగిసింది. ఒక్కసారిగా నిశ్శబ్దం అలముకొంది.
 తోడు వచ్చిన జనం చుట్టూ చూస్తూ ఉండగా, నంది ఆశ్చర్యంలో మునుగుతుండగా పోతనాగి సమాధిలోకి ప్రవేశించింది. ఇప్పుడు శవాన్ని మోసుకొచ్చిన పదిమంది యోధులు, శవంతో పాటు పోతనాగి మీదుగా ఇనుప పారలతో మట్టిని తోడి సమాధిని కప్పసాగారు. శవపేటిక మట్టిలో కప్పబడిపోయింది. పోతనాగి నడుము వరకూ అదే మట్టిలో కూరుకొనిపోయింది. అంతలో గణాచారి చేతిలో శంఖం ‘భోం’ అని మోగసాగింది. డప్పుడు, కొమ్ముబూరాలు, శంఖాలు, కంచు గంటలమోత ఆకాశాన్నంటింది.
 ‘‘అమ్మా రా! మమ్మేలుకో’’ అనే కేకలు మిన్ను ముట్టాయి.
 నడుము లోతు మన్నులో కూడా సునాయాసంగా నడుస్తూ పోతనాగి బయటకి వచ్చింది.
 మరణించిన ఆమె జోడు ప్రేతమై ఆమె వెంట రాకుండా, జనమంతా తలో చెయ్యి వేసి పది అడుగుల నిడివిగల రాతిపలకతో సమాధిని మూసి వేసారు. భుజం భుజం కలిపి చిందేసి జనంతో పండగ మొదలయింది.
 ఇప్పుడా గణజాతి దొరసానికి జోడు లేడు.
 నేనంటే నేనని ఆ జనంలోని యువకులూ, వీరులు ముందుకొచ్చారు. తమతమ నగ్నదేహాలని ప్రదర్శిస్తూ, బల పరాక్రమాలని పొగుడుకుంటూ ఆమెను జతగూడమని ఆహ్వానిస్తూ ఆమె ముందు చిందులు తొక్కసాగారు.
 ఆమె ఎవరిని కూడితే అతడే ఆ దండుకి దొర!
 ఆపస్తంభుడు నందిని చూసి కనుసైగ చేశాడు.
 తెల్లని దోవతి, ఉత్తరీయం, బంగారు పూసలు, ఇంద్రనీలాలు పొదిగిన వెండి పడగతో పున్నమి చంద్రుడు ముందుగా ఉదయించాడా అన్నట్లు వెలుగుతున్న నంది లేచి నిలుచున్నాడు.
 ఆ ఉత్తరాది రాచబిడ్డని చూసేందుకు విరగబడుతోన్న జనం మధ్యలో వయ్యారంగా నడిచి వచ్చి అతని చేయందుకుంది పోతనాగి.              - సాయి పాపినేని

Advertisement
Advertisement