సాక్షి, హైదరాబాద్: కంది కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.4,600కు పెంచాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి శనివారం డిమాండ్ చేశారు. ప్రస్తుతం కందులకు రూ. 2 వేలు కూడా రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దళారీలు రైతుల రక్తాన్ని తాగుతుంటే రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదన్నారు.
ఆర్మూర్లో ఎర్రజొన్న రైతులు చేస్తున్న ఆందోళనతోనైనా ప్రభుత్వం కళ్లు తెరవాలన్నారు. టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా మద్దతు ధరల కోసం స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలని కోరారు. శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదం పొందిన వ్యవసాయ రుణ విమోచన కమిషన్ను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. మద్దతు ధరలపై నిర్లక్ష్యం వహిస్తే రైతు ఉద్యమాలు మరింత ఉధృతంగా జరుగుతాయని చాడ హెచ్చరించారు.