సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ నూతన సారథి ఎంపిక ప్రక్రియ ఈనెల 10న కొలిక్కిరానుంది. ఇదే అజెండాతో ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఈనెల 10న రాహుల్ వారసుడిపై చర్చించేందుకు పార్టీ అత్యున్నత నిర్ణాయక సంఘం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్య్లూసీ) భేటీ జరగనుంది. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత సీడబ్ల్యూసీ సమావేశం జరుగుతుందని గతవారం కాంగ్రెస్ పేర్కొంది.
ఈనెల పదో తేదీ శనివారం ఉదయం 11 గంటలకు పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదివారం ట్వీట్ చేశారు. పార్టీ చీఫ్గా వైదొలగుతున్నట్టు రాహుల్ గాంధీ ప్రకటించిన అనంతరం జరగనున్న తొలి సీడబ్ల్యూసీ భేటీ ఇదే కావడం గమనార్హం. పార్టీ సీనియర్లు వారించినా తన నిర్ణయం మార్చుకునేందుకు రాహుల్ అంగీకరించని సంగతి తెలిసిందే.