న్యూఢిల్లీ : ఈవీఎంల పనితీరుపై అనుమానాలున్నాయంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేవనెత్తిన సందేహాలకు వివరణ ఇచ్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధం అయ్యింది. ఈ మేరకు స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం టీడీపీకి లేఖ రాసింది. టీడీపీనుంచి టెక్నికల్ టీంలో హరిప్రసాద్ను పంపటంపై ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈవీఎంల దొంగతనం కేసులో నిందితుడిని చంద్రబాబు తన బృందంలో ఈసీ వద్దకు ఎలా తీసుకొస్తారని, ఇలాంటి నేర చరిత్ర ఉన్న వ్యక్తులను తన బృందంలోకి బాబు ఎలా అనుమతిస్తారంటూ మండిపడింది. హరిప్రసాద్ కాకుండా ఇతర టెక్నికల్ టీంతో చర్చించేందుకు సిద్ధమని ఎలక్షన్ కమిషన్ తేల్చిచెప్పింది.ఈ నెల 15వ తేదీన ఉదయం 11 గంటలకు ఎలక్షన్ కమిషన్ను కలవవచ్చునని లేఖలో పేర్కొంది.
ఈ మేరకు ఈసీ ముఖ్య కార్యదర్శి.. టీడీపీ ఎంపీ రవీంద్ర కుమార్కు లేఖ రాసింది. ఈవీఎంలకు అమర్చిన వీవీప్యాట్లలో 3 సెకండ్లు మాత్రమే ప్రింట్ కనిపిస్తోందని, 7 సెకన్లు ఎందుకు రావడం లేదని.. ఈవీఎంలలో అవకతవకలు జరిగాయని హరిప్రసాద్ ఆరోపిస్తున్నారు. ఈవీఎంల పనితీరుపై అనుమానాలున్నాయంటూ చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రధాన అధికారి సునీల్ అరోరాను కలిసిన విషయం తెలిసిందే.