ప్రతిపక్షాల అభ్యర్థి తృణమూల్‌ నాయకుడు | Sakshi
Sakshi News home page

ప్రతిపక్షాల అభ్యర్థి తృణమూల్‌ నాయకుడు

Published Wed, Jun 27 2018 3:54 PM

Congress Accepts TMC Leader  For Rajya Sabha Dept Chairmen  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : త్వరలో ఖాళీ కానున్న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ పదవి కోసం ప్రతిపక్షాలు, అధికార పక్షాల మధ్య గట్టి పోటీ నెలకొంది. ప్రస్తుత రాజ్యసభ చైర్మన్‌ పీజే కురియన్‌ 2012లో డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైయ్యారు. కురియన్‌ పదవీ కాలం జులై 2తో ముగియనున్న విషయం తెలిసిందే. 2019 లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో మిత్రపక్షాల నుంచి అభ్యర్థిని పోటీలో నిలిపేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్ధిగా తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ సుఖెండు శేఖర్‌ రాయ్‌ను నిలబెట్టాలని కాంగ్రెస్‌ భావిస్తున్నట్లు సమాచారం.

245 మంది సభ్యులున్న రాజ్యసభలో ప్రస్తుతం కాంగ్రెస్‌కు 51 మంది సభ్యులు ఉన్నారు. బీజేపీకి రాజ్యసభలో పూర్తిస్థాయి మెజార్టీకి లేకపోవడంతో ప్రతిపక్షాలను ఏకం చేసి వారికి విజయం దక్కకుండా చేయాలని కాంగ్రెస్‌ భావిస్తోంది.డిప్యూటీ చైర్మన్‌ పదవి కోసం ప్రాంతీయ పార్టీలు టీఆర్‌ఎస్‌, బీజు జనతా దళ్‌(బీజేడీ) పార్టీలు కూడా పోటీ పడుతున్నాయి.

టీఆర్‌ఎస్‌ నుంచి కేశవరావు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా పోటీ చేస్తున్నట్లు ఇటీవల వార్తలు కూడా వచ్చిన విషయం తెలిసిందే. ఇరవై ఆరేళ్ల తర్వాత రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ పదవి కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటీ పడుతున్నాయి. చివరిసారిగా 1992లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్ధి నజ్మా హెప్తుల్లా(ప్రస్తుతం బీజేపీ), టీడీపీ అభ్యర్ధి రేణుకా చౌదరిపై పోటీ చేసి విజయం సాధించారు. జూలై 18 నుంచి ప్రారంభంకానున్న వర్ష కాల సమావేశంలో ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుంది.

Advertisement
Advertisement