కోల్ కతా:భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. శ్ర్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో కోహ్లి శతకం సాధించాడు. 119 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో సెంచరీ నమోదు చేశాడు. ఇది విరాట్ కు ఈడెన్ లో తొలి టెస్టు సెంచరీ కాగా, ఈ ఫార్మాట్ లో కోహ్లికి 18వ సెంచరీ. తద్వారా తన అంతర్జాతీయ సెంచరీల సంఖ్యను కోహ్లి 50కి పెంచుకున్నాడు. వన్డే ఫార్మాట్ లో ఇప్పటివరకూ కోహ్లి 32 సెంచరీలను సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ యాభై, అంతకుపైగా అంతర్జాతీయ సెంచరీలను సాధించిన భారత ఆటగాళ్లలో సచిన్ టెండూల్కర్ ముందువరుసలో ఉండగా, అటు తరువాత ఆ ఘనతను సాధించిన టీమిండియా క్రికెటర్ కోహ్లినే కావడం విశేషం. ఓవరాల్ గా ప్రపంచ క్రికెట్ లో 50 సెంచరీలను సాధించిన ఆటగాళ్లలో కోహ్లి ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. అంతకుముందు సచిన్(100), రికీ పాంటింగ్(71), సంగక్కరా(63),కల్లిస్(62), జయవర్దనే(54), ఆమ్లా(54), బ్రియన్ లారా(53)లు యాభైకి పైగా అంతర్జాతీయ సెంచరీలు సాధించిన ఆటగాళ్లు.
కోహ్లి శతకం సాధించిన తరువాత భారత తన రెండో ఇన్నింగ్స్ ను 352/8 వద్ద డిక్లేర్ చేసింది. దాంతో లంకేయులకు 231 పరుగుల లక్ష్యాన్ని విరాట్ సేన నిర్దేశించింది. అంతకుముందు 171/1 ఓవర్ నైట్ స్కోరుతో సోమవారం ఆఖరి రోజు ఆట ప్రారంభించిన భారత్ కు ఆదిలోనే షాకిచ్చాడు లక్మల్.తొలుత కేఎల్ రాహుల్(79;125 బంతుల్లో8 ఫోర్లు) ను అవుట్ చేసిన లక్మల్..కాసేపటికి చతేశ్వర పుజారా(22), అజింక్యా రహానే(0)లను వరసు బంతుల్లో అవుట్ చేశాడు. 21 పరుగుల వ్యవధిలో ముగ్గరు టాపార్డర్ ఆటగాళ్లను లక్మల్ అవుట్ చేసి లంక శిబిరంలో ఆనందం నింపాడు. ఇక రవీంద్ర జడేజా(9) వికెట్ ను పెరీరా సాధించాడు. కాగా, కోహ్లి మాత్రం నిలకడగా బ్యాటింగ్ చేస్తే ఇన్నింగ్స్ ను నిలబెట్టాడు. ఈ క్రమంలోనే తొలుత హాఫ్ సెంచరీ సాధించిన కోహ్లి..ఆపై దాన్ని సెంచరీగా మలచుకున్నాడు. భారత తన ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసే సమయానికి కోహ్లి(104 నాటౌట్), షమీ(12 నాటౌట్)లు అజేయంగా నిలిచారు.