ఇరుగు పొరుగు దేశాలతో సఖ్యత లేదు ఎందుకు? | Sakshi
Sakshi News home page

ఇరుగు పొరుగు దేశాలతో సఖ్యత లేదు ఎందుకు?

Published Sun, May 28 2017 12:58 AM

ఇరుగు పొరుగు దేశాలతో సఖ్యత లేదు ఎందుకు?

అవలోకనం
దూకుడుగా విస్తరించే స్వభావంగల సామ్రాజ్య రాజ్యం నెహ్రూకు వారసత్వంగా సంక్రమించింది. పైగా దాని సరిహద్దులు తాత్కాలికమైనవి. బ్రిటిష్‌ రాజ్‌ కాలం నాటి భారత్‌ అంటే ఇరుగు పొరుగు దేశాలన్నీ భయపడేవి, అపనమ్మకంతో ఉండేవి. ఆ భయాన్ని, అపనమ్మకాన్ని అవి అధిగమించేలా చేయడంలోనూ, పరస్పర గౌరవం, ప్రయోజనాల ప్రాతిపదికపై నిలిచిన అర్థవంతమైన సంబంధాలను నిర్మించుకోవడంలోనూ మనం విఫలమయ్యాం. ఆ వైఫల్యమే బెల్ట్‌ అండ్‌ రోడ్‌ అంతర్జాతీయ సదస్సు విషయంలో మనల్ని ఏకాకులను చేసింది.

దాదాపు ముప్పయి ఏళ్ల క్రితం విశ్వనాథ్‌ ప్రతాప్‌సింగ్‌ ప్రధానమంత్రి అయినాక శ్రీలంక అధ్యక్షుడు రణసింగె ప్రేమదాసను కలుసుకున్నారు. సౌమ్యుడైన ప్రేమ దాస ‘‘మీరు మీ సైన్యాన్ని ఎప్పుడు వెనక్కు తీసుకుంటారు?’’ అని కలిసిన వెంటనే ప్రశ్నించారు. దీంతో సింగ్‌ ఆశ్చర్యపోయారు. ప్రేమదాస ప్రస్తావించినది తమిళ టైగర్లతో పోరాడటం కోసం భారత సైన్యం శ్రీలంకకు పంపిన భారత శాంతి పరిరక్షక దళం (ఐపీకేఎఫ్‌) గురించి. భారత్‌ అప్పట్లో వేల కొలది జవాన్లను శ్రీలంకలో మోహరించింది. ఆ పోరాటాన్ని మనం లంక ప్రజల కోసం చేస్తున్న త్యాగంగా పరిగణించాం (ఆ పోరాటంలో మన వాళ్లు వెయ్యి మందికి పైగా మరణించారు). అయితే, ఒక దశ తర్వాత లంక ప్రజలు, దాన్ని తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడంగా భావించారని, భారతీయులు తమ దేశాన్ని వదిలి వెళ్లాలని కోరుకున్నారని సింగ్‌ అభిప్రాయం.

ఆ అంతర్యుద్ధం సింహళ జాతీయవాదుల విజయంతో ముగిసింది. అయినా శ్రీలంకపై భారత్‌ ప్రభావం 30 ఏళ్ల క్రితం ఉన్నంతగా నేడు లేదు. శ్రీలంక ప్రజలలో ఎక్కువ మంది  జోక్యందారుగా చూసే దేశం మరేదైనా ఉందంటే అది చైనా. కొలంబో, హంబన్‌తోటలలో చైనీయులు నిర్మిస్తున్న బ్రహ్మాండమైన ఓడ రేవులు భారత్‌ పోటీపడలేన ంతటి భారీ ప్రాజెక్టులు. అయితే, వాటితోపాటూ చైనా అభివృద్ధి నమూనా కూడా అక్కడికి  దిగుమతి అవుతుంది. ఇంచుమించుగా అది మీ భూభాగంపై చైనా వలసలను అనుమతించడమని అర్థం. మీ తాహతుకు తగ్గ లేదా మించిన భారీ రుణాన్ని చైనా నుంచి తీసుకోవడం అని కూడా అర్థం.

చైనీయులు ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన, అతి పెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్టును అమలుచేస్తున్నారు. దాని పేరు ‘ఒన్‌ బెల్ట్‌ ఒన్‌ రోడ్‌’ (ఒకటే ఆర్థిక ప్రాంతం ఒకటే దారి). ‘బెల్ట్‌’ పలు ప్రధాన రహదారుల శ్రేణితో కూడినది కాగా, ‘రోడ్డు’ పలు ఓడ రేవులు, సముద్ర మార్గాలతో కూడినది. చైనా దీనిపై తన దృక్పథాన్ని వివరించడానికి మే నెలలో నిర్వహించిన అంతర్జాతీయ సమావేశాన్ని భారత్‌ బహిష్కరించింది. అయితే, భూటాన్‌ తప్ప మన పొరుగు దేశాలన్నీ... శ్రీలంక, మయన్మార్, బంగ్లాదేశ్, మాల్దీవులు, నేపాల్‌ అన్నీ హాజర య్యాయి.

ఇది, మనల్ని చుట్టుముట్టడం కావచ్చునేమోనని భారత వ్యూహాత్మక వ్యవహారాల గురించి యోచించే బృందంలో భయాలు సైతం తలెత్తాయి. చైనాతో భాగస్వామ్యానికి భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందని ఆ సమావేశానికి హాజ రయ్యేవారందరినీ భారత్‌ హెచ్చరించింది. అయినా ఎవరూ మన మాట పట్టిం చుకోలేదు. ఎందుకు? అనేదే ప్రశ్న. దానికి జవాబు, ఈ వ్యాసంలోని అసలు విష యానికి, అంటే దాదాపు ఇరుగుపొరుగు దేశాలన్నీ భారత్‌ పట్ల విముఖంగా లేదా అనుమానాన్పద దృష్టితోఉన్నాయి అనే సమస్య వద్దకు తిరిగి వచ్చేట్టు చేస్తుంది.  


హిందూ నేపాల్‌లో సైతం భారతీయుల పట్ల ప్రత్యేకమైన ఆదరణ ఏమీ లేదు. కెనడాతో అమెరికాకు ఉన్న అనుబంధం లాంటి సంబంధం ఉన్న పొరుగు దేశం మనకు ఒకటి కూడా లేదు. మన సరిహద్దులన్నీ అమెరికా, మెక్సికో సరి హద్దులలాగా లేదా అంతకంటే అధ్వానంగా ఉన్నట్టు అనిపిస్తాయి. బహుశా తప్పంతా పూర్తిగా పొరుగు దేశాలదే కావచ్చుననీ, మనం ఇతర దేశాల దుర్మా ర్గానికి గురవుతున్న బాధితులమనీ సగటు భారతీయుల అభిప్రాయం. పైగా పొరుగు దేశాల పట్ల మనకున్న పక్షపాత పూరితమైన దృక్పథం దీనికి తోడవు తుంది. బంగ్లాదేశీయులంటే అక్రమంగా వలస వచ్చినవారని, నేపాలీలంటే కావలిదార్లనీ,  పాకిస్తానీలంటే ఉగ్రవాదులనీ మనం విశ్వసిస్తాం.

కొన్నేళ్ల క్రితం నేపాల్‌లో భారత వ్యతిరేక అల్లర్లు చెలరేగి, పలువురు మర ణించారు, ఆస్తి నష్టమూ సంభవించింది. నటుడు హృతిక్‌ రోషన్‌ నేపాలీలను ద్వేషిస్తానని అన్నాడనే వార్త అందుకు కారణం. రోషన్‌ అలాంటి మాటేమీ అన లేదు, ఆ వార్తే ఒక బూటకం. అసలు నేపాలీలు అలా వెంటనే దాన్ని నమ్మేయడం ఏమిటి? అనేదే మనం ప్రశ్నించుకోవాల్సింది. భారత్‌ నేడు తమ దేశాన్ని కొండ ప్రాంతాల ప్రజలు, మైదాన ప్రజలుగా విభజించడానికి ఎత్తులు వేస్తోందని,  కొండ ప్రాంతాలవారికి వ్యతిరేకంగా సుదీర్ఘమైన, బాధాకరమైన దిగ్బంధనాన్ని ప్రేరేపిస్తోందని నేపాల్‌ ఉత్తర ప్రాంత ప్రజలు భావిస్తున్నారు. తమ రాజ్యాంగ ప్రక్రియలో భారత్‌ జోక్యం చేసుకుంటోందని సైతం అనుకుంటున్నారు.

నేపాల్‌ విషయంలో భారత్‌కు సమంజసమైన బెంగలు, ప్రయోజనాలు ఉండటమూ సాధ్యమే. అయితే, ఒక హిందూ దేశాన్ని చైనాకు వ్యతిరేకంగా మనతో నిలుపుకోలేనంతగా నేపాల్‌తో మన సంబంధాలు ముక్క చెక్కలు ఎందుకు అయ్యాయి? చైనాకు వ్యతిరేకంగా మనతో ఉన్న మిత్రుడు ‘భూటాన్‌’ మాత్రమే. అయితే మన మధ్య సంబంధాలు ఇద్దరు సమానుల మధ్య ఉండేవి కావు. నెహ్రూ హయాంలోని భారత్, భూటాన్‌పై ‘మైత్రీ ఒప్పందాన్ని’ రుద్దింది. అది నిజానికి, భూటాన్‌ విదేశాంగ విధానాన్ని వీటో చేసే అధికారాన్ని భారత్‌కు కట్టబెట్టేది. సరిగ్గా చెప్పాలంటే ‘‘విదేశీ వ్యవహారాలకు సంబంధించి భారతదేశపు సలహాల మార్గదర్శకత్వాన్ని  భూటాన్‌ అంగీకరిస్తుంది’’ అని అది పేర్కొంది. కొన్నేళ్ల క్రితం, బహుశా వాజ్‌పేయి హయాంలో గామోసు దాన్ని తొలగించారు.

దూకుడుగా విస్తరించే స్వభావంగల సామ్రాజ్య రాజ్యం నెహ్రూకు వార సత్వంగా సంక్రమించింది. పైగా దాని సరిహద్దులు తాత్కాలికమైనవి. బ్రిటిష్‌ రాజ్‌ కాలం నాటి భారత్‌ అంటే ఇరుగు పొరుగు దేశాలన్నీ భయపడేవి, అపనమ్మకంతో ఉండేవి. ఆ భయాన్ని, అపనమ్మకాన్ని అవి అధిగమించేలా చేయ డంలో, పరస్పర గౌరవం, ప్రయోజనాల ప్రాతిపదికపై నిలిచిన అర్థవంతమైన సంబంధాలను నిర్మించుకోవడంలో మనం విఫలమయ్యాం. ఆ వైఫల్యమే బెల్ట్‌ అండ్‌ రోడ్‌ అంతర్జాతీయ సదస్సు విషయంలో మనల్ని ఏకాకులను చేసింది. మన పొరుగు దేశాలపై ఆర్థిక ప్రభావాన్ని నెరపగలగడంలో మన దేశం ఇంకా చాలా కాలంపాటూ చైనాకు సమ ఉజ్జీగా నిలవలేదు. అయితే అది, మనం ఆ దేశాలకు మంచి మిత్రులుగా కావడాన్ని నిలవరించలేదు.
వ్యాసకర్త కాలమిస్టు, రచయిత
aakar.patel@icloud.com

Advertisement

తప్పక చదవండి

Advertisement