ఆదికవి నన్నయ ఆంధ్ర మహాభారతం ఆదిపర్వంలో మేనమరదలితో పెళ్లి ప్రస్తావించాడు. మేనరికాలు తెలుగువారిలో అనాది నుండి వస్తున్న ఆచారం. అదే గ్రంథంలో తిక్కన నాలుగు రోజుల పెళ్లిసంబరాల గురించి చెప్పాడు. ఈ రెండూ సంస్కృత మూలంలో లేవు. తెలుగువారి ఆచారాలే. ఇక తెలుగువాళ్ల పెళ్లిపండగ వర్ణన మొట్టమొదటిసారిగా కుమార సంభవంలో కనిపిస్తుంది. నన్నెచోడుడి కుమారసంభవంలో పార్వతీశివుల కల్యాణం వర్ణన ఇప్పటికి వెయ్యేళ్ల క్రితమే నాగవల్లి కుండలు, పాలకొమ్మతో రాటువేయడం, పసుపులు దంచడం, తలపై పేలాలు పెట్టడం, తెరపట్టడం, జీలకర్ర కలిపిన బియ్యం జల్లుకోవడం, ఊరేగింపు, వసంతాలు, బంతులాట మొదలైన మన పెళ్లి సంబరాలకి అద్దం పడుతుంది. అప్పటి పెళ్లిమంటపం డెకరేషన్ గురించి ఎన్నో విశేషాలు తెలుస్తాయి. మచ్చుకి కరెంట్ లేని రోజుల్లో బయట ఎండలో అద్దాలు పెట్టి ఆ వెలుతురు పందిరి లోపల మంటపంలో పడేలా చేశారట!
తొలి చాళుక్యుల కాలంనాటి సాంఘిక పరిస్థితుల గురించి మహాభారతం, కుమార సంభవం, చాళుక్యసోమేశ్వరునిఅభిలాషితార్థచింతామణి, పండితారాధ్యుని బసవపురాణం మనకి ఎన్నో విషయాలు తెలుపుతాయి. నాచనసోముని ఉత్తరహరివంశంలో సత్యభామాకృష్ణుల నెత్తపుటాల(పాచికలు), ఆ ఆటకి సంబంధించిన పందేలూ, పంతాలు వర్ణిస్తుంది. పాచికలాట ఈనాటిది కాదు. అక్షక్రీడ ప్రస్తావన ఋగ్వేదంలో ఉంది. భారతయుద్ధానికి ముఖ్యకారణం పాచికలే. రాజసూయయాగం పాచికలాటతోగానీ పరిసమాప్తమవదు. ఆడవాళ్లు జోగిణి దేవతకి మొక్కి ఆట మొదలెట్టేవారని నాచన సోముడు చెప్పాడు. పూర్వం జైన విద్యాలయాల్లో ఎక్కాలు, లెక్కలు నేర్పేందుకు ఈ ఆటని ఉపయోగించారు.
ప్రహేళికలు, అంత్యాక్షరివంటివి వయసొచ్చిన ఆడపిల్లలు ఆడేవారని కుమార సంభవం చెబుతుంది. వాళ్ల ఆటల్లో పెద్ద సంబరంగా జరుపుకునేవి బొమ్మలపెళ్లి, గుజ్జనగూళ్లు, స్నేహితురాళ్లని ఒకచోట పోగేసి అట్టహాసంగా బొమ్మలకి పెళ్లి చేయటం, పిడతల్లో తాహత్తుకు తగినట్లు వంట చేసి పంచుకోవటం. ఇక బొమ్మల్లో ఎన్నో రకాలు ఆనాటి సాహిత్యంలో కనిపిస్తాయి. కుమార సంభవంలో దంతపుబొమ్మలు, మేలిగాజు బన్నరుల గురించి చెబితే నాచన సోముడు పుత్తడి లత్తుక బొమ్మలని గురించి చెప్పాడు. అచ్చనగుండ్లు, పికిలిపిట్లు, గీరనగింజలు, తన్నుబిళ్ల, కుచ్చెళ్లు, దాగిలిమూతలు, స్తంభాలాట, కుందుళ్లు లాంటివి ఇంట్లో ఆడితే, వీధిలో బొంగరాలు, బిళ్లంగోడు, చిడుగుడూ, కోలకోతులు ఆడేవాళ్లు.
అన్నింటిలో ముఖ్యమైనది మన తెలుగువారి క్రికెట్ ఆట. బిళ్లంగోడు, గిల్లీదండా, దండుగనీ, చిల్లగోడె, చిర్రాగోనె, ఇలా చాలా పేర్లున్నాయి. ఇప్పటికీ పల్నాడులో ఈ ఆట ఆడే పిల్లలు, ఏక్కా దుగా, తిక్కా అని ఒంట్లు లెక్కపెడతారు. అంటే బౌద్ధుల కాలానికే ఈ ఆట కోస్తాంధ్రలో ఆడేవారు. ఇక్కడ నుండే ఈ గిల్లీదండా ఇతర రాష్ట్రాలకి ఎగుమతి అయింది. మహారాష్ట్రలో ఈ ఆటని విటిదండు అంటారు. అక్కడ ఒంట్లు ఒకటీ, రెండూ, మూడు అని తెలుగుతో లెక్కబెడతారు. అందుకేనేమో మనవాళ్లకి క్రికెట్ ఆట అంత సులభంగా అలవడింది. ఇండియాకి మొట్టమొదటి క్రికెట్ కెప్టెన్ మన తెలుగువాడే.. సి.కె.నాయుడు అనే కఠారి కనకయ్య నాయుడు. వేదవ్యాసుడి సంస్కృత భారతంలో కౌరవపాండవులతో ఆడించిన ఆట బంతాట కాదు. దానిని వీటాఖేలనం అన్నాడు.
‘వీటయాయవా తారేణ ప్రాదేశ మాత్రకాష్ఠేనయత్, హస్తమాత్ర దండేన ఉపర్యుపరి కుమారా ప్రాక్షిపంతి’ అంటే, మూరెడు కర్రతో జానెడు బిళ్లని కొట్టే ఆట అని చెప్పాడు. కానీ ఎందుకో మన నన్నయ తెలుగు భారతంలో ఆ సన్నివేశాన్ని బంతాటగా మార్చాడు. పాపం, రాజమండ్రి వీధుల్లో కుర్రాళ్లు చేసే గోలకి గిల్లీదండా అంటే కోపమొచ్చిందేమో?
Related news
-
అంకిత భావం
అంకము అంటే గుర్తు, ముద్ర. అంకితం అంటే గుర్తు, లేక ముద్ర కలిగినది. తమ పని ఏదైనా ఏ విధంగా గుర్తించబడాలో సూచించే గుర్తును చెప్పటం అంకితం. మన కవులు అందరు తమ కావ్యాలను అంకితం చేశారు. రచన తమది అయినా ఆ రచనను చదివే వారికి మరొకరు మనసులో మెదులుతారు. అది తమ ఇష్టదైవం కావచ్చు. ఆదరించిన రాజో, మిత్రుడో, ఆత్మీయులో కావచ్చు. అది మరెవరి గుర్తింపు కొరకో తాము చేసే కృషి అని చెప్పటం. కావ్య అవతారికలోనే చెప్పటం సంప్రదాయం. ఆదికవి నన్నయ ఈ ఒరవడి ప్రారంభించినట్టు కనపడుతుంది. తన సహాధ్యాయి, రాజు, పోషకుడు అయిన రాజరాజ నరేంద్రుడి కోరిక మీద ఆయనకి అంకితంగా భారతసంహితా రచనా ధురంధురుడయ్యాడు. ఈ అంకితం కారణంగానే తిక్కనామాత్యులవారు అరణ్యపర్వశేషాన్ని స్పృశించలేదని కొండరు సాహిత్యవిమర్శకుల అభిప్రాయం. నన్నయభట్టు నరాంకితంగా చేసిన దానిలో మిగిలిన భాగాన్ని దైవానికి అంకితం ఇవ్వటం ఇష్టం లేక విరాటపర్వం నుండి ప్రారంభించి ఉంటారని భావన. పైగా ఆయనకి హరిహరనాథుడు స్వప్నంలో కనపడి ఆదేశించాడు కూడా. పోతనామాత్యుల వారి అంకితం కించిత్ ఆశ్చర్యాన్ని కలిగించక మానదు. శివధ్యానం చేస్తున్న పోతనకి శ్రీరామచంద్రుడు దర్శనమిచ్చి కృష్ణకథ ప్రధానంగా ఉన్న భాగవతాన్ని తనకి అంకితంగా రచించమని కోరాడు. వాగ్గేయకారులు తమ కీర్తనలలో ప్రతిదానిలోనూ తమ ఇష్టదైవం నామాన్ని గాని ఒక ప్రత్యేకమైన పదాన్ని గాని గుర్తుగా పేర్కొంటారు. దానిని ముద్ర అంటారు. కీర్తనలు వేటికి అవి విడిగా ఉంటాయి. కావ్యంలో లాగా అవతారికలో ఒకసారి పేర్కొంటే సరిపోదు కదా! అందుకని ప్రతి కృతిలోనూ ముద్ర తప్పనిసరి. త్యాగరాజ కృతులలో ప్రతి దానిలోనూ త్యాగరాజనుత అనే ముద్ర కనపడుతుంది. శ్యామశాస్త్రివారి కీర్తనలలో శ్యామకృష్ణ అని, ముత్తుస్వామి దీక్షితులవారి కీర్తనలలో గురుగుహ అనే ముద్రలు దర్శనమిస్తాయి. ఆ ముద్ర చూడగానే అది ఎవరి రచన అన్నది తెలిసిపోతుంది. నిజానికి వారు మనకి తేలికగా తెలియటం కోసం పెట్టలేదు ముద్రలని. ఆ ముద్ర తనకి, ఎవరిని గురించి పాడుతున్నారో వారికి గుర్తింపు. వాచస్పతి మిశ్రుడు తన రచనకు ఏ మాత్రం ఇబ్బంది కలిగించకుండా సహకరించిన, అప్పటివరకు ముఖమైనా చూడని ధర్మపత్ని ‘భామతి’ పేరుని తన గ్రంథనామంగా ఉంచాడు. తమకు ఉన్న ప్రేమాభిమానాలను వ్యక్తపరచటానికి రచనాదికాలు చేయలేక పోయినా, తాము చేసిన ఏ ఘనకార్యమైనా అంకితం చేస్తూ ఉంటారు. అందరు ఏదో ఒక ఘనకార్యం చేసి అంకితం ఇవ్వలేక పోవచ్చు. వారు తమ జీవితాన్నే అంకితం చేయటం మనం గమనించ వచ్చు.‘‘నా జీవితం నీకే అంకితం..’’ అంటూ పాడిన పాటలు ఉదాహరణలు. అంటే, తన అస్తిత్వానికి ఒక గుర్తింపు అవసరం లేదు, అస్తిత్వంతో సహా అంతా సమర్పణమే ఇష్టదైవానికో, ఇష్టమైన వ్యక్తికో. చివరికి ఈ అంకిత ప్రక్రియ ఏ స్థాయికి చేరింది అంటే, ఆకాశవాణిలో గాని, దృశ్యశ్రవణ ప్రసార మాధ్యమాలలో గాని ఇష్టమైన పాటలని వేయించి, వాటిని అంకితం చేస్తున్నారు. వీరజవానులు తమ జీవితాలను దేశరక్షణకు అంకితం చేస్తారు. కొందరు దైవానికి తమ జీవితాలని అంకితం చేస్తారు. తన ఉనికి కోసం, గుర్తింపు కోసం తాపత్రయ పడకుండా మరెవరి గుర్తింపుకో నిస్వార్థంగా చేయటం అంకితం. కావ్యాలు, కీర్తనలు మాత్రమే కాదు ఏ సృజనాత్మక సృష్టి అయినా తన గుర్తింపు కోసం కాక ఇతరులకు గుర్తింపు కలగటం కోసం చేసినప్పుడు ఆ ప్రక్రియని అంకితం అంటారు. ఉదాహరణకి నన్నయభట్టు భారతాన్ని ఆంధ్రీకరించాడు. ఆయన పేరుతో పాటు అంకితం పుచ్చుకున్న రాజరాజనరేంద్రుడి పేరు కూడా చరిత్రలో శాశ్వతంగా నిలిచి ఉంటుంది. రాజుగా కన్న ఆంధ్రమహాభారతాన్ని అంకితం పుచ్చుకున్నవాడిగా గుర్తింపు అధికం. శ్రీనాథ కవిసార్వభౌముడి పేరు నిలిచి ఉన్నంత కాలం వీరారెడ్డి, అవచి తిప్పయ్య శెట్టి, పెదకోమటి వేమారెడ్డి మొదలైన వారందరి పేర్లు శాశ్వతం. రచనలు చేయలేదు కాని, కావ్యాలు అంకితం పుచ్చుకున్నారు కనక, ఆ కావ్యాలు ఆదరించబడినంత కాలం వారి పేరు చిరస్థాయిగా ఉంటుంది. – డా. ఎన్. అనంతలక్ష్మి -
కంటిచూపుతో కన్నారు
ఏదైనా ఓ వింతని, నమ్మలేని నిజాన్ని విజ్ఞానశాస్త్రజ్ఞులు చెప్తే చాలు.. కచ్చితంగా నమ్మడానికి సిద్ధంగా మనల్ని మనం తయారు చేసేసుకున్నాం. మళ్లీ అదే అంశం నిజం కాదని మరికొంత కాలమయ్యాక పరిశోధనలు చేశామని మళ్లీ వాళ్లే చెప్తే దాన్ని కూడా నిజమేనని అంగీకరిస్తాం తప్ప ఏ వాదాన్నీ చెయ్యం. ఫలానా ఔషధం ఎంతో గొప్పదని చెప్పిన అదే విజ్ఞానశాస్త్రం కొంతకాలమయ్యాక ఈ ఔషధం వల్ల అనేక దుష్ఫలితాలున్నాయని నిరూపించబడిందనగానే వెంటనే మానేస్తాం.ఈ విషయాన్నెందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. ఆ శాస్త్రం చెప్తే నమ్మే జనం, అనుమానాన్ని వ్యక్తీకరించని లోకం, సాయి కళ్లలోనికి చూస్తే సంతానం కలిగిందని చెప్పిన నిజాన్ని ఎందుకు నమ్మరు? ఎలా నమ్మాలో వివరించుకుందాం! ఏదో గాలి మాటలు కాకుండా సప్రమాణంగా ఆధారాలతో సహా చెప్పుకుందాం! సంతానాన్ని కనే తీరులు మనం మానవజాతికి చెందినవాళ్లం కాబట్టి సంతానాన్ని కనడం అనగానే స్త్రీ పురుషసమాగమం మాత్రమే అనేసుకుంటాం. అది తప్ప మరో మార్గమే లేదని దృఢంగా వాదిస్తాం కూడా.సంతానాన్ని కనే విధానాలని వైశేషిక దర్శనమనే గ్రంథం చెప్పింది –‘స్వేదజ, అండజ, జరాయుజ, ఉద్భిజ్జ, సాంకల్పిక, సాంసిద్ధిక, భేదాత్’ అని.స్వేదజ సంతానం మొదటిది. స్వేదమంటే శరీరం నుంచి బయటికి వచ్చే చెమట అని అర్థం. ఆ చెమట నుండి పుట్టే సంతానమన్నమాట. క్రిముల్లో కొన్ని విడిచిన స్వేదమూ లేదా మనుష్యులు మొదలైనవారి శరీరాల నుండి విడువబడిన స్వేదమూ నుండి పుట్టే సంతానం అని దీనర్థం. తలలో పట్టే చెమట కారణంగా ఈ పేలు మొదలైనవి పుడతాయి. వాటిలో మగపేను, ఆడపేను అనే జాతి భేదం, లింగ భేదం ఉండదు. అలాగే పశువులు విడిచిన స్వేదం నుండి సన్ననైన ఓ తీరు క్రిములు పుడతాయి. వాటిని గ్రామప్రాంతాల్లో నుసుములు అని పిలుస్తారు. అవి మనల్ని కుట్టవు గానీ ఊరికే వాలుతూ ఒక తీరు అసహ్యాన్ని, చిరాకునీ మనకి కలుగజేస్తుంటాయి. అపరిశుభ్రంగా ఉన్న, లేదా కుళ్లిన పదార్థాల మీద వాలుతూ కన్పిస్తాయి. వీటికి కూడా లింగభేదం ఉండదు. సంగమం కారణంగా పుట్టవు. ఇవన్నీ ఏకలింగజీవులు. మరి దీన్ని వింతగా అనుకోవద్దు. అలాగే కడుపులో నులిపురుగులెలా పుడుతున్నాయి? గమనించుకోవాలి. రెండవ సంతానం అండజాలు. అండమంటే గుడ్డు. గుడ్డు నుండి పుట్టేదని దీనర్థం. నిజానికి తల్లి తీసుకునే ఆహారసారం ఆమె గర్భంలో ఉన్న శిశువుకి జీవద్రవ్యంగా ఉపయోగపడుతూ క్రమంగా పెరుగుతూ ఆ మీదట బయటికి రావలసిన కాలానికి శిశువుగా ప్రాణం పోసుకుని జన్మించడం మనం చూస్తూండే అంశం. చిత్రమేమంటే గుడ్డు అనేది మొత్తం కప్పబడి ఉండి, తల్లి ద్వారా ఏ విధమైన ద్రవ్యం దానికి చెందే, చెందించే వీలే ఉండదు గుడ్డుకి. అయినా ఆ గుడ్డు కొంతకాలానికి సంతానంగా మారుతూ కన్పిస్తోంది, తల్లి ఏ మాత్రపు ఆహారాన్ని అందించకుండానే. దీన్ని కూడా చిత్రమని అనుకోవద్దూ?మూడవ సంతానం జరాయుజాలు. జరాయువనే మాటకి ‘మావి’ అని అర్థం. దీన్నే ‘మాయి’ అని పిలుస్తుంటారు వ్యవహారంలో. కొన్ని చోట్ల ‘మాయ’ అని అంటుంటారు. ఏది ఏమైనా మావి ద్వారా జన్మించేవి మనుష్య–పశుజాతులు. అందుకే జంతువులతో బాగా పరిచయం, అనుభవం ఉన్న వాళ్లు పశువులు తమ సంతానాన్ని ఈనుతున్న దృశ్యం కంటపడగానే ఆ తల్లి కాబోతున్న పశువుకి ధాన్యపు పొట్టుని ఆహారంగా పెడతారు. ఆ దాన్యపు పొట్టు (చిట్టు అంటారు కొన్ని ప్రాంతాల్లో) లోపల ఉన్న మావిని రంపంలా కోసేసి దూడని తొందరగా బయటికొచ్చేలా చేస్తుంది. పశుజాతి, కొన్ని మృగజాతులు, కొన్ని జంతుజాతులు కూడా ఇలా పుట్టేవే! నాల్గవ సంతానం ఉద్భిజ్జాలు. ‘ఉత్’ అంటే పైకి అని అర్థం. ‘భిత్’ అంటే చీల్చుకోవడం, చీల్చడమని అర్థం. ‘జ’ అంటే పుట్టడమని అర్థం. ఒక పదార్థాన్ని చీల్చుకుని పైకి రావడమని దీని భావం. దీనికి ఉదాహరణ మొక్క. విత్తనాన్ని భూమిలో పాతి మట్టిని కప్పి కొద్దిగా నీటిని పోస్తే చాలు.. ఆ విత్తనం ఉబ్బి మెల్లగా అంకురరూపాన్ని (మొలక)విత్తి మెల్లగా ఆ భూమిని చీల్చుకుని (ఉత్ + భిత్) పుడుతోంది. (జ) మొక్కగా అవుతోంది. ఆకుల్ని వేస్తోంది. సన్నకాండంతో మొదలై ఎదుగుదలలో చెట్టుగా మారుతోంది. మరి ఈ మొక్క స్త్రీ పురుష సంగమం వల్ల కలగలేదుగా!ఐదవ సంతానం సాంకల్పికం. చెప్పలేనంత తపశ్శక్తిని ఆర్జించి దేవతలైన వారికి కలిగే సంకల్పం కారణంగా కలిగే సంతానం. బ్రహ్మ తనంత తానుగా సంకల్పించాడు. చక్కని రూపసౌందర్యం కలవాళ్లూ, మహా వైరాగ్యం కలిగి ఈ ప్రపంచాన్నే ఓ కలగా భావించే వాళ్లూ, ఏ ప్రలోభానికీ లొంగనివాళ్లూ, నిత్యం శ్రీమన్నారాయణ దర్శనమే తమ అనుదిన జీవిత ధ్యేయంగా కలవాళ్లూ అయిన పుత్రులుంటే బాగుండునని. అంతే! ఆ లక్షణాలతో నలుగురు ఒకే రూపం, ఒకే లక్షణాలు, గుణాలతో జన్మించారు. వాళ్లే సనక – సనందన – సనత్సుజాత– సనత్కుమారులు అనే పేర్లు కలవాళ్లు. వీళ్లకే సనకచతుష్టయమని పేరు. ధృతరాష్ట్రుడు తనకి మనశ్శాంతి లేని వేళ ఈ సనత్సుజాతుణ్ణే ఆహ్వానించి ధర్మబోధ చేయవలసిందని ప్రార్థించాడు. ఆయన చేసిన బోధనని విన్నాడు. మరి ఈ సనకచతుష్టయానికీ తల్లీ తండ్రీ సంగమం.. మొదలైనవి లేవుగా! అందుకే వీళ్లని బ్రహ్మమాసన పుత్రులు (బ్రహ్మగారి మనసులోని ఆలోచనకి అనుగుణంగా కల్గినవారు). ఆరవ తీరు సంతానం సాంసిద్ధికం. సద్యోగర్భం ద్వారా పుట్టీ పుడుతూనే బాల్యం దాటి కౌమారదశకి వచ్చేయడం. పరాశరమహర్షి పడవలో గంగని దాటి అక్కడ ఉన్న ద్వీపాన్ని చీకటినిండేలా చేసి సత్యవతి ద్వారా వ్యాసుణ్ణి కన్నాడు. చిత్రమేమంటే ఈ వ్యాసుడు సద్యోగర్భం (అప్పటికప్పుడు వచ్చిన గర్భం) ద్వారా పుట్టడమే కాక, పుడుతూనే కౌమారదశలో కన్పిస్తూ దండకమండలాలతో తల్లికీ తండ్రికీ నమస్కరించాడు. ‘కృష్ణ ద్వైపాయనుడు’ అని ఆయన పేరు. కృష్ణ అంటే చీకటిగా చేయబడిన, ద్వైపాయన ద్వీపమే తనకి జన్మస్థలంగా కలవాడని అర్థం. స్త్రీ పురుష సంగమం లేదిక్కడ. పోనీ! చీకటిగా ద్వీపాన్ని చేసిన కారణంగా సంగమమే ఉందనుకుందాం కాసేపు. అదే నిజమైతే దాన్నే నమ్మేటట్లయితే.. ఆయన తన పుట్టుకతోనే 13 సంవత్సరాల వయసు కలవానిగానూ దండకమండలాలతోనూ జన్మించాడనే విషయాన్ని కూడా నమ్మితీరాలి కదా! కళ్ల ద్వారా సంతానం పైన అనుకున్న ఇన్ని తీరులుగా సంతానాన్ని పొందడం, అందులో కొన్నింటిలో స్త్రీ పురుష సంగమం లేకుండా ఉండటాన్ని మనం గమనించాం. ఇంతవరకూ అయ్యాక ఇప్పుడిక కళ్ల ద్వారా సంతానాన్ని ఎలా కన్నారో, ఎవరు కన్నారో ఆ విషయాన్ని చూద్దాం!భారతకథని చూడాలి. కాశీరాజుకి ముగ్గురు పుత్రికలు. వాళ్లలో పెద్దామె అయిన అంబ ప్రేమ విఫలమైంది. ఇక మిగిలిన అంబిక, అంబాలిక అనే ఇద్దరినీ విచిత్రవీర్యునికిచ్చి భీష్ముడు వివాహం జరిపించాడు. సంతానం కలగలేదు. విచిత్రవీర్యుడు మరణించాడు. రాజవంశం సంతానం లేని కారణంగా ఆగిపోయే పరిస్థితికొచ్చింది. అప్పుడు వ్యాసుణ్ణి తల్లి అయిన సత్యవతి ప్రార్థించింది – ఈ అంబిక, అంబాలికల ద్వారా సంతానాన్ని కనవలసిందని. ఈ మాట వింటూంటేనే ఇదేమిటి? అనే ఆలోచన మనకొస్తుంది. దానిక్కారణం మనందరికీ సంతానమనే మాట వినగానే సంగమం ద్వారానే సాధ్యమవుతుందనే ఒక్క విషయం మాత్రమే మన బుద్ధికి తడుతూండటమే.తన తల్లి ప్రార్థించగానే వ్యాసుడు సరేనని అంబిక వద్దకొచ్చాడు. ఆయన గడ్డాలు, మీసాలు ఎరుపు తెలుపు కలిసిన జడల సమూహం మునిరూపం చూడగానే అంబికకి ఓ తీరు భయం వేసి ఒక్క క్షణం పాటు ఆయన్ని చూసి కళ్లు మూసుకుంది. వెంటనే గదిలో నుండి ఇవతలికి వచ్చిన వ్యాసుడు తన తల్లితో.. ఈమెకి అంధుడు పుడతాడని చెప్పాడు. అతనే ధృతరాష్ట్రుడు.మరి సంగమమే సంతానకారణమయ్యుంటే వ్యాసుని తల్లి గది వద్దే ఉండదు కదా! క్షణంలో గది నుండి బయటికి రావడం సాధ్యం కాదు గదా! పైగా వ్యాసుడు ఆ కలగబోయే సంతానం అంధుడవుతాడని ఎలా చెప్పగలుగుతాడు, సామాన్యుడే అయ్యుంటే? కళ్లలో ఏముంది శక్తి? సర్వ సాధారణంగా పురుషుని శుక్లం అధోముఖంగా వెళ్లి స్త్రీకి సంతానం కలిగించేందుకు తోడ్పడుతుంది. అదే మరి యోగులు, సిద్ధులు అయినవారి విషయంలో ఆ శుక్లం క్రమంగా ఊర్థ్వముఖంగా ప్రయాణిస్తుంది.ఓజోసి సహోసి బలమసి భ్రాజోసి.. అని మంత్రం వెళ్తుంది. ఆ శుక్లం అలా ప్రయాణించి ప్రయాణించి మెల్లగా కనురెప్పల వద్ద నిలవ ఉంటుంది. ఏ స్త్రీ సంతానాన్ని అర్థిస్తూ ఆ సిద్ధుణ్ణో స్వామినో యోగినో చూస్తుందో వెంటనే ఆ కళ్లలో ఉన్న సంతానోత్పాదక శక్తి స్త్రీ కళ్ల ద్వారా ప్రయాణించి అధోముఖంగా ఆమెకి గర్భం కలిగేలా చేస్తుంది. ఇదే జరిగింది వ్యాసుని విషయంలో.అంబిక అలా వ్యాసుణ్ణి చూసి వెంటనే కళ్లు మూసుకుంది. గర్భం కలిగింది కానీ అంధత్వం వచ్చింది. సంతానానికి ధృతరాష్టుడు పుట్టాడు.తరువాతిదైన అంబాలిక గదిలోనికి వెళ్లాడు వ్యాసుడు. ఆమె వ్యాసుణ్ణి అంబికలాగానే భయంతో చూసింది గానీ, నిన్నటి రోజున తన అక్కకి జరిగిన తీరు అంధసంతానం రారాదని భావించి కళ్లని తెరిచే ఉంచింది. అయితే ఆ వ్యాసుని రూపం, తపః ప్రకాశం ఆమెకి దుర్నిరీక్ష్యం (చూడ శక్యం కానిది) కావడంతో బలవంతాన కనులు మూసుకోవలసిరావడం అనే ఈ రెండాలోచనల మధ్య కళ్లని తెరవడం, మూయడం చేస్తుంటే ఆ ప్రవర్తన కారణంగా ‘పొండుర్గా’ కలిగిన పాండురాజు జన్మించాడు.ఇక ఈ ఇద్దరూ ఆలోచించుకున్న మీదట, సత్యవతి ఊహప్రకారమూ గదిలో దాసిని ఉంచితే, ఆమె వ్యాసుణ్ణి పరమసిద్ధునిగా గ్రహించి ఆ తీరు గౌరవంతో భయంతో భక్తితో శ్రద్ధతో కనుల్ని తెరుచుకునే ఉండి ఆయన కళ్లలోనికి చూసింది సంతాన ఆపేక్షతో. అంతే! విదురుడు ఆ దర్శనఫలంగా పుట్టాడు. అంటే ఏమన్నమాట? యోగులు, సిద్ధులు, దివ్యపురుషులు అయిన వారి ముఖంలోనికి మనం ముఖాన్ని ఉంచి భయభక్తి శ్రద్ధలతోగానీ చూసినట్లయితే ఆ చూపు ప్రకారం దాని కనుగుణంగానూ సంతానం కలుగుతుందనేది యథార్థమని తెలిసిపోయింది కదా!శ్రీమద్రామాయణంలో తృణబిందుడనే రాజర్షి ఉన్నాడు. ఆయన ఆశ్రమంలోనికి స్త్రీలెవరూ ప్రవేశించరాదనే ఓ నియమాన్ని పెట్టాడు. లోకంలో ఏదైనా ఓ నియమమంటూ ఉంటే దాన్ని ఎలాగైనా విరోధించాలనే వాళ్లు కొందరో ఏ ఒక్కరో ఉండకుండా ఉండరు. దాంతో ఒకరొకరు చొప్పున రాజర్షికి తెలియకుండా ఆశ్రమంలోనికి పూలు కోసుకుందామనీ, ఆశ్రమంలో తిరుగాడే లేళ్లని చూద్దామనీ, ఉద్యానవనవిహారాన్ని చూద్దామనీ ఇలా రావడం ప్రారంభించారు. దాంతో ఆయన ఓ నియమాన్ని కఠినం చేస్తూ.. యా మే దృష్టిపథ మాగచ్ఛేత్ సా గర్భాన్ని ధరిస్తుంది జాగ్రత్త! అనే కట్టడిని చేశాడు. దాంతో ఎవరూ రానేలేదు. ఆ తర్వాత ఆయన కళ్లలో పడితే చాలు గర్భం వస్తుందని అనడానిక్కారణం కళ్లలో గర్భధారణ సమర్థత కల శక్తి, పైన అనుకున్న తీరుగా ఉండటమే.‘సర్వేంద్రియాణాం నయనం ప్రధానం’ అనే ఓ మాటని వింటుంటాం. శరీరంలో ఉండే జ్ఞానేంద్రియ (శరీరం, కళ్లు, చెవి, నాలుక, ముక్కు) అలాగే ఉండే కర్మేంద్రియ (మాట, చేయి, కాలు, విసర్జకావయవాలు రెండు) విభాగాల్లో కళ్లు అతి ప్రధానమైనవని దానర్థం. ఒకే కన్ను శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక, బీభత్స, అద్భుత, శాంతమనే తొమ్మిది రసాలని చూపించగల శక్తి ఉన్న ఇంద్రియం.ఈ కారణంగానూ 12 సంవత్సరాల పాటు బహిరంగంగా కాకుండా నేలమాళిగలో ఉంటూ తీవ్రతప స్సుని ఏ బాధ్యతలు బరువులు లేని చిన్న వయసులో (4) సాయి చేసిన కారణంగానూ సాయికి కన్నుల్లో ఉన్న శక్తి –అందరినీ వశులుగా చేసేదే. ఆ వశం చేసే శక్తుల్లో గర్భాన్ని కలిగించే తనం ఒకటన్నమాట. కాబట్టి సాయికనుల ద్వారా గర్భం, సంతానం కలిగిందంటే కచ్చితంగా నమ్మితీరవలసిన అంశమే! ఇక సాయి ఓ కపటగురువుకి శిష్యుడైన విధానాన్ని చూద్దాం! ∙డా. మైలవరపు శ్రీనివాసరావు -
తప్పు ఒకరిది.. శిక్ష మరొకరికా..
ఎనలిటికల్ స్కిల్ పరీక్ష రద్దు చేసిన నన్నయఅధికారులు 29న తిరిగి నిర్వహిస్తామని ప్రకటన ఫీజు చెల్లించాలనడంపై మండిపడుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఈనెల ఒకటిన నిర్వహించిన ఎనలిటికల్ స్కిల్స్ కోర్సుకు సంబంధించిన పరీక్ష రద్దయ్యింది. మోడల్ పేపర్ మారడమే దీనికి కారణమంటూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ టి. మురళీధర్ ప్రకటించారు. అంతేకాదు ఆ పరీక్ష రాసే ప్రతి విద్యార్థి రూ.250 చెల్లించాలనడంపై సర్వత్రా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఎనలిటికల్ స్కిల్స్ కోర్సుకు సంబంధించిన పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో (మల్టీపుల్ ఛాయిస్) నిర్వహించాల్సి ఉండగా పొరపాటున ప్రశ్నకు జవాబు ఇచ్చే విధానంలో నిర్వహించారు. దీంతో ఎక్కువ శాతం మంది విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాలు ఈ పరీక్షను రద్దు చేసి, మరలా నిర్వహించాలని విజ్ఞప్తి చేశాయి. చివరకు వారి విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న యూనివర్సిటీ అధికారులు ఆ పరీక్షను రద్దు చేస్తూ తిరిగి ఈనెల 29న నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. తిరిగి నిర్వహించే పరీక్షకు సంబంధించి ప్రతి విద్యార్థి రూ. 250 ఫీజు చెల్లించాలనడం వివాదాస్పదమవుతోంది. ఒకటిన నిర్వహించిన పరీక్షను ఎందుకు రద్దు చేశారు? దానికి గల కారణాలేంటి? అనే విషయాన్ని పరిశీలిస్తే యూనివర్సిటీతోపాటు కళాశాలల యాజమాన్యాలూ అందుకు బాధ్యులే అవుతారు. అయితే విద్యార్థుల తప్పిదం ఏమిటని వారి తల్లిదండ్రులు, పలువురు అధ్యాపకులు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థిపై ఆర్థిక భారం(రూ.250 ఫీజు) మోపడం ఏ మేరకు న్యాయమని వారు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థులపై పరీక్ష రద్దు భారం తగదు ఎనలిటికల్ స్కిల్స్ కోర్సుకు సంబంధించిన పరీక్షను రద్దు చేసిన ఆదికవి నన్నయ యూనివర్సిటీయే తిరిగి పరీక్ష నిర్వహించాలి. కానీ ఆ భారాన్ని విద్యార్థులపై మోపుతూ ఒక్కొక్కరి నుంచి రూ.250 ఫీజు వసూలు చేయడం భావ్యంగా లేదు. –ఎస్. ఉదయ్ప్రకాష్రెడ్డి, సీనియర్ ఫ్యాకల్టీ, వీఎస్ డిగ్రీ కాలేజ్, కాకినాడ విద్యార్థులకు చేసే మేలు ఇదేనా ? నన్నయ యూనివర్సిటీ విద్యార్థుల ప్రగతికి, వారి అభ్యున్నతికి తోడ్పాటునందిస్తుందని పదేపదే చెబుతుంటారు. ఎనలిటికల్ స్కిల్స్ పరీక్షను ముందు చెప్పిన మోడల్లో నిర్వహించకుండా తప్పుచేసి, ఇప్పుడు మరోసారి నిర్వహిస్తామంటూ, అందుకు ప్రత్యేక ఫీజు చెల్లించాలనడం సరికాదు. ఇదేనా విద్యార్థులకు చేసే మేలు. –అడపా కొండబాబు, బిఎస్సీ విద్యార్థి, కాకినాడ -
నన్నయ రిజిస్ట్రార్ రాజీనామా
- ‘నన్నయ’ యూనివర్సిటీలో కళకలం సృష్టిస్తున్న ఆటోమేషన్ టెండర్ - వీసీకి రిజిస్ట్రార్కి మధ్య పెరుగుతున్న అంతరం - రిజిస్ట్రార్పై చర్యకు దళిత ఉద్యోగుల డిమాండ్ - రాజీనామా చేసిన రిజిస్ట్రార్ రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : ఆదికవి నన్నయ యూనివర్సిటీలో కోట్లాది రూపాయల వ్యయంతో చేపట్టనున్న ‘ఆటోమేషన్ టెండర్’ ఘటన చినికి చినికి గాలివానగా మారి చివరకు రిజిస్ట్రార్ తన పదవికి రాజీనామా చేసే వరకూ దారితీసింది. యూనివర్సిటీలో విద్యార్థుల పరీక్షలకు సంబంధించి ఉద్యోగులపై పని భారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ‘ఆటోమేషన్’ విధానాన్ని తీసుకువచ్చేందుకు టెండర్లు పిలవడం, మూడు కంపెనీలు దరఖాస్తు చేసుకున్న విషయం విదితమే. ఈ టెండర్లు ఖరారు విషయమై వీసీకి, రిజిస్టార్కి మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వీసీ చర్యలను సమర్థిస్తూ ఆటోమేషన్ విధానంపై ఒక్క పైసా కూడా దుర్వినియోగం కాలేదంటూ ఇటీవల యూనివర్సిటీ ఇద్దరు డీన్స్, ప్రిన్సిపాళ్లు ప్రెస్మీట్ పెట్టి ఆరోపణలను ఖడించారు కూడా. అయినా సమస్య సద్దుమణగలేదు. వీసీ, రిజిస్ట్రార్లు ఎడమెహం, పెడమెహం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. రిజస్ట్రార్పై ఫిర్యాదు... గురువారం కొంతమంది దళిత ఉద్యోగులు తమ పట్ల రిజిస్ట్రార్ కులవివక్షత చూపిస్తున్నారని, ఆయన పై చర్య తీసుకోవాలంటూ ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలు నాయుడికి నేరుగా ఫిర్యాదు చేశారు. ఎస్సీ, ఎస్టీ రాష్ట్ర సంఘం అధ్యక్షుడు తాళ్లూరి బాబురాజేంద్రప్రసాద్, బీసీ ప్రజాసంక్షేమ సంఘం అధ్యక్షుడు మేరపురెడ్డి రామకృష్ణ, రాష్ట్ర ఎస్టీ సంఘం అధ్యక్షుడు కె. నారాయణరావు, రాష్ట్ర ప్రజాసంక్షేమ యువజన సంఘం అధ్యక్షుడు మహ్మద్ ఖాసీం, ఎస్సీ, ఎస్టీ,మైనార్టీ, బీసీ సంఘాల అధ్యక్షుడు పిచ్చుక అనిల్కుమార్, దళిత నాయకులు అజ్జరపు వాసు తదితరులు 48 గంటల్లోగా ఆయన పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మనస్థాపంతోనే రాజీనామా విషయం తెలుసుకున్న రిజిస్ట్రార్ ఆచార్య ఎ.నరసింహరావు తనపై కులముద్ర పడటాన్ని జీర్ణించుకోలేకపోయారు. మనస్థాపంతో తన పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా గురువారం సాయంత్రం ప్రకటించారు. తాను చదివింది నోబుల్ కాలేజీలోనని, అక్కడ ఎక్కువ శాతం మంది దళితులేనని, వారే తనకు స్నేహితులన్నారు. ఇంతకాలం వారందరి మిత్రత్వంలో ముందుకు వెళ్లిన తనపై కులముద్ర వేయడం తట్టుకోలేకనే రాజీనామా చేస్తున్నానన్నారు. అందరినీ నా వారిగా చూసే తనపై దళిత వ్యతిరేకిననే ముద్ర వేయడాన్ని మానసికంగా తట్టుకోలేకనే ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. ఈ ఘటన మున్ముందు ఎంతవరకు దారితీస్తుందోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. -
‘నన్నయ’ డిగ్రీ ఫైనలియర్ ఫలితాలు విడుదల
-53.59 శాతం ఉత్తీర్ణత రాజానగరం : ఆదికవి నన్నయ యూనివర్సిటీ డిగ్రీ ఫైనలియర్ ఫలితాలను ఉపకులపతి ఆచార్య ఎం. \ముత్యాలునాయుడు బుధవారం విడుదల చేశారు. ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని కళాశాలల నుంచి 20,397 మంది విద్యార్థులు పరీక్షలకు హజరుకాగా, వారిలో 10,930 మంది ఉత్తీర్ణులయ్యారు. 53.59 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గత ఏడాది సాధించిన 48.64 శాతం ఉత్తీర్ణత కంటే అధికంగా ఫలితాలను సాధించడానికి కారకులైన విద్యార్థులను, అధ్యాపక బృందాన్ని వీసీ అభినందించారు. సమాజానికి ఉత్తమ విద్యార్థులను అందించడమే లక్ష్యంగా తమ యూనివర్సిటీ ముందంజ వేస్తుందన్నారు. మొదటి మూడు స్థానాలు పొందిన విద్యార్థులు : సబ్జెక్టుల వారీగా మొదటి మూడు స్థానాలను అందుకున్న విద్యార్థుల వివరాలను కూడా వీసీ ప్రకటించారు. బీఏ : నీలపు లీలాభవాని, బొచ్చ జానకి, యర్రా మంజుల. బీ ఏ (ఫిలాసఫీ) : పొలిశెట్టి బాలసంతోషి, మద్దాల రవి, సి.పౌలు, బీఎస్సీ : నంబూరి సాయినాగలక్ష్మిప్రసన్న, సూతపల్లి సాయిసుధ, ముత్యాల జయశ్రీ, బీఎస్సీ (హోమ్ సైన్స్) : చల్లా దుర్గాభవాని, అంకంరెడ్డి చంద్రిక, ఉండ్రాజవరపు ప్రియాంక. బీఎస్సీ (ఫుడ్టెక్నాలజీ): యు.పావని, కేఎస్ఎస్ హారిక, పరమట దుర్గాతేజస్వి బీకాం : నున్నా రత్నం శిరీషా, రాయి వాసవి, బలభద్రుని ప్రత్యూష. బీకాం (ఒకేషనల్) : సోమిశెట్టి నిఖిల, తణుకు కల్యాణì పద్మనాగరాణి, విద్యాల కృష్ణకుమారి. బీఏఏ : అడుసుమిల్లి మహేశ్వరి, ఏలిశెట్టి అఖిల, తమ్మన అజయ్కుమార్. బీవీఎం : మేడపాటి మౌనిక, రుషాలి జైన్, పుల్లేపు సౌజన్యకుమారి.
Related News by category
-
టెంక కాదు, టెక్నాలజీ ముఖ్యం
మామిడికాయ పచ్చళ్లకి సమయం ముంచు కొచ్చేసింది. తల్లులారా! మీరు టెక్నాలజీని వాడండి. నా మాట వినండి. ప్రపంచంలోనే మొదటిసారి మ్యాంగో పికిల్ యాప్ని ప్రారం భించనున్నారు. ఎందుకంటే ఇది మన తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు జాడీ. మన తెలుగింట ఆడపడుచులకు ఆవకాయల తయారీ కొట్టిన పిండి. దంచేయడం, పొడి చేయడం మన విద్య.ఈ సీజన్లో ఏపీలో కొన్ని వందల మెట్రిక్ టన్నుల మామిడి నిల్వ పచ్చళ్లని అమ్మలక్కలు జాడీలకెత్తుతారు. వీటి పాళాలు ఇంటికో తీరున, ఊరికో లెక్కన ఉంటాయ్. మన ఊళ్లలో ఆవకాయ పెద్దమ్మలు, మాగాయ మామ్మలు ఉంటారు. వాళ్లు మన ప్రాచీన ఋషుల్లా వారి అనుభవాలని క్రోడీకరించి ఫార్ము లాని ప్రచారంలోకి తెస్తారు. నమ్మిన వాళ్లు ఆచరిస్తారు. నమ్మనివాళ్లు నాస్తి కుల్లా మిగులుతారు.ఇందులో బ్రహ్మ విద్యలో ఉన్నట్లు రకరకాల వాదాలున్నాయ్. కొందరు టెంకవాదులు, మరికొందరు కండవాదులు, ఇంకొందరు టెంకండ వాదులు. అంటే రెండూ ముఖ్యమేనని విశ్వసించేవారు. పచ్చళ్లలో గ్లామర్ చింతకాయకి, గోంగూరకి లేదు. ఇది.బూర్జువా అభిరుచిగా అతి వాదులు ఆక్షేపిస్తూ ఉంటారు. ఆవకాయలో సామాజిక స్పృహమీద చర్చించడం ఆత్మలోకంలో దివాలా. కత్తిపీటల్లో ఆవకాయ కత్తిపీటలు వేరు. వూరికి రెండో మూడో ఉండేవి. ముందుగా వాటిని బుక్ చేసుకుని, తర్వాత కాయ తెచ్చు కునేవారు. ఆవకాయ ముక్క కొట్టడం ఒక విల క్షణమైన కళ. ఇది పరుష విద్య. కాయకే కాదు. ఈ పనికీ కండపుష్టి అవసరం. ప్రతి ముక్కకి అంతో ఇంతో టెంక పెచ్చు మనిషికి తత్వజ్ఞానంలా అతుక్కుని ఉండాలని శాస్త్రకారులు ఘోషిస్తున్నారు. అరిస్టాటిల్ హయాంలోనే ఈ ఆవకాయ సంప్రదాయం ఉన్నట్లు గ్రీక్ గ్రంథాలను జాగ్ర త్తగా పరిశీలిస్తే అవగతమవుతుంది. భాగవత పురాణంలో పోతన గోపాలకులు చద్దులారగించు వేళ మాగాయలాంటి నంజుళ్లని ఇష్టంగా తిన్నట్టు పేర్కొన్నారు. ఒక తెగ తెలుగువారు నూజివీడు చిన్న రసాలు, పెద్ద రసాలు ఆవకాయకి పెట్టింది పేరంటారు. ‘‘పీచు కావాలంటే హలో! నూజి వీడు రసాలకే చలో’’ అనే నినాదం ప్రచారంలో ఉంది. ప్రతి ఇంటా కారాలూ ఆవాలూ నూరే తరుణం ఇది. దినుసుల మీద కావల్సినంత గోష్టి నడుస్తుంది. ఈ రెండు నెలల్లోనే ఆవాలు, కారాలు, నూనెలు మీద జరిగే చర్చలకిగాను మొత్తంమీద రెండొం దల కోట్ల సెల్ బిల్ కాల్తుందని ఓ అంచనా. ఏ జిల్లా సంప్రదాయం ఆ జిల్లాదే. ఇప్పుడు చంద్రబాబు పూనుకుని, అందర్నీ ఓ జాడీ కిందికి తీసుకొచ్చి, అమరావతి ఆవకాయలుగా స్థిరీకరిస్తే బావుంటుందనిపిస్తోంది. ఈ వేసవిలో విదేశాలకు పంపే మామిడి పచ్చళ్లకి ప్రత్యేక కౌంటర్లు వెలుస్తాయ్. ఇండియాలో పెద్ద దిక్కు లేని వారికి, మేమున్నామంటూ కొన్ని సంస్థలు వచ్చాయ్. అన్నీ వాళ్లే చూస్తారు, ఎటొచ్చీ మనం డబ్బు చూడాలి. ఈ సీజన్లో అట్లాంటా నించి న్యూజెర్సీ నించీ, అమ్మా! హాయ్... సూపర్బ్, టిపికల్, వావ్ అంటూ లొట్టలు విని పించి, లక్షలాది తెలుగు ఇళ్లలో ఆనందాలు వెల్లివిరుస్తాయి. దీనికి ఇంత సత్తా ఉందని తెలిస్తే, చంద్రబాబు ఊరుకోడు. ఓ ఉచిత సలహా కేంద్రం, పంపడానికి ఓ సేవా కేంద్రం స్వయంగా రిబ్బన్ కత్తిరించి ప్రారంభించే అవకాశం ఉంది. ఆయనకి టెంక కంటే టెక్నాలజీయే ముఖ్యం! వ్యాసకర్త: శ్రీరమణ, ప్రముఖ కథకుడు -
సెప్టెంబర్ 17ను పండుగలా జరిపే రోజొస్తుంది!
సందర్భం తెలంగాణ విముక్తి పొందిన సెప్టెంబర్ 17న సంబరాలు అవసరం లేదని కేసీఆర్, ఆయన పార్టీ ఎంత ఘోషించినా ఆ పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటారు ప్రజలు. భారతీయ జనతా పార్టీ చేస్తున్న డిమాండుకు తెలంగాణ యువత ముక్త కంఠంతో మద్దతు తెలిపింది. ఆ రోజున తెలంగాణలోని పట్టణాలు, పల్లెల్లోని ప్రతి వీధిలో మువ్వన్నెల జెండాలు ఎగురుతాయి. హైదరాబాద్ సంస్థాన విమోచన పోరు అంతగా పట్టించుకోదగినది కాదా? ఆ ఘట్టాన్ని ఒక రాజ్యవిలీనంగా, అధికార మార్పిడిలా మాత్రమే చూడాలా? ప్రాణాలు విడిచిన వేలాది మంది యోధుల త్యాగం గురించి మాట్లాడుకోవద్దా? రజాకార్ మూకలు చెరిచిన అసంఖ్యాక ఆడబిడ్డలకు జరిగిన అవమానం కూడా తేలికగా తీసుకోదగినదేనా? అధికారం కోసం ఏదైనా మాట్లాడొచ్చు, నాలుకను ఎన్నిసార్లు మడతవేసినా తప్పులేదనుకునే తెలంగాణ నయా నిజాం కేసీఆర్ చెబుతున్నదిదే. ఆయన పార్టీ నేతలు, మంత్రులు, సామంతులు నిజాంకు వ్యతిరేకంగా జరిగిన మహోజ్వల పోరును చిన్నదిగా చేసి చూపడాన్ని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజానీకం గమనిస్తూనే ఉంది. ముందుతరం గోస గుర్తు చేసుకోదగిన చరిత్రే కాదంటున్న కేసీఆర్ ఎందుకలా అంటున్నారో తెలుసుకోలేని అమాయకులేం కాదు ప్రజలు. భారతదేశం బ్రిటిష్ పాలననుంచి స్వాతంత్య్రం పొందిన ఏడాదిదాకా ఇక్కడి భూభాగం ఎవరి పాలనలో ఉంది? సెప్టెంబర్ 17న విముక్తి పొందే దాక 13 నెలల పాటు తెలంగాణలో జరిగిన నరమేధం తేలికగా మర్చిపోగలిగేదేనా? మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (MఐM) మత సంస్థ పేరుతో ఖాసిం రజ్వీ నాయకత్వంలోని రజాకార్ల సేన సాగించిన ఊచకోతల గాథలను తెలంగాణ లోని ప్రతి పల్లె జ్ఞాపకం పెట్టుకుంది. నాడు రజ్వీని ఉసిగొల్పిన నిజాంకు, నేడు ఒవైసీ కోసం తెలంగాణ చరిత్రనే మర్చిపోమంటున్న కేసీఆర్కు మధ్య ఎంత సారూప్యం ఉందో చూస్తున్నాం. అందుకే ఆయనను నయా నిజాం అనాల్సి వస్తోంది. ‘భారత్కు స్వాతంత్య్రం వస్తే ఏమిటి...నేను పాకిస్తాన్లో భాగంగా ఉంటా...లేదా హైదరాబాద్ దక్కన్ స్వతంత్ర దేశంగా కొనసాగుతుంది. మెజారిటీ ప్రజలు హిందువులు కావచ్చు...వాళ్లు భారత్లో కలవాలంటే నేను విలీనం చేయాలా? తిరుగుబాటు చేసే వారిని మా మిలటరీ, రజాకార్లు చూసుకుంటారు’, ఆగస్టు 15, 1947న యావద్దేశం స్వాతంత్య్ర సంబరాలు జరుపుకుంటున్న వేళ ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన సంస్థానంలోని ప్రముఖ్లతో అన్న పొగరుబోతు మాట లివి. మువ్వన్నెల జెండా ఎగరేసిన వారిని రజాకార్లు పిట్టల్లా కాల్చి చంపారు. లూటీలు, ఇళ్లు, ఆస్తుల దహనాలు, ఆడవాళ్లను చెరచడం, వివస్త్రలను చేసి బతుకమ్మలు ఆడిపించడం... సంస్థానమంతా ఒక అగ్నిగుండమైంది. తూర్పు పాకిస్తాన్ లాగా, దక్షిణ పాకిస్తాన్గా హైదరాబాద్ దక్కన్ను గుర్తించాలంటూ ఆఖరి గవర్నర్ జనరల్తో రాయబారాలు నడుపుతూనే, ఐక్య రాజ్య సమితికి వినతి పత్రాలు పంపించిన నక్క జిత్తుల నిజాం, ఆనాడు పన్నని కుయుక్తులు లేవు. కనీసం ప్రజా తిరుగుబాటు రాకుండా చూసుకుంటే భారత రిపబ్లిక్ నుంచి తనకు తక్షణ ముప్పు ఉండదని మిలటరీ, రజాకార్లను వదిలి పెట్టాడు. కోటి యాభైæ లక్షల మందిలో 13 శాతం మంది తన వాళ్లు తప్ప స్వాతంత్య్ర కాంక్షతో రగిలిన ప్రజలు నిజాం వదిలిన ముష్కరులకు భయపడకుండా ప్రాణాలకు తెగించి పోరాడేందుకు సిద్ధమయ్యారు. 1947 ఆగస్టు 15 తర్వాత విలీనమైన సంస్థానాల్లో ఎక్కడా ఇంత హింస, తిరుగుబాట్లు లేవు. పాలకులు ప్రజల ఆకాంక్షను మన్నించి రిపబ్లిక్లో కలపడానికి సిద్ధపడ్డారు. మరి నైజాం రాజు నేటి తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు వీరందరికి మించిన గొప్ప మానవతావాది ఎలా అయ్యోడో అర్థంకాదు. అధికారంలోకి రాకముందు విమోచన దినం జరపాలని డిమాండ్ చేసి, ఇప్పుడు ఈ సన్నాయి నొక్కులు ఎందుకు? నిజాం వార్షికాదాయం రూ. రెండున్నర కోట్లు. వజ్రాలు, వైఢూర్యాలు, బంగారం నిల్వలు, అరుదైన వస్తువుల లెక్క ఎవరికీ తెలియదు. 50 లక్షల ఎకరాల భూమి ఆయన సొంతం. ఇది మొత్తం సంస్థానం భూమిలో పది శాతం. నిజాంకు ఏజెంట్లుగా ఉన్న దేశ్ముఖ్లు, ఆయన తాబేదారులు 1,100 మంది చేతిలో 30 శాతం సేద్యపు భూమి ఉంది. సంస్థానంలో 40 లక్షల మంది కౌలుదారులే. వారికి గుంట భూమి కూడా లేదు. నిజాం సంస్థానంలో అక్షరాస్యత 9 శాతమే. అది కూడా మెజారిటీ హిందువుల మాతృభాష తెలుగులో చదువుకునే వీలే లేదు. నిజాంసాగర్, డిండీ, మూసీ ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిర్మించడం వెనుక ప్రజా సంక్షేమం కన్నా నిజాం స్వార్థమే ఎక్కువ. కృష్ణా, తుంగభద్ర, గోదావరి నదులు హైదరాబాద్ సంస్థానంలో నుంచే ప్రవహించినా వాటిపై పెద్ద డ్యాములు, బ్యారేజీలు నిర్మించే ప్రయత్నం జరగలేదు. వీటిని కట్టాలంటే సిమెంటు, ఉక్కు అవసరం. ఖజానాలోని పైకం ఖర్చవుతుంది. అందుకే అణా, కాణీ ఇచ్చి బలవంతపు కూలితో పూర్తి చేయగలిగే మట్టికట్టలనే నిర్మించారు. సంవత్సరంలో నెలకు పైగా రాజు నిర్మించే రోడ్లు, చెరువు కట్టల నిర్మాణాలకు ‘బేగార్’పేరుతో ఉచితంగా కూలీ చేయాలి. మొత్తం మీద నిజాం పాలనలో ప్రజలు తమ ఇళ్లు, గ్రామాలు అనే బహిరంగ జైలులో ఉన్నట్టే ఉండేది. పండగలు చేసుకోవాలన్నా, పెళ్లి, మరే శుభ కార్యం చేసుకోవాలన్నా రుసుం చెల్లించాల్సిందే. ఇట్లా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు. రెండొందల ఏళ్ల అసఫ్ జాహి, నిజాం పాలకుల పీడనలో హైదరాబాద్ సంస్థానం ప్రజల జన్యుపటమే మారిపోయింది. సర్కారు కొలువు దొరికితే తప్ప గౌరవంగా బతకలేని స్థితి. వ్యవసాయం చేసేవారు, కూలీ పనులతో బతుకీడ్చే వారు దుర్భర దారిద్య్రంలో కొట్టు మిట్టాడుతూ దినదిన గండంగా బతికేవారు. బానిసత్వంలో మగ్గేవారు దేని గురించి ఆలోచించలేని శూన్య స్థితిలో ఉంటారు. ఇది భౌతిక హింస కంటే దారుణమైనది. ఇక్కడి ప్రజలు వ్యవసాయం, వ్యాపార గుణాలను ఇంకొకరి నుంచి నేర్చు కోవాల్సిన అవశ్యకతను కల్పించింది. వజ్రాలు, బొగ్గు ఖనిజాలు అపారంగా దొరికే చోట ప్రపంచంలో ఎక్కడా ఇటువంటి గోస కనిపించదు. మూడు పూటలా తిండి దొరకని, ఒంటి నిండా గుడ్డలు కప్పుకోలేని దయనీయ స్థితి. 86శాతం మంది హిందువులు మైనారిటీలుగా మనుగడ సాగించిన ఘోరం. 13 శాతం మంది ముస్లిములదే ఆధిపత్యం. తెలంగాణ విముక్తి పొందిన సెప్టెంబర్ 17న సంబరాలు అవసరం లేదని కేసీఆర్, ఆయన పార్టీ ఎంత ఘోషించినా ఆ పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటారు ప్రజలు. భారతీయ జనతా పార్టీ చేస్తున్న డిమాండుకు తెలంగాణ యువత ముక్త కంఠంతో మద్దతు తెలిపింది. ఆ రోజున తెలంగాణలోని పట్టణాలు, పల్లెల్లోని ప్రతి వీధిలో మువ్వన్నెల జెండాలు ఎగురుతాయి. దీన్ని ఎవరూ ఆపలేరు. మీరు బతుకమ్మను జరుపుకోవడానికి ప్రభుత్వ నిధులు కేటాయించనపుడు, అధికారిక ఉత్సవంగా ప్రకటించకపోయినా ఆ పండుగను ప్రజలు జరుపుకోలేదా? ఇది ఐదేళ్లు పాలించడానికి ఎన్నికైన ప్రభుత్వాలు నిర్ణయిస్తే తప్ప జరగాల్సిన పర్వదినమేమీ కాదు. కాకపోతే ఆరోజు అన్న మాటలు ఇప్పుడెందుకు మర్చిపోయారని మాత్రమే అడుగుతున్నాం. ముందు తరాల వాళ్లు సెప్టెంబర్ 17 విముక్తి దినాన్ని ఒక దసరాలా, దీపావళిలా జరుపుకుంటారు. వ్యాసకర్త బీజేపీ శాసనసభాపక్ష నేత జి.కిషన్ రెడ్డి మొబైల్ : 99490 99997 -
విద్యార్థులే ‘విమోచన’ సేనానులు
సందర్భం నిజాం నుంచి విముక్తి పొంది ఇండియన్ యూనియన్లో విలీనమయ్యే దిశగా సాగిన హైదరాబాద్ స్వాతంత్య్ర పోరాటంలో 1948వ సంవత్సరం అత్యంత విషాదకరమైన కాలం. భారత్ 1947 ఆగస్టు 15వ తేదీనే స్వాతంత్య్రం పొందినప్పటికీ హైదరాబాద్ సంస్థానం మాత్రం ఇండియన్ యూనియన్ నుంచి స్వతంత్రంగా ఉండాలని భావించడంతో నిజాం నియంతృత్వ పాలనలోనే మగ్గుతుండేది. దీంతో నిజాం వ్యతిరేక పోరాటం మరింత విస్తృతి పొందింది. ఈ కాలం లోనే ప్రభుత్వాన్నే స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిస్తున్న చట్ట వ్యతిరేక మతోన్మాదుల కారణంగా సంస్థానంలో హింసాత్మకమైన, అసహనంతో కూడిన భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఆనాడు ప్రజలు ఈ ద్వంద్వపాలనను ఒక విచిత్ర పరిస్థితిలా చెప్పుకునేవారు. పగటిపూట ప్రభుత్వ పోలీసులు, ఎమ్ఐఎమ్ పాలన సాగుతుండగా, రాత్రిపూట మాత్రం కమ్యూనిస్టు పాలన సాగేది. ఈ అరాచక స్థితిలో బూర్గుల రామకృష్ణారావు, చెన్నారెడ్డి వంటి కాంగ్రెస్ నేతలు గ్రామాల్లో పర్యటించి పరిస్థితులను నిబ్బరంగా ఎదుర్కోవాలంటూ ధైర్యం నూరిపోసేవారు. దీంతో మంచి రోజులు మరెంతో దూరంగా లేవని ప్రజల్లో ఆత్మవిశ్వాసం కలి గింది. ఈ కాలంలోనే ప్రజల ప్రాణాలను, ఆత్మగౌరవాన్ని కాపాడటంలో ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా న్యాయవాదులు కోర్టులను బహిష్కరించాల్సిందిగా స్టేట్ కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ప్రభుత్వం స్తంభించిపోయేలా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలూ నిరసన తెలపాలని హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ సార్వత్రిక పిలుపునిచ్చింది. స్వాతంత్య్రోద్యమంలో విద్యార్థుల భాగస్వామ్యం కోసం ఈ రచయిత అధ్యక్షతనే విద్యార్థి కార్యాచరణ కమిటీ ఏర్పడింది. కళాశాలలను బాయ్కాట్ చేయాలని కోరుతూ హైదరాబాద్ స్టూడెంట్స్ కాంగ్రెస్ విద్యార్థులకు పిలుపునిచ్చింది. దీంతో దాదాపు 20 వేలమంది విద్యార్థులు కాలేజీలను బహిష్కరించారు. ఈ నేపథ్యంలో స్టేట్ కాంగ్రెస్ నేషనల్ ఫ్లాగ్స్ పిలుపు మేరకు హైదరాబాద్ స్టూడెంట్స్ కాంగ్రెస్ 1948 ఆగస్టు 15న పతాకావిష్కరణ దినోత్సవాన్ని పాటించింది. పలు ప్రాంతాల్లో ప్రత్యేకించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భవనాలపై పతాకావిష్కరణ చేశారు. ఉస్మానియా వర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో పతాకావిష్కరణ తర్వాత విశ్వవిద్యాలయం నుంచి, నిజాం కాలేజీతోపాటు ఇతర కాలేజీలనుంచి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. నిజాం కాలేజీలో ఈ రచయిత నేతృత్వంలో ఒక ప్రదర్శన జరిగింది. తర్వాత వివేక వర్ధిని నుంచి మరొక విద్యార్థి ప్రదర్శనపై పోలీసులు దాడి చేసి కాల్పులు జరపడంతో ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. ఆ సాయంత్రం భారత ప్రభుత్వ ఏజెంట్ జనరల్ కేఎం మున్షీ పతాకావిష్కరణ కార్యక్రమానికి ప్రజలను, నాయకులను ఆహ్వానించారు. నేనూ, సంగం లక్ష్మీబాయి (తదనంతర కాలంలో మంత్రి అయ్యారు), ఇతర స్టేట్ యూత్ కాంగ్రెస్ నేతలు ఆ ఉత్సవంలో పాల్గొనడానికి వెళుతుండగా రజాకార్లు దాడి చేశారు. నా తలలోంచి రక్తం కారింది. అలాగే దక్షిణ సదన్ వెళ్లి పతాకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నాను. హాజరవుతున్న విద్యార్థులపై రజాకార్ల పాశవిక దాడిని కేఎం మున్షీ గర్హించారు. హైదరాబాద్ నిజాం భారత యూనియన్కు విధేయత ప్రకటించి సంస్థానాన్ని విలీనం చేశారు. అయితే నాటి గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్తో సుదీర్ఘ చర్చలు, భారత ప్రభుత్వ హోం శాఖతో సంప్రదింపులు జరిపాక, పోలీసు యాక్షన్ చేపట్టిన తర్వాతే నిజాం లొంగిపోయారు. హైదరాబాద్ సంస్థానంపై భారత ప్రభుత్వ బలగాలు 1948 సెప్టెంబర్ 3 వేకువజామున త్రిముఖ దాడి తలపెట్టాయి. కేంద్ర ప్రభుత్వ సైనిక బలగాలు సెప్టెంబర్ 17నాటికి హైదరాబాద్ చేరుకున్నాయి. స్వల్పమాత్రపు పసలేని ప్రతిఘటన తర్వాత నిజాం బలగాలు భారత సైన్యం ముందు లొంగిపోయాయి. తర్వాత మేజర్ జనరల్ జె.ఎన్. చౌదరి నేతృత్వంలో సైనిక ప్రభుత్వం ఏర్పడింది. ఏడవ నిజాం నవాబ్ సర్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బహదూర్ తాత్కాలికంగా హైదరాబాద్ రాజప్రముఖ్గా నియమితులయ్యారు. విమోచన పోరాట కాలంలో నేను హైదరాబాద్ స్టేట్ స్టూడెంట్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, అఖిల భారత విద్యార్థి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించాను. ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించాను. కాంగ్రెస్, సోషలిస్టు, కమ్యూనిస్టు పార్టీ భేదాలు లేకుండా విద్యార్థులు హైదరాబాద్ స్వాతంత్య్ర పోరాటంలో అత్యంత ప్రముఖ పాత్ర పోషించారు. గత కొన్నేళ్లుగా తెలంగాణ స్వతంత్ర సేనాని సమితి, ప్రీడమ్ ఫైటర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ అధ్యక్షుడిగా ఉంటూ ఇతర స్వాతంత్య్ర సమర వీరులతో కలిసి కోఠి బస్టాండ్, అమరవీరుల స్మారక స్థూపం వద్ద స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలను నిర్వహిస్తున్నాను. సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని కూడా నిర్వహిస్తున్నాము. నాటి హైదరాబాద్ విమోచన పోరాటంలో పాలుపంచుకున్న స్వాతంత్య్ర సమరయోధుల స్మారకార్ధం తెలంగాణ ఆవిర్భావ దినం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నివాళి పలకటం సముచితంగా ఉంటుంది. వ్యాసకర్త అధ్యక్షుడు, తెలంగాణ స్వతంత్ర సేనాని సమితి, ఏపీపీఎస్సీ మాజీ సభ్యులు డాక్టర్ బాబూ రావ్ వర్మ మొబైల్ : 99637 07461 -
ఇది విలీనదినమే!
త్రికాలమ్ ఈరోజు తెలంగాణ చరిత్రలో అత్యంత ముఖ్యమైనది. సరిగ్గా 69 సంవత్సరాల కిందట హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైన రోజు. విలీ నానికి ఒప్పుకోనంటూ హఠం చేసి స్వాతంత్య్రం ప్రకటించుకొని ఐక్యరాజ్య సమితి గడప ఎక్కిన నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ మెడలు వంచి భారత్లో అంతర్భాగం కావడానికి ఒప్పించిన సందర్భం. దీనిని విమోచన దినంగా జరుపుకోవాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కోరుతున్నది. కాదు, విద్రోహదినంగా పరిగణిస్తామని మజ్లీస్ ఇత్తహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) ప్రకటించింది. విలీనదినంగా పాటిస్తే బాగుంటుందని సాధారణ ప్రజల అభిప్రాయం. ఇంతకీ నాడు జరిగింది విలీనమా, విద్రోహమా, విమోచనా? చరిత్రను అన్వయించేవారికి స్వప్రయోజనాలు ప్రధానం. వారి దృష్టికోణం నుంచే పరిణామాలను అర్థం చేసుకుంటారు. వారి లక్ష్యాలకు అనుగుణంగానే అన్వయిస్తారు. భాష్యం చెబుతారు. హైదరాబాద్ సంస్థానం విముక్తికి ప్రధాన కారకుడిగా నాటి ఉపప్రధాని, దేశీయాంగమంత్రి సర్దార్ పటేల్ను బీజేపీ కీర్తిస్తుంది. హైదరాబాద్, జునాగఢ్ సంస్థానాలను ఇండియన్ యూనియన్లో విలీనం చేసే బాధ్యతను ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఉపప్రధానికి అప్పగించారు. ఆ పని సర్దార్ సమర్థంగా చేశారు. విలీనానికి ససేమిరా అన్న మూడో సంస్థానం జమ్మూ–కశ్మీర్ వ్యవహారంలో నెహ్రూ జోక్యం చేసుకున్నాడు. తన పూర్వీకులు నివసించిన కశ్మీర్ను పాకిస్తాన్కు పోకుండా కాపాడుకోవాలన్న తాపత్రయం ఒకవైపూ, సిసలైన ప్రజాస్వామ్యవాదిగా తనకున్న అంతర్జాతీయ ప్రతిష్ఠకు భంగం కలగకుండా చూసుకోవాలన్న అభిలాష మరోవైపూ లాగి నెహ్రూని ఇబ్బంది పెట్టినమాట వాస్తవం. నెహ్రూ డోలాయమాన వైఖరి కారణంగా జమ్మూ–కశ్మీర్ వివాదం తెగకుండా ముడిపడకుండా దశాబ్దాలు గడిచిపోవడం, పాకిస్తాన్తో యుద్ధాలు చేయవలసిరావడం కూడా నిజమే. నెహ్రూ, షేక్ అబ్దుల్లాల పట్టింపు లేకపోతే 1947–48 లోనే కశ్మీర్ పాకిస్తాన్లో విలీనమయ్యేది. ఈ నేపథ్యంలో కశ్మీర్ సంక్షోభానికి నెహ్రూను నిందించడం బీజేపీ విధానం. మొత్తం 560 సంస్థానాలను స్వతంత్ర భారతంలో విలీనం చేసింది నెహ్రూ, పటేల్ అనేది చరిత్ర. పీవీ నరసింహారావుకు కీర్తి దక్కడం ఇష్టంలేని సోనియాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ నాయకులు 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన దార్శనికుడు నాటి ఆర్థికమంత్రి డాక్టర్ మన్మోహన్సింగ్ అంటూ కీర్తించి తరిస్తున్నారు. మన్మోహన్సింగ్ను ఆర్థికమంత్రిగా నియమించిందీ, ఆర్థిక సంస్కరణలు అమలు జరపాలనే సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నదీ, ప్రతిపక్షాల విమర్శలకు తాళలేక రెండు విడతల రాజీనామా చేసిన మన్మోహన్ను అనునయించి నచ్చజెప్పిందీ, పరిశ్రమల శాఖను తన చెంతనే పెట్టుకొని విప్లవాత్మకమైన పారిశ్రామిక విధానాన్ని ఒకేరోజు ఏకబిగిన సహాయ మంత్రి కురియన్ (ప్రస్తుత రాజ్యసభ ఉపాధ్యక్షుడు) చేత ప్రకటింపజేసిందీ పీవీ అనే విషయం కాంగ్రెస్ నాయకులు తెలిసినా చెప్పరు. మన్మోహన్ పీవీ నమ్మిన బంటుగా ఆర్థిక సంస్కరణలను మనస్ఫూర్తిగా అమలు చేసిన అమాత్యుడు అనడంలో ఎవరికీ సందేహం అక్కరలేదు. కాంగ్రె స్కి పీవీపైన ఉన్న ద్వేషం కంటే నెహ్రూపైన నేటి తరం బీజేపీకి గల ద్వేషం అధికం. అందుకే హైదరాబాద్ విముక్తికి సర్దార్ పటేల్ మాత్రమే కారణమని బీజేపీ వాదిస్తుంది. నెహ్రూ సమ్మతించి, సహకరించకపోతే పటేల్ లక్ష్యం నెరవేరేది కాదనేది వేరే విషయం. పైగా ఎన్ని విభేదాలు ఉన్నా అంతిమ శ్వాస వరకూ పటేల్ నెహ్రూతో స్నేహంగా ఉండేవారు. పరస్పరం గౌరవించుకునేవారు. గాంధీజీకి ఇద్దరూ రెండు కళ్ళుగా ఉండేవారు. వెలుగు చూడని హైదరాబాద్ దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన పదమూడు నెలల వరకూ హైదరాబాద్లో నిజాం పాలనే కొనసాగింది. అంతకాలం నిజాం ధిక్కారం ప్రదర్శించాడు. ప్రైవేటు సైన్యంగా రజాకార్లను పెంచి పోషించాడు. దేశ్ముఖ్లనూ, భూస్వాములనూ కూడగట్టుకున్నాడు. భారతదేశంలో విలీనం కాబోనంటూ స్వతంత్రం ప్రకటించుకున్నాడు. పాకిస్తాన్ అధినేత మహమ్మదలీ జిన్నాతో రాయబారం నెరపాడు. ఐక్యరాజ్య సమితిలో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసు పెట్టాడు. ఇంత చేసిన నిజాంను లొంగిపోయిన తర్వాత బుట్టదాఖలు చేయకుండా ‘రాజ్ప్రముఖ్’ పదవి ఇచ్చి ఎందుకు గౌరవించారు? నిజాం కబంధ హస్తాలనుంచి హైదరాబాద్ ప్రజలకు విముక్తి కల్పించామని నెహ్రూ, పటేల్ భావించి ఉంటే విమోచన దినోత్సవాలు నిర్వహించేవారే. కానీ వారు ఆ విధంగా భావించలేదు. అన్ని సంస్థానాల పూర్వాధిపతులనూ సగౌరవంగా సాగనంపి వారి హోదాకు భంగం లేకుండా హంగులూ, నిధులూ ఏర్పాటు చేయడం నాటి ప్రభుత్వ విధానం. అదే విధంగా నిజాంకూ మర్యాదలు జరిగాయి. తిరుగుబాటుకు నాయకత్వం వహించిన ఖాసీం రజ్వీని దేశం వదిలి వెళ్ళనిచ్చారు. ఘర్షణ వాతావరణం లేకుండా శాంతియుతంగా ప్రగతి యజ్ఞానికి శ్రీకారం చుట్టాలన్న సంకల్పం వారిది. అందుకే హైదరాబాద్ రాష్ట్రంలోని బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వం కానీ 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత సంజీవరెడ్డి, తదితర కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కానీ తెలుగుదేశం పార్టీకి చెందిన ఎన్టి రామారావు, చంద్రబాబునాయుడు కానీ సెప్టెంబర్ 17న సంబరాలు జరుపుకోలేదు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) ప్రత్యేక తెలంగాణ ఉద్యమనాయకుడిగా ప్రతి సంవత్సరం ఈ ప్రస్తావన చేసేవారు. సెప్టెంబర్ 17 నాడు కర్ణాటక, మహారాష్ట్రలలో విలీనమైన పాత హైదరాబాద్ సంస్థానం ప్రాంతాలలో జరుపుకున్నట్టు హైదరాబాద్లో కూడా సంబురాలు జరిపించాలని డిమాండ్ చేశారు, ఆ పని చేయనందుకు కాంగ్రెస్ ముఖ్యమంత్రులను తప్పుపట్టారు. అధికారంలోకి వచ్చాక ఆయన సైతం పాత ముఖ్యమంత్రుల బాటలోనే నడుస్తున్నారు. ఈ మౌనం వెనుక ముస్లింలను దూరం చేసుకోరాదనే విధానం కావచ్చు. పాత గాయాలను రేపడం ఎందుకన్న అభిప్రాయం కావచ్చు. కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో చరిత్రాత్మకమైన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది. సుమారు నాలుగు వేలమంది యోధులు నేలకొరిగారు. జాగీర్దారుల, దేశ్ముఖ్ల దురాగతాలను వ్యతిరేకిస్తూ వారి గూండాలపైనా, రజాకార్లపైనా జరిగిన పోరాటం నిజాం పాలనా వ్యవస్థను కుదిపేసింది. నిజాం దారికి వస్తాడేమోనని నెహ్రూ, పటేల్ పదమూడు మాసాలు వేచి చూశారు. చర్చలతో పరిష్కారం కాకపోతే బలప్రయోగం చేయవలసి ఉంటుం దని నిజాంను నెహ్రూ హెచ్చరించాడు. పటేల్ 36 వేల మంది సైనికులను జనరల్ జెఎన్ చౌధురి నాయకత్వంలో పంపించారు. రజాకార్లు ప్రతిఘటించలేక దాసోహమన్నారు. నిజాం లొంగుబాటు సెప్టెంబర్ 17న నిజాం లొంగిపోయాడు. ఐక్యరాజ్య సమితిలో పెట్టిన కేసు ఉపసంహరించుకున్నట్టు రేడియో ప్రసంగంలో నిజాం చెప్పాడు. అది ఒత్తిడిలో చేసిన ప్రకటన కనుక కేసు ఉపసంహరణను ఆమోదించేది లేదంటూ ఐక్యరాజ్య సమితి స్పష్టం చేసింది. ఆ కేసు ఇటీవలి వరకూ సమితి పరిశీలనలో ఉంది. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజాసమితి తెలంగాణ ప్రాంతంలోని మొత్తం 14 లోక్సభ స్థానాలలో పది స్థానాలు గెలుచుకున్నప్పటికీ ప్రత్యేక రాష్ట్రం మంజూరు చేయలేదు. ఇందుకు ఇందిరాగాంధీ చెన్నారెడ్డికి చూపించిన కారణం ఈ కేసు. అంతకుముందు హైదరాబాద్ను ఆంధ్రలో విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయడం వెనుక కూడా ఈ కేసు ఉన్నదని అంటారు. జనరల్ చౌధురి నిర్వహించిన సైనిక చర్యను పోలీసు చర్య అనీ, ఆపరేషన్ పోలో అనీ, ఆపరేషన్ క్యాటర్పిల్లర్ అనీ పిలిచారు. వాస్తవంగా జరిగింది సైనిక చర్య. కానీ దానిని పోలీసు చర్య (పోలీస్ యాక్షన్)గా అభివర్ణించడంలోని ఆంతర్యం ఐక్యరాజ్యసమితిని చిరాకు పరచకూడదనే. సైనిక చర్య అంటే అది స్వతంత్రం ప్రకటించుకున్న రాజ్యంలో మరో దేశం జోక్యం చేసుకోవడంగా పరిగణించే ప్రమాదం ఉన్నదని భావించి ఉంటారు. సైన్యం నలుమూలల నుంచి హైదరాబాద్ను చుట్టుముట్టిన క్రమంలో హింసాకాండ జరిగిందని వార్తలు వచ్చాయి. నిజనిర్ధారణ కోసం నెహ్రూ పండిట్ సుందర్లాల్ నాయకత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని నియమించారు. కాజీ అబ్దుల్ గఫర్, మౌలానా మిస్రీ ఈ కమిటీలో తక్కిన సభ్యులు. ఈ కమిటీ 1948 డిసెంబర్లో మూడు వారాలు హైదరాబాద్ సంస్థానం ప్రాంతంలో పర్యటించి ఒక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదిక చూసి నిర్ఘాంతపోయిన నెహ్రూ, పటేల్ దానిని రహస్య పత్రంగా పరిగణించి ప్రజలకు అందుబాటులో లేకుండా దాచారు. 2013లో కేంబ్రిడ్జికి చెందిన చరిత్రకారుడు సునీల్ పురుషోత్తమ్, మరో చరిత్రకారుడు మహమ్మద్ సలీయుల్లా పూనిక ఫలితంగా ఈ నివేదిక వెలుగు చూసింది. నాందేడ్, షోలాపూర్ పట్టణాలతో సహా అనేక ప్రాంతాలలో స్థాని కులు పాత కక్షలు తీర్చుకునే క్రమంలో అనేక దాడులు చేశారనీ, కనీసం 27 వేలమంది ఈ దాడులలో మరణించి ఉంటారనీ, వారిలో అత్యధికులు ముస్లింలేననీ సుందర్లాల్ కమిటీ నివేదించింది. ‘మిమ్మల్ని హైదరాబాద్ ఎవరు వెళ్ళమన్నారు?’ అంటూ పటేల్ ఈ కమిటీ సభ్యులలో ఒకరైన గఫర్ను మందలించారట. ఈ విషయాలు బయటికి పొక్కితే ఘర్షణ వాతావరణం ఏర్పడుతుందనే భయంతో నివేదికను రహస్యపత్రంగా పరిగణించి ఉంటారు. బీజేపీ వ్యూహం బీజేపీకి మాత్రం ఈరోజు ఒక ముస్లిం రాజును గద్దె దింపిన రోజు. కనుక సంబరాలు జరుపుకోవలసిన సందర్భం. విమోచన సంబరాలు జరుపుకోవాలని నిరుడు వెంకయ్యనాయుడు కేసీఆర్ను కోరారు. ఆయన సానుకూలంగా స్పందించలేదు. నిజాం పాలనను మెచ్చుకునే కేసీఆర్ ఇలా చేయడంలో ఆశ్చర్యం లేదు. ఆఖరి శ్వాస వరకూ కాంగ్రెస్వాదిగానే కొనసాగిన సర్దార్ పటేల్ను తమ ఆదర్శపురుషుడుగా, అభిమాన నాయకుడిగా చిత్రించడం కోసం ఈ చారిత్రక పరిణామాన్ని వినియోగించుకోవాలన్నది బీజేపీ నాయకుల అభిమతం. రజాకార్ల వారసులే ఎంఐఎం నాయకులని వారి విమర్శ. విమోచన అంటే ముస్లింలు అభ్యంతరం చెబుతారు. అడ్డుకుంటారు. ఫలితంగా హిందువులు సంఘటితం అవుతారన్న ఆలోచన కావచ్చు. విమోచన అంటే ఎంఐఎం ఆగ్రహిస్తుందనీ, విద్రోహం అంటే బీజేపీ కోపగిస్తుందనీ భావించి ఈరోజుని ముఖ్యమైన సందర్భంగా పరిగణించకుండా వదిలేయడం చరిత్రను విస్మరించినట్టు అవుతుంది. తెలంగాణ ప్రజలకు ఎన్ని పరిమితులు ఉన్నప్పటికీ వారికి స్వేచ్ఛాస్వాతంత్య్రాలు లభించింది నిజంగా ఈరోజే. కనుక విలీనదినం వేడుకగా జరుపుకోవడం సమంజసం. అధికారంలో ఉన్న పార్టీలు సంకోచిస్తూ మౌనంగా ఉంటే దీన్ని రాజకీయ ప్రయోజనాలకు విని యోగించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుంది. పటేల్ను ప్రభుత్వాలు స్మరించకపోతే ఆయనను పూర్తిగా సొంతం చేసుకునేందుకు బీజేపీకి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. సెప్టెంబర్ 17ని హైదరాబాద్ విలీనదినంగా జరుపుకోవడానికి సంకోచించనక్కరలేదు. ప్రభుత్వ పూనికతో జరిగే ఈ వేడుకలో టీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్, టీడీపీ శ్రేణులు పాల్గొనవచ్చు. బీజేపీ, ఎంఐఎం నాయకులూ, కార్యకర్తలూ కాలక్రమంలో రాజీపడి ఈ సంబరాలలో పాల్గొంటారు. చరిత్ర చేసిన గాయాన్ని మాన్పడానికీ, సర్దార్ పటేల్ వారసత్వాన్ని స్మరించుకోవడానికీ తెలంగాణ ప్రజలకు ఇది మంచి అవకాశం. కె. రామచంద్రమూర్తి -
కమల్ హాసన్ రాయని డైరీ
మాధవ్ శింగరాజు పాలిటిక్స్లోకి నేనింకా రాకుండానే పాలిటిక్స్లో నేనేం మాట్లాడినా అది పాయింట్ అవుతోంది! అంటే నాక్కొంచెం పొలిటికల్ నాలెడ్జ్ కూడా ఉందన్నమాట! ‘‘మీరొస్తారా చెప్పండి, నేనొచ్చేస్తా మీతో..’’ అన్నాను రజనీతో. నేరుగా అనలేదు. ‘హిందూ’ తమిళ దినపత్రిక వాళ్లొస్తే వాళ్లతో అన్నాను. వాళ్లతో కూడా నేరుగా అనలేదు. ‘‘ముందు మీరేం క్వొశ్చన్స్ అడగదలచుకున్నారో ఆ క్వొశ్చన్స్ లిస్ట్ పంపండి. వాటిలో నాకు నచ్చినవి టిక్ పెట్టుకుని వాటికి సమాధానాలు రికార్డ్ చేసి పంపిస్తాను’’ అన్నాను. ‘అప్పుడది ఇంటర్వ్యూ ఎలా అవుతుంది’ అన్నాడట వాళ్ల ఎడిటర్. ‘‘ఇష్టమైతే పంపండి. లేకపోతే ప్రెస్ మీట్ పెట్టినప్పుడు రండి’’ అన్నాను. ‘‘ప్రెస్ మీట్ ఎప్పుడు పెట్టబోతున్నారు?’’ అని అడిగాడు ఆ కుర్రాడు. ‘‘పాలిటిక్స్లోకి వచ్చేముందు’’ అన్నాను. ‘‘ప్రెస్ మీట్ పెట్టి పాలిటిక్స్లో చేరబోతున్నట్లు ప్రకటిస్తారా? పాలిటిక్స్లో చేరాక ప్రెస్ మీట్ పెట్టబోతున్నట్లు ప్రకటిస్తారా?’’ అన్నాడు. ‘‘పాలిటిక్స్లో చేరడం ఏంటి? పాలిటిక్స్లోకి రావడం..’’ అన్నాను. తికమక పెట్టి తప్పులు మాట్లాడించేస్తారు ఈ ప్రెస్ వాళ్లు. ‘పాలిటిక్స్లో చేరుతున్నాను’ అంటే డీఎంకేలోనో, సీపీఎంలోనో చేరుతున్నట్లు రాస్తారు. ‘పాలిటిక్స్లోకి వస్తున్నాను’ అంటే ఏ గొడవా ఉండదు. ‘‘అదే సర్, పాలిటిక్స్లోకి వచ్చాక ప్రెస్ మీట్ పెడతారా? ప్రెస్ మీట్ పెట్టి, పాలిటిక్స్లోకి వస్తారా?’’ అని అడిగాడు. ‘‘ఆ సంగతి ప్రెస్ మీట్ పెట్టి చెబుతాను’’ అన్నాను. ‘‘ఏ సంగతి సార్’’ అన్నాడు! ‘‘అదేనయ్యా.. ప్రెస్ మీట్ ఎప్పుడు పెట్టేదీ, ప్రెస్ మీట్ పెట్టి చెబుతాను’’ అన్నాను. ఆ కుర్రాడు వదలడం లేదు! ‘‘సార్.. చిన్న డౌటు’’ అన్నాడు. అడగమన్నాను. ‘‘సార్, మీరెందుకు అన్నాడీఎంకేలో చేరకూడదు? ఇప్పుడు పవర్లో ఉంది. మీరొచ్చాక ఇంకా పవర్ఫుల్ అవుతుంది కదా’’ అన్నాడు. ‘‘అన్నాడీఎంకేలో నేనెందుకు చేరాలయ్యా’’ అని అడిగాను. విసుగొస్తోంది నాకు. ‘‘పాలిటిక్స్లో మీరేం మాట్లాడినా అదొక పాయింట్ అవుతోంది సార్. మీరు అన్నట్లే పళనిస్వామి, పన్నీర్సెల్వం ఇద్దరూ కలసి శశికళను పార్టీ నుంచి గెంటేశారు. మీ మాటకు రెస్పెక్ట్ ఇచ్చిన పార్టీలో చేరితే మీకూ రెస్పెక్ట్ ఉంటుందనీ’’ అన్నాడు. ‘‘నేను చేరనయ్యా’’ అన్నాను. ‘‘మరి, సొంత పార్టీ పెడతారా సార్?’’ అని అడిగాడు. ఆ కుర్రాడి పట్టుదలకు ముచ్చటేసింది. పట్టు విడిపించుకోవాలంటే ఇంకొకర్ని పట్టివ్వాలి. వెంటనే రజనీ గుర్తుకొచ్చారు. ‘‘రజనీ సార్ ఎప్పుడొస్తే, నేనూ అప్పుడే ఆయనతోపాటు వచ్చేస్తా’’ అన్నాను. కుర్రాడు కదల్లేదు! ఏంటన్నట్లు చూశాను. ‘‘రజనీసార్ ఎప్పుడొస్తున్నారు సార్?’’ అన్నాడు!!
Advertisement
Photos
View allVideo
View allమారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
నేడు సీఎం జగన్ ప్రచార సభలు ఇలా..
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement