సాక్షి, న్యూఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీకి గుడ్బై చెప్పి కాంగ్రెస్ గూటికి చేరిన ఎమ్మెల్యే ఆదర్శ్ శాస్త్రి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ద్వారక్ నియోజకవర్గ టికెట్ను తిరిగి తనకు ఇచ్చేందుకు కేజ్రీవాల్ రూ.10 నుంచి15 కోట్లు డిమాండ్ చేశారని ఆరోపించారు. దీంతో తాను షాక్కు గురయ్యానని, అంత డబ్బు కేజ్రీవాల్కు ఇచ్చేందుకు నిరాకరించడంతో తనకు టికెట్ దక్కలేదని వాపోయారు. తన స్థానంలో వినయ్ మిశ్రాకు ద్వారక్ స్థానం కేటాయించారని తెలిపారు. ఆదర్శ్ వ్యాఖ్యలు ఢిల్లీ రాజకీయాల్లో పెను దుమారాన్ని సృష్టిస్తున్నాయి. ఈ ఆరోపణలను ఆప్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. (మా నాన్నను గెలిపించండి: సీఎం కుమార్తె)
మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మనవడు, సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదర్శ్ శాస్త్రి ఆప్కి గుడ్బై చెప్పి, శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయ తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన... ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై విమర్శలు గుప్పించారు. శాసనసభ్యులను కలిసేందుకు కేజ్రీవాల్ సమయం కూడా ఇవ్వడం లేదని, నియంతగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. కేజ్రీవాల్ టికెట్ పంపిణీని వ్యాపారంగా మార్చారని విమర్శించారు. పౌరసత్వ సవరణ చట్టంపై అభిప్రాయం చెప్పమని కేజ్రీవాల్ను కోరగా ఆయన ముందుకు రాలేదని ఆదర్శ్ పేర్కొన్నారు. (హస్తం గూటికి చేరిన ఆదర్శ్ శాస్త్రి)