డిసెంబర్‌ 9 ప్రకటన.. నేనెప్పుడూ మరిచిపోను! | Sakshi
Sakshi News home page

Published Wed, Nov 21 2018 2:05 PM

Congress Leader Chidambaram Fires on CM KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర సాకారానికి కారణమైన డిసెంబర్‌ 9, 2009 ప్రకటనను తాను ఎన్నడూ మరిచిపోలేనని, తెలంగాణకు తన హృదయంలో ప్రత్యేక స్థానముందని కేంద్ర మాజీ హోంమంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత చిదంబరం అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక ముందడుగు అయిన డిసెంబర్‌ 9 ప్రకటనను అప్పటి కేంద్ర హోంమంత్రిగా తాను చేసిన విషయాన్ని చిదంబరం గుర్తుచేసుకున్నారు. గాంధీ భవన్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

అధికారంలోకి కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలుచేయలేదని విమర్శించారు. ‘దళిత కుటుంబాలకు 3 ఎకరాలు పొలం ఎక్కడ అమలు చేశారు? భూమి పంపిణీ చేసి ఉంటే ఆ వివరాలు బహిర్గతం చెయ్యాలి.? కేసీఆర్ మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పులపాలు చేశారు. నాలుగున్నర ఏళ్లలో కేసీఆర్ రూ. 2.20 లక్షలు కోట్లు అప్పు చేశారు. కేసీఆర్ చెప్పిన రెండు లక్షల  డబుల్ బెడ్రూం ఇళ్ల హామీ ఏమైంది. లక్ష ఉద్యోగాలు, కోటి ఎకరాలకు సాగు నీరు ఏమయ్యింది?’ అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణాలో ప్రజాకూటమిని బలపర్చాలని చిదంబరం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దేశంలో ఆర్ధిక వ్యవస్థ ప్రమాదంలో ఉందని, దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకే.. బీజేపీయేతర పక్షాలు ఏకమయ్యాయన్నారు.

Advertisement
Advertisement