అందుకే అసెంబ్లీకి వెళ్లొద్దనుకున్నాం | Sakshi
Sakshi News home page

అందుకే అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించాం

Published Thu, Nov 9 2017 12:30 PM

gadikota srikanth reddy question to speaker kodela - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు తీరు దారుణంగా ఉందని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. స్పీకర్‌ బాధ్యతారహితంగా వ్యవహరించడం సరికాదన్నారు. పార్టీ ఫిరాయింపుల అంశం కోర్టులో ఉందని స్పీకర్‌ చెబుతున్నారని.. అసెంబ్లీ నుంచి తమ పార్టీ ఎమ్మెల్యే రోజాను ఏడాది పాటు బహిష్కరించిన సమయంలో తనను ప్రశ్నించే అధికారం కోర్టులకు లేదని స్పీకర్‌ అన్నారని గుర్తు చేశారు.

ఫిరాయింపుదారులను అనర్హులుగా ప్రకటించాలనే తాము అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించినట్టు చెప్పారు. శాసనసభ సమావేశాలు ప్రారంభం కావడానికి 20 గంటల సమయం ఉందని, పార్టీ మారిన వారిపై వెంటనే చర్యలు తీసుకుంటే అసెంబ్లీకి హాజరవుతామని స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని స్పీకర్‌ గౌరవిస్తే సభకు వస్తామన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కేబినెట్‌లో చోటు కల్పించడం దారుణమన్నారు.

శాసనసభలో మేము అడిగే ప్రశ్నలకు మా పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలే మంత్రుల హోదాలో ఎలా సమాధానం ఇస్తారని ప్రశ్నించారు. తాను రాజీనామా చేశానని మంత్రి ఆదినారాయణరెడ్డి చెబుతున్నారని, మరి స్పీకర్‌ ఎందుకు స్పందించడం లేదని అడిగారు. చంద్రబాబు ప్రభుత్వం, స్పీకర్‌ ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. శాసనసభ అంటే టెంపుల్‌ ఆఫ్ డెమొక్రసీ అని పేర్కొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement