సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంపై లోక్సభలో తాము ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు పెరగడాన్ని సీఎం చంద్రబాబు సహించలేకపోతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మతో కలిసి ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. విపక్షాలన్నీ తమకు మద్దతు తెలిపితే టీడీపీకి మద్దతు ప్రకటించినట్టుగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై తాము అవిశ్వాసం పెట్టాకే చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని చెప్పారు. నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి ఇప్పుడు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అన్నది చంద్రబాబు కాదా? యువభేరిలకు విద్యార్థులకు పంపొద్దని కాలేజీలను ఆదేశించలేదా అని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు శకం ముగిసిందని, టీడీపీ పనైపోయిందని వ్యాఖ్యానించారు.
చీకటి రాజకీయాల్లో నేర్పరి
చంద్రబాబు జీవితమంతా అబద్ధాలు, కుమ్మక్కులేనని శ్రీకాంత్రెడ్డి దుయ్యబట్టారు. చీకటి రాజకీయాల్లో చంద్రబాబు నేర్పరి అని.. అప్పటి కేంద్ర మంత్రులు చిదంబరం, భరద్వాజ కాళ్లు పట్టుకుని వైఎస్ జగన్పై కేసులు పెట్టించారని ఆరోపించారు. జగన్పై నమోదైన దొంగ కేసులను కొట్టేస్తారేమోనని చంద్రబాబు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.
బండారం బయటపడింది: వాసిరెడ్డి పద్మ
ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు బండారం మరోసారి బయటపడిందని వాసిరెడ్డి పద్మ విమర్శించారు. అవిశ్వాసం పెడుతున్నామని చెప్పి, లోక్సభ వెల్లోకి వెళ్లి టీడీపీ ఎంపీలు ఆందోళన చేశారని వెల్లడించారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగకుండా టీడీపీ ఎంపీలు సభను ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు.