డిసెంబర్‌ 9 నుంచి రంగంలోకి: రేవంత్‌ | Sakshi
Sakshi News home page

డిసెంబర్‌ 9 నుంచి రంగంలోకి: రేవంత్‌

Published Thu, Nov 23 2017 12:50 AM

From December 9 to the field - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: డిసెంబర్‌ 9వ తేదీ నుంచి కార్యక్షేత్రంలోకి వస్తానని, ప్రభుత్వ తీరును ప్రజల్లో ఎండగడతానని ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ధర్నాలు, ఆందోళనలు, సభలకు అనుమతి ఇవ్వడం లేదు గానీ.. సన్‌ బర్న్‌ పార్టీలకు మాత్రం విచ్చలవిడిగా అనుమతిస్తున్నారని విమర్శించారు. 24న సన్‌ బర్న్‌ పార్టీకి ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

బుధవారం తన నివాసంలో మీడియాతో రేవంత్‌ ఇష్టాగోష్టిగా మాట్లాడారు. పబ్‌లకు అనుమతులివ్వడంలో తెలంగాణ నంబర్‌ వన్‌ స్థానంలో ఉందని.. క్లబ్బులు, పబ్బుల కోసమే తెలంగాణ వచ్చిందా? అని ప్రశ్నించారు. పబ్బులపై ఆసక్తి చూపుతున్న ప్రభుత్వం.. డ్రగ్స్‌ కేసును మరుగున పడేసిందని, అసలు డ్రగ్స్‌ కేసు విచారణ ఏమైందని ప్రశ్నించారు.

తెలంగాణ వచ్చిన తర్వాత సన్‌ బర్న్‌ పార్టీలకు క్రీడా మైదానాలు ఇస్తున్నారని, కొలువుల కొట్లాటకు అనుమతి ఇవ్వరుగానీ.. మాదక ద్రవ్యాలు వినియోగించే పార్టీలకు అనుమతిస్తారా అని నిలదీశారు. హై లైఫ్‌ పబ్‌ ఉదయం 5 వరకు నిర్వహి స్తున్నారని, పబ్‌ లోకి వచ్చే వారి కోసం డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కూడా గంట సేపు ఆపుతున్నారన్నారు. ఒక్క పబ్‌ నడపడానికి ఎందుకు అన్ని పబ్‌లు మూసేస్తున్నారని ప్రశ్నించారు. వీటిపై ప్రభుత్వం స్పందించాలని రేవంత్‌ డిమాండ్‌ చేశారు. 

Advertisement
Advertisement