సాక్షి, చిత్తూరు: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జిల్లాలో సోమవారం నిర్వహించిన బహిరంగసభలు, రోడ్షోలు వెలవెలబోయాయి. స్థానిక నేతలు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలను తరలించాలని భావించినా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువులో బహిరంగసభ, చిత్తూరులోని డీకేఆదికేశవులు మార్గ్లో నిర్వహించాల్సిన రోడ్షోను రద్దు చేశారు. బంగారుపాళ్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు పెద్దగా స్పందన లేకపోవడంతో అత్తెసరు మాటలతో సరిపెట్టారు. చిత్తూరులో నిర్వహించిన రోడ్షోకు కూడా జనం కరువయ్యారు. సీఎం వస్తున్నారని తెలిసినా అటు పక్క వీధుల్లో ఉండే వారు కనీసం చూడటానికి కూడా రాకపోవడం గమనార్హం. చుట్టు పక్కల గ్రామాల నుంచి పది, పన్నెండేళ్ల పిల్లలను సైతం సభకు తరలించారు. వారిని రోడ్డుపైనే కూర్చోబెట్టారు. పిల్లలను వాళ్ల ఊళ్లకు తరలించడానికి సరైన ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బందులకు గురయ్యారు.
ప్రతిపక్షంపై విమర్శలతోనే సరి..
ఈ ఐదేళ్లలో ప్రజలకు ఏం ఒరగబెట్టామో చెప్పుకోకుండా ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ను విమర్శించడానికే సీఎం ఎక్కువ సమయం కేటాయించారు. ఈ ఐదేళ్లు చేసిన విమర్శలే చేస్తుండడంతో.. ఎం చెబుతాడో వినడానికి వచ్చిన కాస్త జనం కూడా మెల్లగా జారుకున్నారు. మోదీ రాష్ట్రానికి ఏం చేయలేదని మొసలి కన్నీరు కార్చారు. నాలుగు సంవత్సరాల పాటు మోదీతో అంటకాగిన తరువాత విమర్శలు చేయడం ఎంత వరకు సబబు అని జనాలు అనుకుంటూ ఇళ్లకు బయలుదేరారు.
చిత్తూరుకు ఒక్క హామీ ఇవ్వలేదు
చిత్తూరు జిల్లాకు సీఎం ఒక్క హామీ కూడా ఇవ్వలేదు. పాల డెయిరీ, చక్కెర ఫ్యాక్టరీల గురించి కనీస ప్రస్తావన లేదు. ఎప్పటినుంచో చెబుతున్న హామీలే మళ్లీ.. మళ్లీ చెప్పడంతో చిత్తూరు ప్రజలు విసుగుచెందారు. హైరోడ్డు బాధితుల గురించి భరోసా ఇవ్వలేదు. దీంతో ఆ వర్గాలు నిరాశకు గురయ్యాయి. మామిడి రైతులను ఆదుకున్నామని ఘనంగా ప్రకటించుకున్నారు. అయితే ప్రభుత్వం ప్రకటించిన సబ్సిడీ ఇప్పటికీ రైతులకు చేరకపోవడం గమనార్హం. చిత్తూరులో ఇంటింటికీ నీరిస్తామని హామీ ఇచ్చారు.