సాక్షి, హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరో బాంబు పేల్చారు. నిన్నటికి నిన్న హైదరాబాద్ను నేను కట్టలేదు.. సైబరాబాద్ను మాత్రమే నిర్మించానని చెప్పుకున్న ఆయన.. తాజాగా మాట మార్చారు. ఆధునిక తెలంగాణ సృష్టికర్తను తానేనంటూ బడాయి చెప్పుకున్నారు. అనూహ్యంగా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని తెలంగాణ ఎన్నికల బరిలోకి దిగిన చంద్రబాబు ఓటర్లను ఆకట్టుకోవడానికి విశ్వప్రయత్నాలే చేస్తున్నారు. ప్రపంచపటంలో హైదరాబాద్ను చేర్చింది తానేనని చెప్పుకుంటున్న బాబు తాజాగా మరో ముందుడుగేసి ఆధునిక తెలంగాణ సృష్టికర్త తానేనంటూ ప్రకటించుకున్నారు.
హైదరాబాద్లో టీడీపీ పోటీ చేస్తున్న స్థానాలలో అభ్యర్థులకు మద్దతుగా చంద్రబాబు గురువారం సాయంత్రం రోడ్ షోలు నిర్వహించారు. దీనిలో భాగంగా శేరిలింగపల్లిలో రోడ్ షో అనంతరం ఆయన చేసిన ప్రసంగం అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది. ఎప్పటిలాగే హైదరాబాద్, సైబరాబాద్లను నిర్మించింది తానేనని చెబుతూ ప్రసంగం ప్రారంభించిన చంద్రబాబు.. ఔటర్ రింగ్ రోడ్, విమానాశ్రయం తానే నిర్మించానని పేర్కొన్నారు. కానీ టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత దివంగత సీఎం వైఎస్సార్ హయంలో ఔటర్ రింగ్ రోడ్, శంషాబాద్ విమానాశ్రయం నిర్మించిన విషయం తెలిసిందే. అదే విధంగా తెలంగాణను తానే అభివృద్ధి చేశానని, ఆధునిక తెలంగాణ సృష్టికర్తను తానేనని చంద్రబాబు ప్రకటించుకోవడం సభికులను విస్మయపరిచింది.
ఇప్పటికే తెలంగాణలో చంద్రబాబు ప్రచారంపై ఉద్యమకారులు మండిపడుతున్న నేపథ్యంలో ఆయన మరింత బడాయికి పోవడం సోషల్ మీడియాలో విమర్శలకు తావిస్తోంది. ప్రస్తుతం చంద్రబాబు ప్రసంగం సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ‘ఇంకా నయం తెలంగాణ తెచ్చింది తానేనని చెప్పుకోలేదు’ ‘తెలంగాణ కోసం పోరాటం చేయమని కేసీఆర్కు చెప్పింది తానేనని చంద్రబాబు ప్రకటించలేదేంటి’ అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. చంద్రబాబు ఇలానే మాట్లాడుతూ పోతే మహాకూటమికి ఇక ఓట్లు పడినట్లేనని నెటిజన్లు చమత్కరిస్తున్నారు.