జయలలిత పార్టీ నాశనం అవుతుందా ? | Sakshi
Sakshi News home page

'జయలలిత పార్టీకి ఏం కాదనుకుంట'

Published Wed, Feb 21 2018 3:27 PM

 I dont think that is happening : Veerappa Moily - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ నటుడు, రాజకీయ నేతగా మారిన కమల్‌ హాసన్‌ కొత్త పార్టీకి తమిళనాడులో పెద్దగా చోటు లేదని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఒకప్పుడు తమిళనాడుకు ఇన్‌చార్జ్‌గా వ్యవహరించిన వీరప్ప మొయిలీ అన్నారు. ఆయన పార్టీ పెద్దగా ఎదగబోదని, చాలా తక్కువ మార్జిన్‌ మాత్రమే సొంతం చేసుకుంటుందని జోస్యం చెప్పారు. తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు స్థానికంగా బలమైన ప్రాంతీయ పార్టీలని, మరోపక్క, సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ కూడా సొంతంగా పార్టీ పెడతారని ప్రకటించారని, ఈ నేపథ్యంలో కమల్‌, రజినీల పార్టీలు ముందుకెళ్లగలగాలంటే డీఎంకే, అన్నాడీఎంకేలతో కలవాల్సిందేనని చెప్పారు.

ఆ పార్టీలతో సంబంధాలు పెట్టుకోకుండా వారు మనుగడ సాగించడం కష్టమని అంచనా వేశారు. తమిళనాడులో ఉన్న చోటంతా కూడా డీఎంకే, అన్నాడీఎంకేలే ఆక్రమించాయని, కమల్‌కు భారీగా చోటు దక్కుతుందని తాను అనుకోవడం లేదన్నారు. బహుషా అన్నాడీఎంకే కూలిపోవచ్చని, ఆ స్థానాన్ని తాను ఆక్రమిస్తానని కమల్‌ అనుకుంటూ ఉండొచ్చేమోనని, అలా జరుగుతుందని మాత్రం తనకు అనిపించడం లేదని మొయిలీ సందేహం వ్యక్తం చేశారు. డీఎంకే, అన్నాడీఎంకేలను డామినేట్‌ చేసేలాగా కమల్‌ ప్రాంతీయ అజెండా ఉంటే మాత్రం చెప్పలేమని అభిప్రాయపడ్డారు. డీఎంకేతో కాంగ్రెస్‌ పార్టీది బలమైన సంబంధం అని, అది ఎప్పటికీ కొనసాగుతుందని, ఇప్పటికిప్పుడైనా ఆ పార్టీతో తాము పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమన్నారు.

Advertisement
Advertisement