కాంగ్రెస్‌లోకి గద్దర్‌ తనయుడు.. | Sakshi
Sakshi News home page

Published Tue, Apr 24 2018 6:11 PM

Gaddar son to join Congress Party - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ నాయకుల చేరికలపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో బీజేపీకి రాజీనామా చేసి పార్టీలో చేరేందుకు ఎదురుచూస్తున్న సీనియర్‌ నేత నాగం జనార్దన్‌ రెడ్డికి గ్రీన్‌సిగ్న్‌ల్‌ ఇచ్చింది. అదేవిధంగా ప్రముఖ ప్రజాగాయకుడు గద్దర్‌ తనయుడు సూర్య, వ్యాపారవేత్త ఆది శ్రీనివాస్‌ కూడా కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాయలంలో రేపు (బుధవారం) ఉదయం 11 గంటలకు పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో వీరు పార్టీలో చేరనున్నారు. వీరికి పార్టీ కండువాలు కప్పి.. రాహుల్‌ సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తారని టీపీసీసీ వర్గాలు తెలిపాయి.
 
తెలంగాణ ఉద్యమాల్లో తన ఆట-పాటలతో, ధూమ్‌ధామ్‌లతో ఎంతో ఉత్తేజాన్ని కలిగించిన ప్రజాగాయకుడు గద్దర్‌. ఆయన తనయుడు సూర్య కాంగ్రెస్‌లో చేరడం కొత్త ఉత్సాహం నింపుతుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అలాగే, సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడే నాగం జనార్దన్‌రెడ్డితోపాటు బీజేపీకి చెందిన మరో నాయకుడు ఆది శ్రీనివాస్‌కు కూడా కాంగ్రెస్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. కాంగ్రెస్‌లో చేరనున్న నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన ఆది శ్రీనివాస్ బీజేపీకి గుడ్‌బై చెప్పారు. పార్టీ సభ్యత్వానికి, పార్టీలో తన పదవికి ఆయన రాజీనామా చేశారు.

Advertisement
Advertisement