నెహ్రూ నగర్ (గుంటూరు): చంద్రబాబు యూటర్న్ రాజకీయాలతో కేంద్ర ప్రభుత్వం హోదాపై నిర్లక్ష్యధోరణి అవలంబిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అ«ధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదాపై ఐదో రోజు ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మార్కెట్ సాయి నేతృత్వంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అప్పిరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షను చంద్రబాబు ఏనాడు పరిగణలోకి తీసుకోలేదన్నారు. గడచిన 4 ఏళ్లుగా అధికారాన్ని అనుభవించారే తప్పా ప్రజలకు ఇచ్చిన హామీల్ని ఏమాత్రం పట్టించుకోలేదని ఆయన ధ్వజమెత్తారు.
ప్రత్యేక హోదాతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ముందంజలో ఉంటుందని విశ్వసించిన వై.ఎస్. జగన్మోహన్రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై అలుపెరుగని పోరాటాలు చేస్తున్నారని పేర్కొన్నారు. పార్టీలు, జెండాలను పక్కన పెట్టి సమష్టిగా హోదా సాధనకు పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల భాగస్వామ్య పోరాటాలతో కేంద్ర ప్రభుత్వం సైతం తలోగ్గాల్సిందేనని స్పష్టం చేశారు. ఇప్పటికైనా హోదాపై టీడీపీ కట్టుకథలు కట్టిపెట్టి పోరాడే పార్టీలతో కలసిరావాలని, లేనిపక్షంలో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. దీక్షల్లో పార్టీ నేతలు శ్యామ్, నాగిరెడ్డి, గోపి, అజయ్ యాదవ్, నాగూర్, కంభంపాటి రాజా, కామిశెట్టి రామాంజీ, అనుబంధ విభాగాలు, డివిజన్ అధ్యక్షులు పాల్గొన్నారు.