సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వంపై ఒక పార్టీ 11 సార్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం దేశ చరిత్రలో ఇదే తొలిసారని వైఎస్సార్ సీపీ ఎంపీ వరప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం వైఎస్సార్ సీపీ కేంద్ర ప్రభుత్వంపై లోక్సభ స్పీకర్కు 11వ సారి అవిశ్వాస తీర్మాన నోటీసులు అందించింది.
దీనిపై మీడియాతో మాట్లాడిన వరప్రసాద్.. ప్రత్యేక హోదా ఆశ సజీవంగా ఉండటానికి కారణం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోరాటాలేనని అన్నారు. వైఎస్సార్ సీపీ ఇస్తున్న అవిశ్వాస తీర్మానం సభ ఆర్డర్లో లేదని స్పీకర్ సుమిత్ర మహాజన్ చెబుతున్న సంగతి తెలిసిందే.
ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్ సీపీ ఎంపీలు పదవులను త్యాగం చేస్తారని వెల్లడించారు. అనంతరం న్యూఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద ఆమరణ నిరాహార దీక్షకు దిగడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వప్రయోజనాల కోసమే ఢిల్లీకి వచ్చి కేసులు లేకుండా లాబీయింగ్ చేసుకుంటున్నారని ఆరోపించారు.
ప్రత్యేక హోదా పోరాటాన్ని చంద్రబాబు తప్పుదోవ పట్టిస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీలపై కేంద్ర ప్రభుత్వంతో వైఎస్సార్ సీపీ పోరాడుతోందని చెప్పారు. 2014 ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఇచ్చిన హమీలన్నీ నెరవేర్చాలని కోరారు. ప్రత్యేక హోదా పోరాడుతున్న వామపక్షాలకు వైఎస్సార్ సీపీ మద్దతు ఉంటుందని చెప్పారు. ప్రత్యేక హోదా సాధనకు రాజకీయ పార్టీలన్నీ కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు.