Sakshi News home page

‘తెలంగాణాలో టీడీపీ, కాంగ్రెస్‌ కనుమరుగే’

Published Thu, Apr 11 2019 7:52 PM

BJP Telangana Chief Laxman Slams TRS Government And Congress Leaders In Hyderabad - Sakshi

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా ముగియడం చాలా సంతోషంగా ఉందని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కె. లక్ష్మణ్‌ తెలిపారు. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాయలంలో గురువారం లక్ష్మణ్‌ విలేకరులతో మాట్లాడారు. ఈ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ షా, ముఖ్యనాయకులు పాల్గొన్నారని, వారందరికీ తన ధన్యావాదాలన్నారు. పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్‌ శాతం ఎక్కువగా నమోదైందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో తక్కువ శాతం పోలింగ్‌ నమోదు అయ్యిందంటే ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని తెలుస్తోందన్నారు.

ఈ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో టీడీపీ పూర్తిగా గల్లంతు కానుందని, కాంగ్రెస్‌ కనుమరుగు కాబోతుందని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌, బీజేపీ మాత్రమే ఉంటాయని అభిప్రాయపడ్డారు.  తాము అనుకున్న వాటి కంటే ఎక్కువ సీట్లు గెలవబోతున్నామని చెప్పారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబానికి ఈ ఎన్నికలు చేదు అనుభవాన్ని మిగల్చనున్నాయని విమర్శించారు. వచ్చే నెల 23 తర్వాత నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడబోతోందని వ్యాఖ్యానించారు. 


పోలీసుల ఓవరాక్షన్‌
బీజేపీకి చెందిన పార్టీ డబ్బులు డ్రా చేస్తే పోలీసులు ఓవర్‌ యాక్షన్‌ చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ ఈ ఎన్నికల్లో ఉనికికి చాటుకునే ప్రయత్నం చేసిందే కానీ పోరాడలేకపోయిందన్నారు. ఈ ఎన్నికల తర్వాత పెద్ద ఎత్తున కాంగ్రెస్‌ నాయకులు బీజేపీలో చేరుబోతున్నారని చెప్పారు. బీజీపీ మాత్రమే టీఆర్‌ఎస్‌ పార్టీకి దీటైన ప్రత్యామ్నాయ పార్టీ అని వ్యాఖ్యానించారు.  రెండు రాష్ట్రాల్లో ఇద్దరు చంద్రులకు ప్రజలు గుణపాఠం చెప్పబోతున్నారని జోస్యం చెప్పారు. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించిన ఈసీకి అభినందనలు తెలియజేస్తున్నట్లు వెల్లడించారు.

బీజేపీ సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఓటమి భయంతోనే మా డబ్బుల్ని సీజ్‌ చేశారని అన్నారు. తెలంగాణాలో మద్యం ఏరులైపారిందని, డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కొన్ని ప్రాంతాల్లో మా కార్యకర్తలపై దాడులు చేశారని ఆరోపించారు. మా పార్టీ డబ్బుల్ని లీగల్‌ మనీ అని ఇన్‌కమ్‌టాక్స్‌ అధికారులే క్లియరెన్స్‌ ఇచ్చారని చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement