సర్వేలన్నీ ముక్తకంఠంతో చెప్తున్న మాట ఇదే! | Sakshi
Sakshi News home page

సర్వేలన్నీ ముక్తకంఠంతో చెప్తున్న మాట ఇదే!

Published Tue, Apr 9 2019 12:59 PM

All Surveys Predict Clear Wave For YSRCP in Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి : తీవ్ర ఆసక్తి రేకిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ప్రజాభిప్రాయం ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నదనే అంశంపై ఇప్పటివరకు వెల్లడైన సర్వేలు.. స్పష్టమైన విషయాన్ని వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని, స్పష్టమైన మెజారిటీతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఇప్పటీవరకు పలు జాతీయ చానెళ్లు, సర్వే సంస్థలు నిర్వహించిన అభిప్రాయ సేకరణలో వెల్లడైంది. అసెంబ్లీ ఎన్నికలోనే కాదు.. లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ స్పష్టమైన ఆధిక్యాన్ని చాటుతుందని, అసెంబ్లీ ఎన్నికల్లో 100కుపైగా సీట్లు సాధించనుండగా.. లోక్‌సభ ఎన్నికల్లోనూ రాష్ట్రంలోని​ 25 స్థానాల్లో 20కిపైగా స్థానాలు గెలువనుందని సర్వే సంస్థలు ముక్తకంఠంతో చాటుతున్నాయి.  సర్వేల వారీగా ఆ వివరాలను ఒకసారి పరిశీలిస్తే..ఈ కిందివిధంగా ఉన్నాయి..

ఏపీ లోక్‌సభ ఎన్నికల సర్వే వివరాలు
సర్వే సంస్థ వైఎస్సార్‌సీపీ  టీడీపీ జనసేన
టైమ్స్‌నౌ-వీఎంఆర్‌ 20 5 0
ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్‌ 20 5 0
ఎన్డీటీవీ    20 5 0
సీపీఎస్‌    21  4 0

*** ప్రముఖ సంస్థ లోక్‌నీతి-సీఎస్‌డీఎస్‌ తాజాగా నిర్వహించిన ప్రీ-పోల్‌ సర్వేలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి 46శాతం ఓట్లు రాగా.. టీడీపీకి కేవలం 36శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. రెండు పార్టీల మధ్య పదిశాతం ఓట్ల వ్యత్యాసం ఉంటుందని సర్వే పేర్కొంది. 

ఏపీ అసెంబ్లీ ఎన్నికల సర్వే వివరాలు
సర్వే సంస్థ    వైఎస్సార్‌సీపీ  టీడీపీ జనసేన  
వీడీపీఏ అసోసియేట్స్‌  106 -118  54 - 68 1-2
సీపీఎస్‌   121 - 130 45 - 54  1-2


జగన్‌ ప్రభంజనం
సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందని సోమవారం (ఏప్రిల్‌ 8వ తేదీన) వెల్లడైన మూడు తాజా ఒపీనియన్‌ పోల్స్‌ సుస్పష్టం చేశాయి. రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి హవా కొనసాగుతోందని, ఆయన నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ.. ఈ ఎన్నికల్లో విజయ దుందుభి మోగిస్తుందని ఈ పోల్స్‌ వెల్లడించాయి. టైమ్స్‌నౌ-వీఎంఆర్‌తోపాటు ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్‌ నిర్వహించిన ఒపీనియన్‌ పోల్స్‌లోనూ రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాలకుగాను 20 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధిస్తుందని వెల్లడైంది. అధికార తెలుగుదేశం పార్టీ కేవలం ఐదు ఎంపీ స్థానాలకు మాత్రమే పరిమితమవు తుందని ఈ రెండు పోల్స్‌ స్పష్టం చేశాయి. అంతేగాక ఈ రెండు పార్టీలకు లభించే ఓట్లలో భారీగా తేడా ఉంటుందని వెల్లడించాయి.
(చదవండి: జగన్‌ ప్రభంజనం)


వీడీపీఏ అసోసియేట్స్‌ సర్వేలో వైసీపీకి 106-118 సీట్లు
మరోవైపు వీడీపీఏ అసోసియేట్స్‌ రాష్ట్రంలో నిర్వహించిన సర్వేలో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టిస్తుందని తేలింది. ఆ పార్టీ మొత్తం 43.85 ఓట్ల శాతంతో 106 నుంచి 118 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటుందని వెల్లడైంది. 40 శాతం ఓట్లతో టీడీపీ 54 నుంచి 68 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటుందని ఈ సర్వే తెలిపింది. పవన్‌కల్యాణ్‌ నేతృత్వంలోని జనసేన 9.80 శాతం ఓట్లతో ఒకటి నుంచి మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలిచే అవకాశముందని పేర్కొంది. బీజేపీ 2.40 శాతం ఓట్లు, కాంగ్రెస్‌ 1.65 శాతం ఓట్లు సాధించినా సీట్లు రావని తేలింది. చంద్రబాబు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజాభిమానాన్ని కోల్పోయిందని, అదే సమయంలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ సమర్థ పరిపాలన అందించగలరన్న భరోసా ప్రజల్లో నెలకొందని ఈ ఒపీనియన్‌ పోల్స్‌ స్పష్టంగా సూచిస్తున్నాయి.

గెలుపు జగన్‌దేనంటున్న టైమ్స్‌నౌ-వీఎంఆర్‌ పోల్‌..
టైమ్స్‌నౌ ఏపీలో నెల రోజుల వ్యవధిలో రెండోసారి నిర్వహించిన ఓపీనియన్‌ పోల్‌లోనూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయదుందుభి మోగిస్తుందని తేల్చింది. 43.70 శాతం ఓట్లతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి 20 ఎంపీ సీట్లు, 35.10 శాతం ఓట్లతో టీడీపీకి ఐదు సీట్లు వస్తాయని వెల్లడించింది. కాంగ్రెస్‌కు 2.1 శాతం, బీజేపీకి 5.7 శాతం ఓట్లు వస్తాయని, ఇతరులకు 13.4 శాతం ఓట్లు వచ్చినప్పటికీ ఎంపీ సీట్లు రావని తేల్చింది. గత నెల మార్చి 22 నుంచి ఈ నెల నాలుగో తేదీ వరకూ దేశవ్యాప్తంగా 960 పోలింగ్‌బూత్‌లలో టైమ్స్‌ నౌ చానల్‌-వీఎంఆర్‌ సంస్థ ఈ ఒపీనియన్‌ పోల్‌ నిర్వహించింది. దీనికి ముందు గత మార్చి నెలలో ఇదే టీవీ చానల్‌ నిర్వహించిన ఒపీనియన్‌ పోల్‌లో వైఎస్సార్‌సీపీ 48.80 శాతం ఓట్లతో 22 ఎంపీ సీట్లు గెలుచుకుంటుందని, 38.40 శాతం ఓట్లతో టీడీపీ మూడు సీట్లు గెలుచుకుంటుందని వెల్లడించింది. అత్యధిక ఎంపీ స్థానాలు గెలుచుకోవడం ద్వారా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించబోతున్నారని స్పష్టం చేసింది.

ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్‌ ‘పోల్‌’లోనూ..
ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్‌ నిర్వహించిన ఒపీనియన్‌ పోల్‌లోనూ వైఎస్సార్‌సీపీకి ఘన విజయం తథ్యమని స్పష్టమైంది. జగన్‌ సారథ్యంలోని వైఎస్సార్‌సీపీ 20 ఎంపీ సీట్లను సాధిస్తుందని, అదే సమయంలో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లను గెలుచుకుంటుందని ఈ సర్వేలోనూ వెల్లడైంది. దేశవ్యాప్తంగా 305 ఎంపీ స్థానాల పరిధిలో ఏప్రిల్‌ 1 నుంచి ఆరో తేదీ వరకూ ఈ ఒపీనియన్‌ పోల్‌ నిర్వహించారు. మొత్తం 36,600 మంది నుంచి అభిప్రాయాలు సేకరించారు. అందులో 19,125 మంది పురుషులు, 17,475 మంది మహిళలు ఉన్నారు.

సీపీఎస్‌ సర్వేలో వైఎస్సార్‌సీపీ హవా
ఏపీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టించనుందని సెంటర్‌ ఫర్‌ సెఫాలజీ స్టడీస్‌(సీపీఎస్‌) సర్వే స్పష్టం చేసింది. ఆ పార్టీ ఏకంగా 121 నుంచి 130 ఎమ్మెల్యే సీట్లలో విజయభేరి మోగించి అధికారంలోకి రానుందని తేల్చిచెప్పింది. వైఎస్సార్‌సీపీ 21 ఎంపీ స్థానాల్లోనూ విజయం సాధించనుందని పేర్కొంది. అధికార టీడీపీ కేవలం 45 నుంచి 54 ఎమ్మెల్యే సీట్లు, 4 ఎంపీ సీట్లకే పరిమితం కానుందని వెల్లడించింది. జనసేన పార్టీకి కేవలం ఒకట్రెండు ఎమ్మెల్యే సీట్లు దక్కే అవకాశం ఉందని ఆ సర్వే తేల్చిచెప్పింది. ప్రముఖ ఎన్నికల విశ్లేషకుడు డా.వేణుగోపాలరావు నేతృత్వంలో సీపీఎస్‌ సంస్థ ఎన్నికల సర్వేల నిర్వహణలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. 
(చదవండి: ఏపీలో వైఎస్సార్‌సీపీ హవా)

‘ఫ్యాన్‌’ ప్రభంజనం!
కేంద్రంలో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంలో ప్రాంతీయ పార్టీలే కీలకం కానున్నాయని.. దేశవ్యాప్తంగా 106 ఎంపీ సీట్లలో విజయం సాధించడం ద్వారా ఢిల్లీ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలు నిర్ణయాత్మక పాత్ర పోషించనున్నట్లు జాతీయ చానెల్‌ ఎన్డీటీవీ గత ఆదివారం అంచనా ఫలితాలను వెల్లడించింది. ఏపీలో 25 ఎంపీ సీట్లకుగానూ వైఎస్సార్‌సీపీ 20 పార్లమెంట్‌ స్థానాల్లో ఘన విజయం సాధించి ప్రాంతీయ పార్టీల్లో మూడో అతి పెద్ద పార్టీగా నిలుస్తుందని ఎన్డీటీవీ అంచనా వేసింది. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ 30, తమిళనాడులో డీఎంకే 25 ఎంపీ సీట్లలో విజయబావుటా ఎగురవేస్తాయని తెలిపింది. ఒడిశాలో బిజూ జనతాదళ్‌ 16 సీట్లు, తెలంగాణలో టీఆర్‌ఎస్‌ 15 సీట్లు సాధించే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో మొత్తం 106 ఎంపీ సీట్లతో ప్రాంతీయ పార్టీల మద్దతు కేంద్రానికి కీలకం కానుంది.

(చదవండి : ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం)


ఇతర సర్వేల్లోనూ అవే ఫలితాలు..!

ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ఎన్నికల అనంతరం ప్రబల శక్తిగా ఆవిర్భవించి దేశ రాజకీయాల్లో సైతం కీలక పాత్ర పోషించే అవకాశం ఉన్నట్లు పలు జాతీయ చానెళ్లు ఇప్పటికే తమ సర్వేల ద్వారా అంచనా వేయడం తెలిసిందే. ఏపీలో వైఎస్సార్‌సీపీ స్వీప్‌ చేస్తుందని, తిరుగులేని విజయం సాధించి లోక్‌సభలో నాలుగో అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని ఇండియా టీవీ సర్వేలో తేలింది. ప్రజలు స్పష్టంగా వైఎస్సార్‌సీపీ వైపే మొగ్గు చూపుతున్నారని పేర్కొంది. ఇతర జాతీయ ఛానళ్లు కూడా వైఎస్సార్‌సీపీ 20 - 22 ఎంపీ సీట్లు గెలుచుకుంటుందని తమ సర్వేల్లో వెల్లడైనట్లు ఇప్పటికే ప్రకటించాయి.

టైమ్స్‌ నౌ, సీఎన్‌ఎన్‌ న్యూస్‌ 18, ఇండియా టుడే తదితర జాతీయ చానెళ్లు వైఎస్‌ జగన్‌పై ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేశాయి. ప్రముఖ జర్నలిస్టులు రాజ్‌దీప్‌ సర్దేశాయి, బర్కాదత్, నావికా కుమార్‌ తదితరులు వైఎస్‌ జగన్‌తో సంభాషించి ఏపీతోపాటు దేశ రాజకీయాల్లో ఆయన అనుసరించనున్న వైఖరిని తెలుసుకునేందుకు ఆసక్తి చూపారు. అతి త్వరలోనే వైఎస్‌ జగన్‌ దేశ రాజకీయాల్లో పోషించనున్న కీలక పాత్రకు ఇవన్నీ సంకేతాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

దేశ రాజకీయాల్లో జగన్‌దే కీలక పాత్ర..
ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో అద్భుత ఫలితాలను సాధించడం ద్వారా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారని రెండు జాతీయ చానళ్లు నిర్వహించిన ఒపీనియన్‌ పోల్స్‌ స్పష్టం చేశాయి. టైమ్స్‌నౌ-వీఎంఆర్‌తోపాటు ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్‌ నిర్వహించిన ఒపీనియన్‌ పోల్‌లోనూ ఏపీలో వైఎస్సార్‌సీపీ.. టీడీపీకి అందనంత స్థాయిలో సీట్లు కైవసం చేసుకోవడమేగాక దేశంలో బీజేపీ, కాంగ్రెస్, మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీల తర్వాత ఎక్కువ స్థానాలు సాధిస్తుందని తేలింది. తద్వారా వైఎస్సార్‌సీపీ నాలుగో అతి పెద్ద పార్టీగా మారి జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారుతుందని ఈ రెండు సర్వేలు స్పష్టం చేశాయి.
(చదవండి: జాతీయ శక్తిగా వైఎస్‌ జగన్‌)

పచ్చ మీడియా డొల్లతనాన్ని బయటపెట్టిన లోక్‌నీతి
ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయమని తేలడంతో.. బోగస్‌ సర్వేలతో ప్రజలను బురిడీ కొట్టించడానికి ఆ పార్టీ అనుకూల ఎల్లో మీడియా ప్రయత్నించింది. టీడీపీకి ఏకంగా 126 నుంచి 135 ఎమ్మెల్యే సీట్లు వస్తాయని, 18 నుంచి 22 ఎంపీ సీట్లు గెలువబోతున్నదని ప్రముఖ సంస్థ లోక్‌నీతి-సీఎస్‌డీఎస్‌ సర్వేలో తేలినట్టు ఆంధ్రజ్యోతి పత్రిక బూటకపు సర్వే ప్రకటించడంతో.. ఆ పత్రిక నీతిమాలిన జర్నలిజంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ కథనాన్ని గతంలోనే ఖండించిన లోక్‌నీతి-సీఎస్‌డీఎస్‌ సంస్థ తాజాగా మంగళవారం వెల్లడించిన ప్రీ-ఫోల్‌ సర్వేలోనూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత వస్తుందని వెల్లడించింది. ఓట్లపరంగా చూసుకుంటే వైఎస్సార్‌సీపీకి 46శాతం ఓట్లు వస్తాయని, టీడీపీకి కేవలం 36శాతం ఓట్లే వస్తాయని, రెండు పార్టీల మధ్య 10శాతం ఓట్ల తేడా ఉంటుందని లోక్‌నీతి-సీఎస్‌డీఎస్‌ తాజా ప్రీ-పోల్‌ సర్వేలో స్పష్టం చేసింది. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సర్వే చేసిన ఈ సంస్థ ఎన్డీయే మెజారిటీ మార్క్‌ను దాటడం కష్టమేనని, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 263 నుంచి 283 స్థానాలు వస్తాయని, కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏకు 115-135 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇతర ప్రాంతీయ పార్టీలకు 135 నుంచి 155 స్థానాలు సాధించి.. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించనున్నారని స్పష్టం చేసింది.
(చదవండి: తోకపత్రిక దొంగ సర్వే)


ప్రముఖ సంస్థ లోక్‌నీతి పేరుతో ప్రచురించిన దొంగసర్వే బెడిసికొట్టినా.. వెనుకకుతగ్గని ఆంధ్రజ్యోతి.. మరోసారి తన చానెల్‌ ఓ ఫేక్‌ సర్వేను వండివార్చింది. కార్పొరేట్‌ చాణక్య పేరుతో ఈసారి కొత్త సంస్థను తెరపైకి తెచ్చి.. టీడీపీ ఏకంగా 101 అసెంబ్లీ సీట్లు గెలుస్తుందని, ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీకి 71 సీట్లు.. జనసేన మూడు సీట్లు గెలుస్తుందని మరో బోగస్‌ కథనాన్ని వండివార్చింది. అయితే వారు పేర్కొన్న కార్పొరేట్‌ చాణక్య సంస్థ గురించి ఇంటర్నెట్‌లో ఆరా తీయగా.. ఎక్కడా ఎలాంటి వివరాలు లభించలేదు. మరోవైపు తమ పేరును పోలి ఉండేవిధంగా ‘కార్పొరేట్‌ చాణక్య’  అనే పేరుతో ఫేక్‌ సర్వేను చేయడంపై ప్రముఖ సర్వే సంస్థ మిషన్‌ చాణక్య మండిపడింది. తమ పేరును బద్నాం చేసి.. దొంగ సర్వేలను ప్రచురించమే కాకుండా.. తమ ట్రాక్‌ రికార్డును సైతం కాపీ కొట్టారని  ఆ సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆంధ్రజ్యోతి పత్రికలో ఎవరీ చాణక్య అంటూ ప్రచురించిన ట్రాక్‌ రికార్డు వాస్తవానికి మిషన్‌ చాణక్యదని స్పష్టం చేసింది. ఆంధ్రజ్యోతి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
చదవండి : మళ్లీ అడ్డంగా బుక్కైన తోక చానల్‌
చదవండి : ఆంధ్రజ్యోతి ఫేక్‌ సర్వే.. మండిపడ్డ మిషన్‌ చాణక్య

Advertisement

తప్పక చదవండి

Advertisement