ఏలూరు టౌన్: ‘నీ కన్నా దోపిడీ చేసిన నాయకుడు ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారా.. పోలవరం మట్టి గురించి నువ్వా మాట్లాడేది.. కొల్లేరు చెరువుల దందా, పోలవరం మట్టి, గ్రావెల్, ఇసుక అక్రమంగా అమ్ముకుని ఎన్నికోట్లు అవినీతికి పాల్పడ్డావో అందరికీ తెలుసు...2014లో నీ ఆస్తి ఎంత ? నేడు నీ ఆస్తి ఎంత.. వీటిపై బహిరంగ చర్చకు సిద్ధమా..? అంటూ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేనికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు ఘంటా ప్రసాదరావు, మండల అధ్యక్షులు అప్పన ప్రసాద్ సవాల్ విసిరారు. ఈ మేరకు మంగళవారం మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన టీడీపీ ప్రభుత్వానికి, నీకు మా నాయకుడిపై విమర్శలు చేసే అర్హత ఉందా అని ప్రశ్నించారు.
బీజేపీతో చీకటి ఒప్పందం చేసుకున్నది మీరు కాదా అని నిలదీశారు. పోస్టర్లు వేసి నీ బూతు పురాణాలు అన్నీ చూపిస్తామని హెచ్చరించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పేదల సంక్షేమానికి ఆరోగ్యశ్రీ, 108, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలు పక్కాగా అమలు చేస్తే వాటిని నాశనం చేసిన ఘనత మీ ముఖ్యమంత్రిదని విమర్శించారు. గ్రామపంచాయతీ నిధులతో గ్రామాల్లో చిన్నచిన్న పనులు చేసేసి అదే నా ప్రగతి చెప్పుకోవడమే నీ గొప్పా అని ఎద్దేవా చేశారు. డ్వాక్రా మహిళలను అసభ్య పదజాలంతో తిట్టటం, వృద్ధులు, దివ్యాంగులపై చేయి చేసుకోవడం, ప్రభుత్వ అధికారులపై దౌర్జన్యాలకు పాల్పడటం వంటి నీచమైన చరిత్ర నీతికాదా అని చింతమనేనిపై ధ్వజమెత్తారు. 2019 ఎన్నికల్లో నీకు గుణపాఠం చెప్పటానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. నీ అరాచకాలు ఎంతో కాలం సాగవన్నారు.