న్యూఢిల్లీ: ఆగస్టు 15 నుంచి 30 వరకు బీజేపీ సామాజిక న్యాయ పక్షోత్సవాలను నిర్వహించనుంది. అలాగే వచ్చే ఏడాది నుంచి ఆగస్టు 1 నుంచి 9 వరకు సామాజిక న్యాయ వారోత్సవాలను కూడా ఆ పార్టీ నిర్వహించనుంది. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ మేరకు పిలుపునిచ్చారు.
ఎన్సీబీసీకి రాజ్యాంగ హోదా కల్పించే బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలపడం, ఎస్సీ ఎస్టీలపై దురాగతాల నివారణకు సంబంధించిన మరో బిల్లును కూడా లోక్సభ ఆమోదించిన నేపథ్యంలో పక్ష, వారోత్సవాలను పార్టీ నేతలు, కార్యకర్తలు నిర్వహించాలని మోదీ కోరారు. అనంతరం ఓబీసీ కులాలకు చెందిన కొందరు ఎంపీలు మోదీకి సన్మానం చేశారు. సామాజిక న్యాయం, సామాజిక సామరస్యాల కోసం అంకితమైన సమావేశాలుగా తాజా పార్లమెంటు సమావేశాలు నిలిచిపోతాయని మోదీ అన్నారు. ఓబీసీలకు వారి హక్కులను తెలియజెప్పాలనీ, ఓబీసీల సంక్షేమం కోసం కృషి చేయాలని మోదీ వారికి సూచించారు.