కాంగ్రెస్‌కు బై బై | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు బై బై

Published Mon, Aug 6 2018 10:33 AM

HD Deva Gouda Good Bye To Congress IN Karnataka - Sakshi

ఈ నెల 10 నుంచి ప్రారంభం కాబోయే స్థానికసంస్థల ఎన్నికల సంగ్రామంలో సంకీర్ణ కాంగ్రెస్‌–జేడీఎస్‌ ఎవరికివారేనని తేటతెల్లమైంది. కాంగ్రెస్‌ వైఖరి వల్లే తాము ఒంటరిగా పోటీ చేయబోతున్నట్లు దళపతి దేవేగౌడ ప్రకటించారు. అయితే అప్పటిలోగా ఏమైనా జరగవచ్చనేది రాజకీయ వర్గాల కథనం.

సాక్షి బెంగళూరు: త్వరలో జరిగే 105 స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌తో మైత్రి లేదని జేడీఎస్‌ అధినేత హెచ్‌డీ దేవెగౌడ స్పష్టం చేశారు. ఆదివారం నగరంలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు పాల్గొన్నారు. దేవెగౌడ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని తెలిపారు. ‘కాంగ్రెస్‌తో మైత్రి లేదు. అయితే కాంగ్రెస్‌ నిర్ణయం మేరకే మేం కూడా పొత్తు వదులుకుంటున్నాం. కాంగ్రెస్‌తో ఎలాంటి విభేదాలు లేవు.  స్థానిక ఎన్నికల్లో యువకులకు అధిక ప్రాధాన్యం ఇస్తాం.  ముస్లిం, బడుగు, బలహీన వర్గాల వారికి అవకాశం కల్పిస్తాం. అత్యధిక సీట్లను గెలవడమే లక్ష్యం. సంకీర్ణ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదు. వచ్చే సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహిస్తాం’ అని తెలిపారు. 

దేవేగౌడ నిర్ణయానుసారమే
ఈ సందర్భంగా జేడీఎస్‌ నాయకులు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు ఉండాలా, వద్దా అనేది దేవెగౌడ నిర్ణయించాలన్నా రు. ఆయన ఆదేశానుసారమే నడుచుకుంటామని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో జేడీఎస్‌తో మైత్రి వద్దనే నిర్ణయానికి కాంగ్రెస్‌ నాయకులు వ చ్చారని ఆరోపించారు. దీనిపై ఎలాంటి బహిరంగ వ్యాఖ్యలు చేయబోమన్నారు. అయితే కాంగ్రెస్‌ వైపు నుంచి స్నేహహస్తం ఎదురైతే కలిసి పోటీ చేసే అవకాశమూ లేకపోలేదని సమాచారం. 

Advertisement
Advertisement