ఏపీ అసెంబ్లీ; బీజేపీ వినూత్న నిరసన | Sakshi
Sakshi News home page

ఏపీ అసెంబ్లీ; బీజేపీ వినూత్న నిరసన

Published Thu, Sep 6 2018 9:55 AM

Andhra Pradesh BJP MLAs Protest - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభా సమావేశాలు ప్రారంభం నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యేలు వినూత్న నిరసనకు దిగారు. సచివాలయానికి బీజేపీ ప్రజా ప్రతినిధులు గొడుగులు పట్టుకొని, రెయిన్‌ కోట్లు ధరించి వచ్చారు. వర్షాలకు సచివాలయంలో నీరు లీకవుతుండటం పట్ల వారు ఈవిధంగా నిరసన తెలిపారు. సుమారు వెయ్యి కోట్లు ఖర్చు చేసినా అసెంబ్లీ, సచివాలయంలో లీకులు ఆగకపోవడంతో ప్రభుత్వ నిర్లక్ష్యంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

చిన్నపాటి వర్గానికి అసెంబ్లీ లోకి నీరు వస్తున్నందుకే తడవకుండా ఇలా వచ్చామని ఎమ్మెల్సీ మాధవ్ తెలిపారు. వర్షం పడితే తమ పరిస్థితి ఎలా ఉంటుందోనన్న భయంతో ఈవిధంగా రావాల్సి వచ్చిందన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా చదరపు అడుగు కు 10 వేలు ఇచ్చి తాత్కాలిక అసెంబ్లి నిర్మాణం ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ప్రజాధనం దుర్వినియోగం చేయడంలో చంద్రబాబు మాస్టర్ డిగ్రీ చేశారని మండిపడ్డారు. హడావుడిగా నిర్మాణం చేపట్టడంతోనే ఈ దుస్థితి వచ్చిందన్నారు.

కాగా, ఏడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరపాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. ఈ నెల 6, 7, 10, 11, 17, 18, 19 తేదీల్లో సభ జరగనుంది. బీఏసీ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ విప్‌లు, బీజేపీ నేత విష్ణుకుమార్‌ రాజు హాజరయ్యారు. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లేకుండానే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అన్హరత వేటు వేస్తే.. ఆ వెంటనే అసెంబ్లీకి హాజరవుతామని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు బుధవారం ప్రకటించారు.

Advertisement
Advertisement