అసమానతలకు ‘సీశాట్’ ఆజ్యం | Sakshi
Sakshi News home page

అసమానతలకు ‘సీశాట్’ ఆజ్యం

Published Fri, Aug 29 2014 1:01 AM

అసమానతలకు ‘సీశాట్’ ఆజ్యం - Sakshi

సీశాట్ వ్యతిరేక ఆందోళన ల నేపథ్యంలోనే ఈ అంశంలో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. పరీక్షకు ఏర్పాట్లు పూర్తి కావడంతో ఇప్పుడు కలుగచేసుకోలేమని అత్యున్నత న్యాయస్థానం ప్రకటించినా, సమస్యలో ఉన్న ప్రతికూలాంశాలు విస్మరించలేనివి.
 
 సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (సీశాట్) గురించి పెద్ద రగడే జరుగు తోంది. ఇప్పుడు నిర్వహిస్తున్న సీశాట్‌ను తొలగించవలసిందని ఢిల్లీలో నిరస నలు జరుగుతున్నాయి. నిరసనకారులను ప్రతిభాస్వామ్యానికి వ్యతిరేకు లుగా చిత్రిస్తున్నారు. ప్రాంతీయ భాషలలో చదువుకున్న వారికి కూడా ఆంగ్ల భాషా మాధ్యమం నుంచి వచ్చిన విద్యార్థులతో సమంగా ప్రాధాన్యం ఇవ్వా లంటూ రాజ్యాంగం కల్పించిన హక్కును అమలు చేయమని కోరుతున్నం దుకే ఇలా విమర్శలు కురిపిస్తున్నారన్న మాట వాస్తవం. సీశాట్‌ను తొలగించ మని కోరే వారంతా ఆంగ్ల భాషకు శత్రువులైనట్టు, సొంత భాష మీద విపరీత ప్రేమను చూపిస్తున్న చాందసులన్నట్టు వ్యాఖ్యానాలు చేస్తు న్నారు.
 
ప్రాంతీయ భాషలలో కూడా ప్రశ్న పత్రం అందించాలని కోరడమే నేరంగా పేర్కొంటున్నారు. మౌఖిక పరీక్షలో ప్రాంతీయ మాధ్య మాల నుంచి వచ్చిన అభ్యర్థులకు అన్యాయం జరుగుతున్న సంగతి చెబితే, ఇంగ్లిష్ మాట్లాడేవారే సివిల్ సర్వెంట్‌గా ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తా రని వింత వాదన వినిపిస్తున్నారు. సేవాగుణానికీ, పాలనా సామర్థ్యానికి భాషతో సంబంధం లేదన్న వాదనలను పెడచెవిన పెడుతున్నారు. నిజంగానే సీశాట్‌ను వ్యతిరేకిస్తున్న వారంతా ప్రతిభాస్వామ్యానికి బద్ధ శత్రువులేనా? యూపీఎస్‌సీ (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) నిర్దేశించిన పాఠ్య ప్రణాళిక మాత్రమే ప్రతిభాస్వామ్యానికి కొలమానమా? ఇప్పుడు నిర్వహిస్తున్నది నిజంగానే సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్టేనా? సీశాట్ పరీక్ష అనంతరం తలెత్తిన పరిణామాలను పరిశీలిస్తే ఈ ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి.
 
 సీశాట్ ఎందుకు వచ్చింది?
 యూపీఎస్‌సీ దృష్టిలో సివిల్ సర్వీసెస్ పట్ల అభ్యర్థి అభిరుచికి కొలమానం ఏమిటి? లాజికల్ రీజనింగ్, సమస్య పరిష్కారంలో నైపుణ్యం, విశ్లేషణా సామర్థ్యం, మౌఖిక భావ ప్రకటనా నైపుణ్యం, ప్రాథమిక స్థాయి గణితం, జనరల్ ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ - అని యూపీఎస్‌సీ సిలబస్‌ను బట్టి తెలు స్తుంది. ఈ అంశాలలో వెనుకబడిన వారు సివిల్ సర్వీసెస్‌కు అనర్హులని యూపీఎస్‌సీ నిర్ధారిస్తున్నది. యూపీఎస్‌సీ 2011లో సీశాట్‌ను ప్రవేశపెట్టిన పుడు అంతా పురోగమన చర్యగా భావించారు. 2010 సంవత్సరం వరకు అభ్యర్థులు అనేక ఐచ్ఛికాంశాల నుంచి ఒకదానిని ఎంచుకునేవారు.
 
 అయితే అన్ని ఐచ్ఛికాంశాల ప్రశ్నపత్రాలను ఒకే స్థాయిలో రూపొందించడం అసాధ్యం కావడం, ఐచ్ఛికాంశాల నుంచి ఎంపికయ్యే అభ్యర్థుల సంఖ్యలో భారీ వ్యత్యాసాలు ఉండడం, ఆ జాబితాలో రెండు మూడు ఐచ్ఛికాంశాలను ఎంచుకున్న వారే అధికంగా కృతార్థులు కావడం వంటి సమస్యలను తరు వాత గమనించారు. సమాచార హక్కు చట్టం పుణ్యమా అని స్కేలింగ్ విధా నం మీద కూడా అనుమానాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే యూపీఎస్‌సీ  ఐచ్ఛికాంశం స్థానంలో అభ్యర్థుల ఆప్టిట్యూడ్‌ను పరీక్షించే ఉమ్మడి పరీక్షను ప్రవేశపెట్టింది. అదే సీశాట్. ఐచ్ఛికాంశాలను తొలగించడం వల్ల సమతౌల్యం సాధించే అవకాశం ఉందని అప్పుడు అభ్యర్థులంతా భావించారు.
 
 శాపంగా మారిన పరీక్ష
 అయితే సీశాట్‌తో అనుభవాలు వేరుగా ఉన్నాయి. భాషాపరంగా వివిధ రకాల చదువుల నేపథ్యాల నడుమ 1979 నుంచి కాపాడుకుంటూ వచ్చిన తటస్థ వైఖరిని నాశనం చేసే విధంగా సీశాట్ రూపు దాల్చింది. యూపీఎస్ సీయే సీశాట్ విశ్వసనీయతను దెబ్బతీసింది. ఆప్టిట్యూడ్ టెస్ట్‌ను ప్రవేశపె ట్టడం వెనుక ఉన్న హేతువును బలహీనపరిచింది. సివిల్ సర్వీసెస్ పట్ల అభి రుచితో పాటు, సరైన దృక్పథం ఉన్నవారు కూడా వైదొలగే రీతిలో ప్రశ్నలను రూపొందించడం శోచనీయం. సీశాట్ వ్యతిరేక ఆందోళన ల నేపథ్యంలోనే ఈ అంశంలో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. పరీక్షకు ఏర్పాట్లు పూర్తి కావడంతో ఇప్పుడు కలుగచేసుకోలేమని అత్యున్నత న్యాయ స్థానం ప్రకటించినా, సమస్యలో ఉన్న ప్రతికూలాంశాలు విస్మరించలేనివి.
 
 ప్రాంతీయ భాషల మీద వేటు
 ఆంగ్ల ప్రసార మాధ్యమాలు కోడై కూస్తున్నట్టు సీశాట్ మీద నిరసన అంటే సాధారణ ఇంగ్లిష్ మీద పోరాటం కాదని అంతా అర్థం చేసుకోవాలి. సీశాట్ ను వ్యతిరేకిస్తున్నవారంతా ఇంగ్లిష్‌లో రాయగల కనీస పరిజ్ఞానం ఉన్నవారే. మెయిన్స్‌లో ఉండే తప్పనిసరి ఇంగ్లిష్ ప్రశ్నపత్రాన్ని సమర్థంగా ఎదుర్కొనగ లిగినవారే కూడా. అసలు ఈ కారణంతోనే ఇలాంటి వారిని ప్రాథమిక పరీ క్షలో గట్టెక్కనీయకుండా తప్పిస్తున్నారు. ఇతర విభాగాలలో మంచి పట్టు ఉన్న అభ్యర్థులు కూడా కాంప్రహెన్షన్‌లో తక్కువ మార్కులు సాధించడం వల్ల అపజయం పాలవుతున్నారు. సీశాట్‌లో ఇచ్చే ప్రశ్నలు, అభ్యర్థికి సివిల్ సర్వీసెస్ పట్ల ఉన్న అభిరుచి ఏపాటిదో వెల్లడించేందుకు ఉపకరించేవి కా కుండా, ఇంగ్లిష్ పరిజ్ఞానం ఎంత అన్నది తేల్చడానికే సరిపోతాయన్న రీతిలో ఉంటున్నాయి. జనరల్ స్టడీస్ తక్కువ మార్కులు తెచ్చుకునేలా రూపొం దిస్తూ ఉంటే, సీశాట్ ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అనువుగా రూపొం దుతోంది. సీశాట్‌లో అర్హత సాధించిన వారి మార్కులను పరిశీలిస్తే, మూడింట రెండువంతులు ఇందులోనే సాధిస్తున్నారు. జనరల్ స్టడీస్‌లో తెచ్చుకుంటున్న మార్కులు కేవలం మూడింట ఒక వంతు. 2010లో హిందీతో పాటు, ఇతర ప్రాంతీయ భాషలను మెయిన్స్‌లో రాత పరీక్ష మాధ్యమంగా ఎంచుకుని రాసిన అభ్యర్థులు 4,156 మంది. సీశాట్ ప్రవేశ పెట్టిన 2011లో ఆంగ్లేతర భాషలలో పరీక్ష రాసిన అభ్యర్థుల సంఖ్య 1,682.
 
 కటాఫ్‌ను తగ్గించిన ఆప్టిట్యూడ్
 ఇంతకీ ఇంత ‘ఆప్టిట్యూడ్’ ఉన్న అభ్యర్థులు మెయిన్స్‌లో చూపించిన ప్రతిభ ఎంతటిది? సీశాట్‌ను ప్రవేశ పెట్టాక మెయిన్స్‌లో కటాఫ్ మార్కును దారు ణంగా దించవలసి వచ్చింది. ఉదాహరణకు 2014లో ఇంటర్వ్యూకు అర్హత సాధించిన జనరల్ కేటగిరీ అభ్యర్థులు 1750 మార్కులకు గాను, కనిష్టంగా 564 (32 శాతం) మార్కులు మాత్రమే సాధించారు. 2014 ‘టాపర్’ జనరల్ స్టడీస్‌లో సాధించిన మార్కులు కేవలం 33.8 శాతం. సీశాట్ ప్రవేశపెట్టక ముందు టాపర్లుగా నిలిచిన నాగరాజన్, అద్దంకి శ్రీధర్‌బాబు వంటి వారు జనరల్ స్టడీస్‌లో 70 శాతం మార్కులు సాధించారు. సివిల్ సర్వీసెస్‌కు కీలక మైన జనరల్ స్టడీస్‌లో ప్రతిభ లేని వారు ఇప్పుడు టాపర్లుగా నిలుస్తున్నా రంటే అందుకు కారణం, ఇంగ్లిష్, గణితాలేనని చెప్పకతప్పదు.
 
 సివిల్ సర్వీసెస్ పరీక్ష రాస్తున్న అభ్యర్థులలో ఎక్కువ శాతానికి దేశ సమస్యలపై అవగాహన లేదని యూపీఎస్‌సీ చైర్మన్ డీపీ అగర్వాల్ కొంత కాలం క్రితమే ఆందోళన వ్యక్తం చేశారు. అయితే దేశ, సామాజిక సమస్యల కంటె, ఇంగ్లిష్ భాషా పరిజ్ఞానానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న సీశాట్‌ను ప్రవేశపెట్టడానికి ప్రధాన కారణం ఆయనే. సీశాట్ అమలులోకి వచ్చిన తరు వాత వచ్చిన గణనీయమైన మార్పు - విజేతలలో ఇంజనీరింగ్, మెడిసిన్  నేపథ్యం ఉన్న వారి సంఖ్య విశేషంగా పెరిగింది. 2004 సంవత్సరంతో పోల్చి చూస్తే, 2011 సంవత్సరానికి వీరి సంఖ్య రెట్టింపు కనిపిస్తుంది. ఆ చదువుల నేపథ్యంతో ఐఏఎస్‌కు ఎంపికయ్యే వారి సంఖ్య మూడింట రెండు వంతుల వరకు ఉంది.
 
సీశాట్‌తో మారిన యూపీఎస్‌సీ ఎంపిక తీరు
  2004                       2011

ఇంజనీరింగ్       23.40    41.76
మెడిసిన్           8.39    13.11
సైన్స్                5.30    4.90
హ్యుమానిటీస్    16.56    9.21

 
 సీశాట్‌ను ప్రవేశపెట్టడం వెనుక రహస్య ప్రణాళిక ఉంది. డీపీ అగర్వాల్ 2008లో యూపీఎస్‌సీ బాధ్యతలు స్వీకరించారు. ఐఐటీలో బోధిస్తూ ఈ పద విని చేపట్టిన అగర్వాల్ అన్ని అంశాలను ఇంజనీరింగ్ నేపథ్యంతో ఆలోచిస్తున్నారు. అలాగే ఇంజనీరింగ్, ఐఐఎంల నుంచి సివిల్స్ వైపు అభ్యర్థులను ఆకర్షించే విధంగా పరీక్ష విధానాన్ని మార్చుకుంటూ వచ్చారు. అయితే ఇదంతా ఖన్నా కమిటీ సిఫారసుల మేరకే జరిగాయని ఆయన అంటున్నారు. ఆ కమిటీ అగర్వాల్ సూచనల మేరకే పని చేసింది. ఏ విధంగా చూసినా సీశాట్ గురించి పునరాలోచించవలసిన సమయం వచ్చింది.
 ప్రేమ విఘ్నేశ్వరరావు. కె.
 (వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్)

Advertisement
Advertisement