Sakshi News home page

నాలిక కరుచుకున్న నాగం

Published Tue, Jul 3 2018 2:47 PM

Congress Leader Nagam Janardhan Reddy Slams TRS Leaders In Hyderabad - Sakshi

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ అవినీతే రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకి  అని వ్యాఖ్యానించి కాంగ్రెస్‌ నేత నాగం జనార్దన్‌ రెడ్డి నాలిక కరుచుకున్నారు. అంతలోనే సర్దుకుని.. సారీ సారీ.. టీఆర్‌ఎస్‌ అవినీతే అభివృద్ధికి అడ్డంకి అని విమర్శించారు. మంగళవారం పార్టీ కార్యాయలంలో విలేకరులతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌పై మండిపడ్డారు. కాంగ్రెస్‌ నేతలు కాళ్లలో కట్టెలు పెడుతున్నారన్న టీఆర్‌ఎస్‌ నేతల మాటలను ఖండిస్తున్నానని చెప్పారు. ఎవరు కట్టెలు పెడుతున్నారు.. ఎవరి కాళ్లలో పెడుతున్నారు.. హరీష్‌ రావు కాళ్లలో పెట్టినారా లేక కేసీఆర్‌ కాళ్లలో పెట్టినారా అని సూటిగా ప్రశ్నించారు. ఇరిగేషన్‌ మంత్రి హరీష్‌ రావు పెద్ద యూజ్‌లెస్‌ఫెల్లో అని తీవ్రపదజాలం వాడారు.

కేసీఆర్‌, హరీష్‌ల అవినీతి బయటపెడతా అని వెల్లడించారు. కాళేశ్వరం పేరుతో బాంబే తమాషా చూపిస్తున్నారని, కాళేశ్వరం మోటార్లు కాంగ్రెస్‌ హయాంలో తెచ్చినవే కదా అని వ్యాఖ్యానించారు. ఆర్టీఐలో సమాచారం అడిగితే ఎందుకు ఇవ్వడం లేదని సూటిగా ప్రశ్నించారు. డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు, మూడెకరాల భూ పంపిణీ ఏం అయిందని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు వంద సీట్లు ఎలా వస్తాయో చూసుకుందామని అని అన్నారు. నాకు సెక్యూరిటీ తొలగిస్తే భయపడనని, ప్రజలే తనకు సెక్యూరిటీ ఉంటారని చెప్పారు. తాను తప్పు చేస్తే తనను జైల్లో పెట్టండి..రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారమే తాను ప్రశ్నిస్తున్నానని తెలిపారు.

 ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ఎందుకు పూర్తి చేయడం లేదని సూటిగా ప్రశ్నించారు. దోచుకోవడం, దాచుకోవడం కోసమే రీడిజైన్‌, రీఎస్టిమేషన్‌లు వేస్తున్నారని  విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిపై నాగం జనార్దన్‌ రెడ్డి ప్రశంసలు కురిపించారు. ఆయన ప్రవేశ పెట్టిన 108, ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడ్డాయని వివరించారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement